బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి

బకాయి.. బకాయి... బకాయి...! రోడ్లు వేసిన గుత్తేదారులకు... భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు... ఆఖరికి ఆసుపత్రుల్లో భోజనం పెట్టిన వారికీ బకాయిలే... ప్రజా సంక్షేమానికి ఎన్నోసార్లు బటన్లు నొక్కానని నిత్యం బడాయికి పోయే జగన్‌కు...

Updated : 16 Apr 2024 13:15 IST

ప్రభుత్వాసుపత్రుల్లోని ఇన్‌పేషెంట్లను పట్టించుకోని జగన్‌
వారికి రోజూ రుచీపచీ లేని భోజనం వడ్డన
ఏడాదిన్నరగా రూ.25 కోట్లు కూడా చెల్లించని దుర్మార్గం
భారం భరించలేక నాణ్యతను వదిలేసిన గుత్తేదారులు
20 ఆసుపత్రుల్లో ‘న్యూస్‌టుడే’ పరిశీలన
ఈనాడు, అమరావతి

బకాయి.. బకాయి... బకాయి...!  
రోడ్లు వేసిన గుత్తేదారులకు... భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు...
ఆఖరికి ఆసుపత్రుల్లో భోజనం పెట్టిన వారికీ బకాయిలే...
ప్రజా సంక్షేమానికి ఎన్నోసార్లు బటన్లు నొక్కానని నిత్యం బడాయికి పోయే జగన్‌కు...
రోగుల బాగోగుల కోసం పాతిక కోట్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదు!
పైగా తమది సంక్షేమ పాలనంటూ ఊరూరా బాకాలు ఊదుతున్నారు!!

ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్‌ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చామని పదేపదే చెప్పే సీఎం జగన్‌... నిజానికి రోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. వారికి నాణ్యమైన ఆహారం అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఏ ఆసుపత్రిలో చూసినా చాలీచాలని అల్పాహారం, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లలాంటి కూరలు, సాంబారే ఇస్తున్నా పట్టనట్లు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ పనులు చేసిన గుత్తేదార్లకు రూ.కోట్లలో బిల్లుల పెండింగ్‌ పెట్టిన సర్కారు ఐదేళ్లలో అన్ని రంగాలను అల్లాడించింది. అదేకోవలో... ఆసుపత్రుల్లోని రోగులకు భోజనాలు అందిస్తున్న గుత్తేదారులకు కూడా ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడంలేదు. ఇవేవో వందలు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే అదీ కాదు... అన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రూ.25 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయి. ఈ మాత్రం విడుదల చేయడానికి ముఖ్యమంత్రికి తీరిక లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యం ప్రభావం రోగులకు వడ్డించే ఆహార నాణ్యతపై పడుతోంది. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అదించడంలేదు. తక్కువ ధరకు అందుబాటులో ఉండే కూరగాయలతోనే వంటలు తయారవుతున్నాయి. ఫలితంగా చికిత్స పొందుతున్న రోగులు కోలుకునే సమయం పెరుగుతోంది. ఈ దుస్థితిపై రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులను ‘న్యూస్‌టుడే’ ప్రతినిధులు ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా తాము అనుభవిస్తున్న బాధలను గుత్తేదారులు, సరైన ఆహారం అందక తాము పడుతున్న ఇబ్బందులను రోగులు వివరించారు. నెలల తరబడి ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోతే నాణ్యమైన ఆహారాన్ని ఎలా అందించగలమంటూ గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు.

చిమిడిన అన్నం... రుచిలేని కూరలు

అన్ని ఆసుపత్రుల్లో అల్పాహారంగా ఎక్కువగా పులిహోర, కిచిడీ, ఉప్మా  పెడుతున్నారు. ఉదయం ఇచ్చే పాలు పలుచగా ఉంటున్నాయి. భోజనంలో... చిమిడిన అన్నం, రుచీపచి లేని కూరలు, పప్పే కనిపించని నీళ్లలాంటి సాంబారు ఇస్తున్నారు. మజ్జిగ సైతం నీళ్లలా ఉంటోంది. మధ్యాహ్నం ఇస్తున్న అరటిపండ్లు, గుడ్లు పరిమాణంలో చిన్నగా ఉంటున్నాయి.

  • ఖర్చు తగ్గించుకునేందుకు గుత్తేదారులు సిబ్బందిని తగ్గించేశారు. దాంతో భోజన వడ్డనకు వేళలు పాటించడంలేదు. ఒక్కోసారి అల్పాహారం ఉదయం  11.30 గంటలకు, మధ్యాహ్న భోజనం 1.30 గంటల తర్వాత అందిస్తున్నారు. ఈ కారణంగా వార్డుల్లోని 20% మంది రోగులకు భోజనం అందడం లేదు.
  • వడ్డనలోనూ వేగం పెంచారు. గతానికి భిన్నంగా కంచంలో ఒకేసారి అన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. దాంతో రోగులకు తక్కువ పరిణామంలో ఆహారం అందుతోంది. కొన్నిచోట్ల 50-60 మందికే వండుతూ వంద మందికి సరిపెడుతున్నారు.
  • ప్రసూతి ఆసుపత్రుల్లో బాలింతలకు ప్రత్యేక మెనూ పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నిచోట్ల భోజనాలను వార్డుల వద్ద కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలోని కౌంటర్‌లో అందిస్తున్నారు.
  • ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏడు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్‌సీ) ఏడాదిగా భోజనం అందడంలేదు.

ఒక రోగికి రోజుకు రూ.80

ఇన్‌పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు మెనూ రూపొందించారు. ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం సరఫరా చేయాలి. దీన్ని పాటిస్తూనే ప్రతిరోజూ ఒక గుడ్డు, అరటిపండు ఇవ్వాలి. షుగర్‌ బాధితులకు రాగి సంగటి పెట్టాలి. ఇందుకు ఒక సాధారణ రోగికి రోజుకు రూ.80, బాలింతలకు రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి

వంట గదుల పరిశుభ్రత, కూరగాయలు, బియ్యం, పప్పులు, నూనెల నాణ్యతను వైద్యాధికారులు నిత్యం పరిశీలించాలి. వీరు రుచి చూసిన తర్వాతే రోగులకు భోజనం అందించాలి. కానీ, ఆచరణలో ఇవేమీ జరగడంలేదు.

ఇవీ ‘న్యూస్‌టుడే’ పరిశీలించిన ఆసుపత్రులు

గుంటూరు జీజీహెచ్‌, తిరుపతి రుయా ఆసుపత్రి, నరసరావుపేట, పాడేరు, భీమవరం, అనంతపురం, అనకాపల్లిల్లోని జిల్లా ఆసుపత్రులు.... నర్సీపట్నం, గుడివాడ, బాపట్ల, చీరాల, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఉరవ కొండ, కళ్యాణదుర్గం, ధర్మవరంలోని ప్రాంతీయ ఆసుపత్రులు... మచిలీపట్నం, విజయనగరం, ఏలూరులోని సర్వజన ఆసుపత్రులు, అవనిగడ్డలోని సీహెచ్‌సీ.

అప్పులు తెచ్చి... బంగారం కుదువపెట్టి అవస్థలు

  • తిరుపతి రుయా ఆసుపత్రిలో డైట్‌ కాంట్రాక్టరుకు రూ.1.50 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల గుత్తేదారులందరికీ కలిపి రూ.2 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది.
  • మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వైకాపాకు చెందిన ఓ బడా గుత్తేదారు నుంచి సబ్‌ కాంట్రాక్టు తీసుకున్న ఉప గుత్తేదారుకు నెలకు రూ.5లక్షల వరకు ఖర్చు అవుతోంది. 2022 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రూ.70 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బంగారం అమ్మి, అప్పులు తెచ్చి రోగుల ఆకలి తీరుస్తున్నానని, రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు గుత్తేదారు వాపోతున్నారు.
  • అవనిగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం గుత్తేదారుకు 15 నెలల నుంచి బిల్లులు ఆగిపోయాయి. గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి గుత్తేదారుకు రూ.1.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.
  • విజయనగరం సర్వజన ఆసుపత్రి(ఘోష కలుపుకొని)లో కాంట్రాక్టరుకు రూ.1.09 కోట్ల వరకు, మన్యం జిల్లాలోని వారికి రూ.40 లక్షల వరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని