గుట్టుగా హెచ్‌ఆర్సీ కార్యాలయం తరలింపు

కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) కార్యాలయాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మరో భవనంలోకి తరలించేశారు. కమిషన్‌కు ఛైర్మన్‌ లేని సమయంలో ఎందుకు తరలించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Published : 15 Apr 2024 04:38 IST

ఇన్‌ఛార్జి కార్యదర్శి సూచనలను పరిగణనలోకి తీసుకోని వైనం

ఈనాడు, కర్నూలు: కర్నూలులోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్సీ) కార్యాలయాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా మరో భవనంలోకి తరలించేశారు. కమిషన్‌కు ఛైర్మన్‌ లేని సమయంలో ఎందుకు తరలించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి హోదా స్థాయి వ్యక్తిని కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తారు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఇక్కడ ఎవరు తీసుకున్నారు? అనే చర్చ న్యాయవాద వర్గాల్లో నడుస్తోంది. నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం కొన్నిరోజుల కిందట హెచ్‌ఆర్సీ ఇన్‌ఛార్జి కార్యదర్శికి లేఖ రాసింది. ఆ నిర్ణయం తీసుకునే అధికారం తనకు లేదని, అది ఛైర్మన్‌ తీసుకోవాల్సిన నిర్ణయమని చెబుతూ.. కొత్త ఛైర్మన్‌ వచ్చే వరకు నిరీక్షించాలని ఆయన సూచించారు. కమిషన్‌ కార్యాలయం కర్నూలులో ఏర్పాటుచేసిన ఉదంతం ఇప్పటికే హైకోర్టు పరిధిలో ఉన్నందున మళ్లీ దాన్ని వేరేచోటికి తరలించడం.. కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపారు. ప్రభుత్వ అతిథిగృహానికి వచ్చే రాజకీయ నాయకుల ప్రైవసీకి భంగం కలుగుతోందనే భావనతోనే హెచ్‌ఆర్సీ కార్యాలయాన్ని అక్కడి నుంచి మార్చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులు వస్తున్నారన్న సాకు చూపి కమిషన్‌ కార్యాలయాన్ని తరలించేశారనే ప్రచారం సాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని