డేగ కళ్లు ఏమయ్యాయి?

సీఎం జగన్‌పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్ఠంగా ఉంది. వివేకానంద స్కూల్‌ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Updated : 15 Apr 2024 06:55 IST

సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం
దాడి ముందూ తర్వాతా భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్ఠం
విద్యుత్తు సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్‌ లైట్లు పెట్టకపోవటం ఏంటి?
రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు?
ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏదీ?
ఈనాడు - అమరావతి

సీఎం జగన్‌పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్ఠంగా ఉంది. వివేకానంద స్కూల్‌ వైపు నుంచే రాయి వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోల్లోనూ అలానే కనిపిస్తోంది. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తయిన భవనాలను ముందే గుర్తించి, అక్కడ పోలీసులను మోహరిస్తారు. వీఐపీ వచ్చే ముందుగా ఆ మార్గంలో ఒకటికి రెండు సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. రెండంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్‌ గదుల తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ భవనమంతా ఖాళీగానే ఉంది. అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దాన్ని ఎందుకు విస్మరించారు? జగన్‌ పర్యటిస్తున్న మార్గంలో ముందస్తుగా డ్రోన్‌ ఎగరవేసి.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించి, భద్రతాపరంగా ఎక్కడైనా సమస్యలున్నాయా అనేది క్షుణ్ణంగా గమనిస్తుంటారు. మరి అలాంటిది వివేకానంద స్కూల్‌ భవనం లోపల నుంచి గానీ, భవనం పైనుంచి గానీ ఎవరైనా, ఏదైనా విసిరితే ముప్పు ఉండే అవకాశముందని ముందే ఎందుకు గుర్తించలేదు? వీఐపీ భద్రత పట్ల ఇది నిర్లక్ష్యం కాదా?

గంటలకొద్దీ ట్రాఫిక్‌ నిలిపేశారే..

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కోసం శనివారం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై గుంటూరు-విజయవాడ మధ్య, ఇటు విజయవాడ నగరంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిపేసి ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపించారు. జగన్‌ సర్వీసురోడ్డులో మధ్యాహ్న భోజనం కోసం ఆగితే... జాతీయ రహదారి మీద కూడా వాహనాల్ని నిలిపేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు.. భద్రతాపరంగా మాత్రం ఎందుకు అప్రమత్తంగా లేరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జగన్‌ పర్యటనకు రెండు రోజుల ముందే అక్కడ పర్యటించిన పోలీసులు.. శనివారం దుకాణాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. మరి అప్పుడే భద్రతాపరంగా ఎక్కడెక్కడ సమస్యలున్నాయో ఎందుకు గుర్తించలేదు? జగన్‌పై రాయి విసిరినప్పుడు విద్యుత్తు సరఫరా లేదు. అలాంటప్పుడు భద్రతా సిబ్బంది ఫోకస్‌ లైట్లు వేసి వారికి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కనిపించేలా చూసుకోవాలి. కానీ అదీ చేయలేదు. ముఖ్యమంత్రి బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు చుట్టూ ఉండే భద్రతా సిబ్బంది డేగకళ్లతో అన్ని వైపులా గమనిస్తుండాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే రక్షణ వలయంగా ఏర్పడి కాపాడాలి.

పురోగతి ఉందా? లేదా?

ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటన జరిగి 24 గంటలు దాటిపోయినా.. ఆదివారం రాత్రి వరకూ పోలీసులు ఏమీ ప్రకటించలేదు. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా ముగ్గురూ వైకాపాకు వీరవిధేయులే. భద్రతా వైఫల్యానికి ప్రధాన బాధ్యత వీళ్లదే. సీపీ కాంతి రాణా అయితే.... చిన్న చిన్న విషయాలకూ ప్రెస్‌మీట్లు పెట్టి వివరాలు చెబుతుంటారు. అలాంటిది ఇంత పెద్ద ఘటన జరిగితే ఆయన నుంచి అధికారికంగా ఎలాంటి స్పందనా లేదు. వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులే రాయి విసిరారని అనుకుంటే, ఈ పాటికే నిందితుడెవరో తేల్చేయాలి కదా! ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇంత పెద్ద ఘటన జరిగితే... డీజీపీ, నిఘావిభాగం అధిపతి, విజయవాడ సీపీ ఎవరూ దానిపై నోరు విప్పట్లేదు. ఈ ఘటనపై అధికార, విపక్ష నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. వాస్తవమేంటో ఆధారాలతో తేల్చాల్సిన బాధ్యత పోలీసులదే కదా! వాళ్లు దర్యాప్తులో ఎందుకింత జాప్యం చేస్తున్నారు? అత్యంత క్లిష్టమైన కేసుల్ని సైతం సాంకేతికతను ఉపయోగించేసి ఛేదిస్తున్నామని చెప్పుకొనే ఏపీ పోలీసులు.. ఈ దాడి ఘటనలో ఇప్పటివరకూ ఏం నిగ్గుతేల్చారో ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు?

అసలు తగిలింది రాయేనా? లేదా మరేదైనానా?

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌కు పదునైన రాయి తగలి రక్తగాయమైందని, అదే రాయి పక్కనే ఉన్న తన ఎడమ కంటికి తగిలి తనకూ రక్తగాయమైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైకాపా నాయకులు మాత్రం ఎయిర్‌బుల్లెట్‌, పెల్లెట్‌, క్యాట్‌బాల్‌ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు. అసలు వాస్తవమేంటి? ముఖ్యమంత్రి నుదుటిపై తగిలింది ఏంటో ఇప్పటివరకూ పోలీసులు తేల్చలేదు. అసలు తగిలిన వస్తువును స్వాధీనం చేసుకున్నారో, లేదో కూడా స్పష్టత లేదు. దర్యాప్తు రీత్యా ఇది చాలా అవసరం. నిజంగా వైకాపా నాయకులు ఆరోపిస్తున్నట్లు పెల్లెట్‌, ఎయిర్‌ బుల్లెట్‌ అయితే ఈ పాటికే వాటిని చూపించాలి కదా! కానీ అవెక్కడా చూపించట్లేదు. అయితే ముఖ్యమంత్రి నుదుటిపై తగిలిన గాయం చూస్తే అది తగిలిన గాయంలా కనిపించట్లేదని ఫోరెన్సిక్‌ నిపుణులు చెబుతున్నారు. రాయి వల్ల గాయమైతే.. అది దాని పరిమాణాన్ని బట్టి 25పైసల నాణెం పరిమాణం నుంచి ఎంతైనా వృత్తాకారంలో ఉంటుందని విశ్లేషిస్తున్నారు.


రాయి తగిలాకా నిర్లక్ష్యమే

రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేది ముఖ్యమంత్రికే. అలాంటి వీఐపీకి రాయి తగిలితే భద్రతా సిబ్బంది, పోలీసులు దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్‌గార్డులు, బుల్లెట్‌ప్రూఫ్‌ షీట్లు తెరవాలి. వీఐపీని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాలి. రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు. రాయి వచ్చిన వివేకానంద స్కూల్‌ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరినవారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ ఉండే వందల మంది సిబ్బంది ఎవరూ ఈ దాడిని గుర్తించలేదు, తక్షణం స్పందించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని