మేము సైతం సిద్ధం.. ట్రాఫిక్‌తో జనాల యుద్ధం

సీఎం ‘మేము సైతం సిద్ధం’ బస్సు యాత్ర సాధారణ ప్రజలకు చుక్కలు చూపించింది. జాతీయ రహదారి మీదుగా విజయవాడ, గుంటూరు దిశగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

Updated : 14 Apr 2024 06:37 IST

తాడేపల్లి, దుగ్గిరాల, న్యూస్‌టుడే: సీఎం ‘మేము సైతం సిద్ధం’ బస్సు యాత్ర సాధారణ ప్రజలకు చుక్కలు చూపించింది. జాతీయ రహదారి మీదుగా విజయవాడ, గుంటూరు దిశగా వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని వడ్డేశ్వరం వద్ద దాదాపు మూడున్నర గంటలపాటు ట్రాఫిక్‌ ఆగిపోయి ఎండలో నరకం చూశారు. బస్సులోని ప్రయాణికులు తాగేందుకు నీరు కూడా దొరకక పసిపిల్లలతో అవస్థలు పడ్డారు. మాకు పనులు ఉండవా? వాళ్ల మీటింగ్‌ అని చెప్పి అందర్నీ ఇబ్బందులు పెడతారా అని కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇంత కంటే దారుణం ఉంటుందా..?

ఈయన పేరు భాస్కరరావు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడ నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కు బస్సులో బయలుదేరారు. వడ్డేశ్వరం కూడలి వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్న బస్సులో ఆయన కూడా ఉన్నారు. అరగంట పాటు ఎదురు చూసి ఇక కూర్చునే ఓపిక లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను అతి కష్టం మీద కిందకు దింపి.. ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం ప్రజలను ఇలా అవస్థలు పెడతారా..? ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.


రైలు వెళ్లిపోతే ఎలా: కృష్ణకుమారి

నా పేరు కృష్ణకుమారి. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌ వెళ్లాలి. సాయంత్రం 6.15 గంటలకు విజయవాడలో రైలు ఉంది. తెనాలి నుంచి బస్సులో బయలుదేరితే సాయంత్రం 5.30 గంటలు అవుతున్నా వడ్డేశ్వరం వద్దే ఉన్నాను. రైలు వెళ్లిపోతే ఏం చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని