ఏ నిబంధనల ప్రకారం ప్రైవేటీకరిస్తున్నారు?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటిగా పలు ప్రశ్నలు సంధించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి ప్రైవేటీకరిస్తున్నారు? నిర్ణయం తీసుకునేందుకు ముందు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన ఉద్యోగులు, భాగస్వాములు, రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించారా అని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

Published : 04 Apr 2024 04:12 IST

స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు,భాగస్వాములను సంప్రదించారా?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రానికి హైకోర్టు ప్రశ్నలు
విచారణ ఈ నెల 24కు వాయిదా

ఈనాడు, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు సూటిగా పలు ప్రశ్నలు సంధించింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి ప్రైవేటీకరిస్తున్నారు? నిర్ణయం తీసుకునేందుకు ముందు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు చెందిన ఉద్యోగులు, భాగస్వాములు, రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదించారా అని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించి, ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలంటూ ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన లేఖపై ఏమి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంది. ఆ లేఖపై స్పందించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వ్యాఖ్యానించింది. విశాఖ ఉక్కు నిర్వహణ విషయంలో అవసరమైన నిధులను విదేశాల నుంచి తెచ్చేందుకు, ఫెరా చట్టం కింద ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచేందుకు అనుమతించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఇచ్చిన వినతిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉక్కు పరిశ్రమకు చెందిన భూముల విక్రయం, తదితర అంశాలపై సమగ్ర వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్పష్టంచేసింది. మరోవైపు సొంత నిధులతో కొనుగోలు చేసిన 25 ఎకరాలను మాత్రమే విక్రయిస్తున్నామని, సేకరించిన భూములను విక్రయించడం లేదని విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌)తరఫు న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ చెప్పిన విషయాన్ని ధర్మాసనం నమోదు చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎన్‌ విజయ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ (సీబీఐ మాజీ జేడీ) తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అంతకు ముందు కేఏ పాల్‌ నేరుగా వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే విదేశాల నుంచి రూ.8వేల కోట్లు తీసుకొస్తానన్నారు.


ఆ ప్లాంట్‌ చరిత్ర తెలుసా?

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించింది. విశాఖ ఉక్కు కర్మాగారం చరిత్ర తెలుసా అని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఎన్ని ఉక్కు కర్మాగారాల్లో పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్‌ రుద్రప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. భూముల విక్రయం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనాలేదన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని