జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం.
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు...
దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు...
దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం...
చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం...
సీఎం సొంత జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న దళిత మహిళ జ్యోతిపై వైకాపా కీచకులు దాడిచేశారు. ఆమె దుస్తులు చించేసి తీవ్రంగా కొట్టారు. అనంతపురం జిల్లాలో వైకాపా ఇసుకాసురులను నిలదీసిన దళిత రైతులను కులం పేరుతో దూషిస్తూ, దౌర్జన్యం చేశారు.
‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది! నోరెత్తిన దళితుల నెత్తురు కళ్లజూసిన జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది!
భూకబ్జాల గురించి బయట పెడుతున్నారని నంద్యాల జిల్లాలో దళిత న్యాయవాది విజయ్కుమార్పై వైకాపా కిరాతక నేతలు కక్షగట్టారు. విజయ్ను చెప్పులతో కొడుతూ కాళ్లతో తంతూ బూతులు తిడుతూ వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. బాధితుడిపైనే ఎదురు కేసు పెట్టారు. మా అబ్బాయిని కొట్టొద్దంటూ కన్నీళ్లతో వేడుకున్న విజయ్ తల్లి మీదా వైకాపా దుర్మార్గులు దాష్టీకం చేశారు.
‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది! ఎదిరించిన దళితుల ఎముకలేరేసిన జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది!
కరోనా రోజుల్లో మాస్కులైనా ఇవ్వకుండా వైద్యం చేయమంటే ఎలాగని విశాఖ దళిత వైద్యుడు సుధాకర్ నిలదీశారు. అంతే.. ఆయనను సస్పెండ్ చేశారు. నడిరోడ్డు మీద లాఠీలతో చావబాదారు. పిచ్చివాడనే ముద్రవేసి మానసికంగా హింసించారు. ఆఖరికి సుధాకర్ను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. సర్కారీ తప్పిదాలపై గళమెత్తినందుకు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ న్యాయాధికారి, దళితుడు రామకృష్ణను నానా హింసలుపెట్టారు.
‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది! ప్రశ్నించిన దళితులను పిశాచిలా పట్టిపీడించిన జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది!
= వైకాపా నాయకుడు, అతని సోదరుడు, స్థానిక ఎస్సై బెదిరింపులను తట్టుకోలేక పోతున్నానంటూ లేఖ రాసి పశ్చిమ గోదావరి జిల్లా దళిత ఆక్వారైతు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రూ.20 లక్షలు అప్పు తెచ్చి చేపల చెరువు పెట్టుకుంటే వైకాపా నేత, అతని అనుచరుడు కలిసి వేధిస్తున్నారంటూ నెల్లూరు జిల్లా దళిత యువకుడు కరుణాకర్ ప్రాణాలు తీసుకున్నారు.
‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది! జీవితంలో ఎదిగేందుకు చెమట చిందించే దళితులను చంపేసిన జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది!
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలోని ఒక హోటల్లో బాబాసాహెబ్ బొమ్మ ముద్రించిన పేపర్ ప్లేట్లలో ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. ఎంగిలి ప్లేట్ల మీద రాజ్యాంగ నిర్మాత చిత్రమేంటని నిలదీసిన పాపానికి 18 మంది దళిత యువకులపై కేసులు బనాయించారు. రోజుల తరబడి వారు జైల్లో మగ్గిపోయేలా చేశారు.
‘‘నా ఎస్సీలు..’’ అంటూ దీర్ఘాలు తీసే జగన్మోహన్ రెడ్డి రాజ్యమిది! పైకి అంబేడ్కర్ జపం చేస్తూ, ఆయనను అడుగడుగునా దారుణంగా అవమానించిన జగన్ మోహన్ రెడ్డి రాజ్యమిది!
పాశవిక పాలకుడు
అంటరానితనమనే అమానవీయ సంస్కృతిని రూపుమాపడానికి జీవితాంతం పోరాడిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్. భారతీయులు అందరూ సమానులేనన్న రాజ్యాంగ నిర్దేశాన్ని నాలుగు తాటిచెట్ల నిలువున పాతిపెట్టేసిన పాశవిక పాలకుడు జగన్మోహన్ రెడ్డి. రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సిన పాలనా యంత్రాంగంతో ఆయన వైకాపాకు ఊడిగం చేయించారు. దాంతో దళితుల మీద వైకాపా నేతలు, కార్యకర్తల ఆగడాలు విశృంఖలమయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా చాకార్లపల్లిలో దళితులు ఏర్పాటుచేసిన వినాయకుడి విగ్రహం నిరుడు ముందుగా నిమజ్జనానికి బయల్దేరింది. జగన్ పార్టీ స్థానిక నేతలకు అది కంటగింపు అయ్యింది. కొందరు యువకులను దళితులపైకి ఉసిగొల్పి దుర్భాషలాడించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వైకాపాసురులు ఇంకా పేట్రేగిపోయారు. తమవారిని రెచ్చగొట్టి దళిత కాలనీపై దాడి చేయించారు. అక్కడివారిని దారుణంగా కొట్టించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా కుండలేశ్వరానికి చెందిన భావనకుమార్.. ఆర్బీకేలో వ్యవసాయ సహాయకుడు. దళితుడైన కుమార్ తన ఎదుట కుర్చీలో కూర్చున్నాడని చెప్పి, అతనిపై దాడి చేశాడొక వైకాపా నాయకుడు. నిడదవోలులో గణపతి అనే దళిత సచివాలయ ఉద్యోగిని నడిబజార్లో చెప్పుతో కొట్టాడో జగన్ పార్టీ నేత. ‘ఎస్సీలకు పొగరు పెరిగిపోయింది’ అంటూ నానా తిట్లు తిట్టాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో కాండ్రు శ్యామ్కుమార్ అనే దళితుడిపై కొద్దినెలల క్రితం హరీశ్రెడ్డి, మరికొందరు దాడిచేసి పైశాచికంగా ప్రవర్తించారు. ‘‘అధికారంలో ఉన్నది మేం. మేం కొట్టినా తిట్టినా పడాల్సిందే. అతిగా మాట్లాడితే చంపేస్తాం’’, ‘‘మీ దళితులకు ఇంతే జరగాలి.. మిమ్మల్ని ఇంతే కొట్టాలి’’ అంటూ ఆ కిరాతకులు చెలరేగిపోయినట్లు బాధితులు, అతని కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. దళితులపై దమన కాండకు పాల్పడిన స్వపక్ష నేతలను చంకనెక్కించుకున్న జగన్ కారణంగానే రాష్ట్రంలో కులవివక్ష కోరలు ఇంతగా పదునెక్కాయి.
అనంతబాబుకు ప్రేమతో.. జగన్!
నేతి బీరకాయలో నెయ్యి ఉండదు.. జగన్మోహన్ రెడ్డి మాటల్లో నిజం ఉండదు. ‘‘దళితులపై దాడులను, అనైతిక చర్యలను ఉపేక్షించేది లేదు. బాధ్యులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవు’’ అని సీఎంగా జగన్ ఢంకా బజాయించారు. దళితులకు రక్షణగా నిలబడాల్సిన బాధ్యత మనపై ఉందని కలెక్టర్లు, ఎస్పీలకు ఆయన బోలెడన్ని సుద్దులూ చెప్పారు. అదే జగన్- దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, అతడి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును వెంటేసుకుని తిరుగుతున్నారు. మొన్న జనవరిలో కాకినాడలో తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో అనంతబాబును ముందు వరసలో కూర్చోబెట్టుకున్నారు జగన్. దళితులను చంపుకొనితినే తోడేళ్లను ప్రేమగా సాకడమంటే తనకు మహాఇష్టమని ఆయన నిరూపించు కున్నారు. దళితుడి హత్యకేసులో నిందితుణ్ని జగనే ముద్దుచేస్తుండటంతో పోలీసులూ అనంతబాబుకు సాగిలపడుతున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదేంటని నిలదీసిన నేరానికి అనంతబాబు గన్మెన్, ఆయన అనుచరులు తమను దారుణంగా కొట్టారని అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ యువకులు తాజాగా వాపోయారు. ఇదీ- జగన్మోహన్ రెడ్డి రాజ్యం! దళితులను చంపి, గిరిజనుల తలలు పగలగొట్టే పైశాచికత్వాన్ని నరనరాల్లో నింపుకొన్న నరరూప రాక్షసుల రాజ్యం!
దురహంకారి జగన్ పాలనలో..
జనమంతా తన దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడి బతకాలనుకునే భూస్వామ్య మనస్తత్వం జగన్ది. తనను కాదన్న వారిని వెంటాడి వేధించే దుర్మార్గమూ ఆయనలో నిండుగా ఉంది. జగన్ శిష్యరికంలో వైకాపా నేతాగణాలన్నీ అలాగే మంచీ మానవత్వం లేని కర్కశ మూకలుగా తయారయ్యాయి. అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లిలో ఓచోట దళితులు గుడిసెలు వేసుకున్నారు. మొన్న మార్చి మొదటివారంలో రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి అనుచరులు ఆ దళితుల మీద పడి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. వారి గుడిసెలను తగలబెట్టారు. దళితులు ఉంటున్న స్థలాన్ని ఆక్రమించేందుకు వైకాపా నేతలు అంతకు మునుపే సిద్ధమయ్యారనే వాదనలున్నాయి. గుడిసెలు ఖాళీచేసి వెళ్లిపోవాలని జగన్ పార్టీ నాయకులు తమను చెండుకు తింటున్నారని, కాదన్నందుకు దౌర్జన్యం చేశారని బాధిత దళితులు మొత్తుకుంటున్నారు. దళితుల చేతుల్లో ఉన్న కొద్దోగొప్పో భూమిని లాగేసుకోవడానికి వైకాపా రక్కసి మందలు చేయని అరాచకాలంటూ లేవు. చిత్తూరు జిల్లా బోయకొండ క్రాస్లో దళితుడైన శ్రీనివాసులు కుటుంబానికి కొంత భూమి ఉంది. జగన్ పార్టీ మనుషుల కన్ను దాని మీద పడింది. ఆ భూమిని చేజిక్కించుకోవడానికి వచ్చినవాళ్లు.. శ్రీనివాసులు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళలను జుట్టుపట్టుకుని కాళ్లతో తన్నారు. కర్రతో నడుములు విరగ్గొట్టారు. ఓ దివ్యాంగుడి వేళ్లు విరిచేశారు. అనంతపురం జిల్లా వెలిగొండ, నెల్లూరు జిల్లా నాగుల వెల్లటూరుల్లో కూడా దళితుల భూములను సొంతం చేసుకోవడానికి వైకాపా నాయకులు తెగబడ్డారు. అడ్డొచ్చిన వారిని చావబాదారు. బాపట్ల జిల్లా చుండూరుపల్లిలో దళిత రైతు దంపతులను జగన్ పార్టీ సానుభూతిపరులు కత్తులతో నరికారు. ఆధిపత్య దురహంకారం, హింసోన్మాదం బుసలుకొట్టిన జగన్ ఏలుబడిలో ఎస్సీలకు ఎక్కడా కనీస రక్షణ లేకుండా పోయింది. ఈ వాస్తవాన్ని దాచేసి దళితుల అభ్యున్నతి కోసం తాము తెగ పాటుపడ్డామంటూ నెత్తురు అంటిన చేతులతోనే జగన్ నిర్లజ్జగా చాటింపు వేసుకుంటున్నారు.
జగన్ హఠావో.. దళిత్ బచావో
‘‘క్రైమ్రేటును తగ్గించడానికి మన పోలీసులు నిరంతరం కృషిచేస్తున్నారు’’ అని ఖాకీలకు జగన్ కితాబిచ్చారు. ఏపీ పోలీసుల పనితీరు మెరుగుపడిందనీ ఆయన చంకలు గుద్దుకున్నారు. నిజానికి ఖాకీల పని తీరు బాగుందంటే అది జగన్ పార్టీకి పాదసేవ చేయడంలోనే! సామాన్యులకు.. ముఖ్యంగా దళితులకు భద్రత కల్పించడంలో పోలీసుల పనితీరు గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. జగన్ సొంత జిల్లాలో పశుసంర్థకశాఖ ఉపసంచాలకుడు, దళిత అధికారి డాక్టర్ అచ్చెన్న అతిదారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన అదృశ్యంపై అంతకు కొన్ని రోజుల ముందే ఫిర్యాదు వచ్చినా పోలీసులు పెద్దగా స్పందించలేదు. జగన్ దృష్టిలో పోలీసులు బాగా పనిచేయడమంటే ఇదే కాబోలు! ఇక గుంటూరు జిల్లాలోని కొన్ని గ్రామాల్లో దళితులపై వరస దాడులు జరిగాయి. ఆ ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్- ఖాకీల వైఫల్యాన్ని ఎండగట్టారు. పోలీసులు ఓ సామాజిక వర్గానికి మద్దతుగా నిలుస్తున్నారని, బాధితుల కుటుంబాలు ఫిర్యాదు చేసినా రోజుల తరబడి కేసులు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ జగన్ ఏలుబడిలో దళితుల దయనీయ స్థితి! దళితులను చిత్రహింసలు పెడుతూ, వారిపైనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులను నమోదు చేస్తూ వైకాపా దాసానుదాసులైన పోలీసులు గత అయిదేళ్లలో అంతులేని అరాచకాలకు పాల్పడ్డారు. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి ‘‘నా ఎస్సీలు..’’ అంటూ కపట డైలాగులు కొట్టే జగన్- అణగారిన వర్గాలపై జరుగుతున్న హింసాకాండను అడ్డుకోలేదు. సరికదా, అనంతబాబు లాంటి తన సామంతులకు రాచమర్యాదలు చేయించి దళిత సమాజానికి తీరని ద్రోహం చేశారు. అందుకే విద్యాధికులైన ఎస్సీ యువత ఇప్పుడు ‘జగన్ హఠావో - దళిత్ బచావో’ (దళితులు బతకాలంటే జగన్ను వెళ్లగొట్టాల్సిందే) అని గట్టిగా నినదిస్తున్నారు. అవును.. అంబేడ్కర్ ఆశించిన స్వేచ్ఛాసమాజం సాకారం కావాలంటే- జగన్ మోహన్ రెడ్డి దానవ రాజ్యం కూలిపోవాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ