గూండాల నీడలో గుడివాడ

‘గుడివాడ’ అంటే.. దేవాలయాలకు నిలయమైన ఊరు అని అర్థం. దేవాలయం ఉన్న ప్రాంతంలో ఆధ్యాత్మికతతో నిండిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి గుడివాడ.. నేడు జూదవాడగా మారింది.

Published : 15 Apr 2024 05:50 IST

క్యాసినోలు, గంజాయి, సెటిల్మెంట్లు..
అన్న ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన గుడివాడేనా ఇది!
కృష్ణా జిల్లాలో నేడు జగన్‌ బస్సుయాత్ర.. ప్రశ్నించేందుకు స్థానికులు సిద్ధం
ఈనాడు - అమరావతి

‘గుడివాడ’ అంటే.. దేవాలయాలకు నిలయమైన ఊరు అని అర్థం. దేవాలయం ఉన్న ప్రాంతంలో ఆధ్యాత్మికతతో నిండిన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అలాంటి గుడివాడ.. నేడు జూదవాడగా మారింది. విదేశాలకు చెందిన క్యాసినోలను గుడివాడకూ పరిచయం చేశారు. గంజాయి ముఠాకు ఆవాసంగా, జూదాలకు కేంద్రంగా మారింది. ఏడాది పొడవునా జూదాలు నిర్వహిస్తున్నారు. చేపల చెరువులే జూద కేంద్రాలయ్యాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం జగన్‌ ఇక్కడికి వస్తున్నారు. ఏళ్లతరబడి ఇక్కడ పేరుకుపోయిన సమస్యలపై నిలదీసేందుకు స్థానికులు సిద్ధమవుతున్నారు.

గుడివాడ పట్టణానికి చారిత్రక నేపథ్యమే కాదు.. రాజకీయ చైతన్యమూ ఉంది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ చదువుకున్న ప్రాంతం. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఇక్కడే నడయాడారు. 1983లో తెదేపా స్థాపించిన నాటి నుంచి 11 సార్లు ఎన్నికలు జరిగితే.. ఎనిమిదిసార్లు తెదేపా విజయ కేతనం ఎగరవేసింది. ఒకే ఒక్కసారి కాంగ్రెస్‌ గెలుపొందగా, తెదేపా నుంచి నాయకుడిగా ఎదిగిన కొడాలి నాని మొదట తెదేపా తరపున రెండుసార్లు, వైకాపా తరపున రెండుసార్లు గెలిచారు. ప్రస్తుతం అయిదోసారి బరిలో దిగుతున్నారు. శాంతిభద్రతల వైఫల్యంలో, క్యాసినో పరిచయంలో, జూదగృహాల నిర్వహణకు అండదండలు, భూముల కబ్జాలు, ప్రైవేటు పంచాయితీలు, సెటిల్‌మెంట్లు.. గంజాయి బ్యాచ్‌ ఆగడాలు.. ఇలా ఒకటేంటి.. చాలావాటికి గుడివాడ నెలవుగా మారింది.

రాజకీయ చైతన్యం ఏదీ..?

గుడివాడ నుంచి ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు. గుడివాడలోనే చదివి తెదేపాను స్థాపించిన ఎన్టీఆర్‌ 1983లో, 1985లో పోటీచేసి గెలిచారు. 1985లో రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. రావి శోభనాద్రిచౌదరి విజయం సాధించారు. రావి హరగోపాల్‌ ఒకసారి గెలుపొందారు. ఆయన మరణం తర్వాత ఉప ఎన్నికలో రావి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, కటారి సత్యనారాయణరావు, కటారి ఈశ్వర్‌కుమార్‌ వంటి వారు పోటీచేసిన చరిత్ర గుడివాడది. 2004 నుంచి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో తెదేపా తరపున గెలిచిన ఆయన వైకాపా గూటికి చేరారు. నాటి నుంచి గుడివాడ అరాచక శక్తులకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

  • 2022 జనవరిలో కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్‌లో క్యాసినో నిర్వహించారు. సంక్రాంతి సంబరాల పేరుతో ప్రవేశ రుసుం రూ.10 వేలు పెట్టారు. 5 నిమిషాల్లో వెనక్కి వచ్చేస్తే.. రూ.5 వేలు. 10 నిమిషాలకు రూ.10 వేలు. అంతకుమించి లోపల సమయం గడిపితే.. తప్పనిసరిగా క్యాసినో ఆడాల్సిందే. ఒక కౌంటర్‌ పెట్టారు. అక్కడ కరెన్సీ నోట్లు తీసుకుని టోకెన్లు ఇచ్చారు. అలా మూడురోజుల్లో రూ.కోట్లలో వ్యాపారం జరిగింది. క్యాబరేలు ఏర్పాటు చేసినట్లు లోపలికి వెళ్లిన వారు చెబుతుంటారు. మందు, విందు సరేసరి. క్యాసినో ప్రముఖుడు చీకోటి ప్రవీణ్‌ ప్రధాన సూత్రధారి.
  • గుడివాడ అంటే ఇప్పుడు జూదవాడ అన్నట్లు మారిపోయింది. గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కొందరు గుడిసెలు ఏర్పాటు చేసి జూద గృహాలను నడుపుతున్నారు. ఇవి 365 రోజులూ నడుస్తాయి. దీనికి ఎమ్మెల్యే అండ దండలు పుష్కలం. పైకి గుడిసెల తరహాలోనే కనిపించే ఈ గృహాల లోపల ఏసీలు, బార్‌లు ఉంటాయి. ఇతర రాష్ట్రాల నుంచీ ఇక్కడికి వస్తుంటారు. ఓ కృష్ణుడు నడిపించే జూదగృహంపై కొత్తగా వచ్చిన పోలీసులు దాడి చేస్తే,.. రూ. 45 లక్షల నగదు దొరికినట్లు కేసులో చూపించారు. తర్వాత అంతా మమ అయింది.
  • గుడివాడ పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. అమ్మాయిలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పోలీసులు సైతం గంజాయి బ్యాచ్‌కే కొమ్ము కాస్తున్నారు.  
  • గుడివాడ అంటే.. ఒకప్పుడు మర్యాదకు మారు పేరు. ఆలాంటి ‘గుడి’వాడను బూతులవాడగా మార్చారు. ప్రస్తుతం ఎవరి నోరు తెరిచినా.. బూతుతోనే ప్రసంగం ప్రారంభం అవుతుంది.
  • దూషణలు సరేసరి.
  • నియోజకవర్గంలో సెటిల్‌మెంట్లు పెరిగాయి. భూముల క్రయవిక్రయాలు జరిగితే ఓ గ్యాంగ్‌ మధ్యలో దూరి చౌకగా కొట్టేయడం ఆనవాయితీగా మారింది. లేదంటే వివాదాల సెటిల్‌మెంట్‌ పేరుతో భారీగా కమీషన్లు గుంజడం ‘అక్షర’ సత్యం.
  • మట్టి దందా సరేసరి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఒక నేత వంద టిప్పర్లు కొనుగోలు చేశారు. అక్కడ పనులు పూర్తయ్యాక ఈ నియోజకవర్గంపై మట్టి దాడి చేశారు. ఈ వంద టిప్పర్లు ఒక్కరోజైనా ఖాళీ ఉంటే ఒట్టు!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని