ఆంధ్రాకు అప్పులే శాపం

‘ఏపీలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. భారీగా చేసిన అప్పులు భవిష్యత్తులో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

Updated : 21 Apr 2024 08:12 IST

నిరుద్యోగం తాండవిస్తోంది..
సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా!
రాష్ట్ర రుణాలు రూ. 14 లక్షల కోట్లు దాటిపోయాయి..
జీఎస్‌డీపీలో 33 శాతానికి చేరాయని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది
ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుంది
దీర్ఘకాలంలో అన్ని రంగాలపైనా దుష్ప్రభావం చూపుతుంది
‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో ఆర్థికవేత్త మహేంద్రదేవ్‌
ఈనాడు - హైదరాబాద్‌

‘ఏపీలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. భారీగా చేసిన అప్పులు భవిష్యత్తులో రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రాబోయేతరాలు ఈ రుణ భారాన్ని మోయాల్సి ఉంటుంది’ అని ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ మహేంద్రదేవ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమం మధ్య సమతుల్యం లోపించిందని అన్నారు. ఏపీ వృద్ధిలో వ్యవసాయానిది కీలకపాత్ర అని, అలాంటి రంగం సంక్షోభంలో ఉందని, 50% సాగు ఇప్పటికీ వర్షాధారంగానే ఉందని పేర్కొన్నారు. పోలవరం సహా అనేక ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల సాగునీటి వసతి కల్పించలేకపోయారని వివరించారు. తెలుగువారైన ప్రొఫెసర్‌ దేవ్‌ సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్‌) డైరెక్టర్‌గా, ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చి వైస్‌-ఛాన్స్‌లర్‌గా, వ్యవసాయ ధరల నిర్ణాయక కమిటీ (అగ్రికల్చర్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైసెస్‌ కమిషన్‌) ఛైర్మన్‌గా పని చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు విశ్వవిద్యాలయాల్లో వివిధ హోదాల్లో పని చేసి ప్రస్తుతం ఎకనమిక్‌ అండ్‌ పొలిటికల్‌ వీక్లీ (ఈపీడబ్ల్యూ) సంపాదకుడిగా ఉన్నారు. ఏపీలో పరిస్థితులతో పాటు పలు ఆర్థికాంశాలపై ‘ఈనాడు‘కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలివి..

ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయి. కార్పొరేషన్ల ద్వారా పరోక్షంగా తీసుకుంటున్న అప్పులు లెక్కలోకి రావడం లేదు. పార్కుల్ని, బస్సుల్ని, బస్‌ స్టేషన్లనూ తాకట్టు పెడుతున్నారు. వీటి పర్యవసానాలపై మీరేమంటారు?

బడ్జెట్‌ నూరు రూపాయలు ఉందనుకొంటే ఇందులో ఆర్థిక సేవలు, వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక సేవలైన విద్య, ఆరోగ్యం మొదలైన వాటికి తగినంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు కచ్చితంగా వెచ్చించాల్సినవి కొన్ని ఉంటాయి. వడ్డీ చెల్లింపులు, జీతాలు వంటివి. ఇవన్నీ పోనూ కొంత మిగులుతుంది. కానీ మొత్తం సంక్షేమం కింద ఖర్చు చేస్తే ఇవి దెబ్బతింటాయి. ఆర్థిక సేవలు, సామాజిక సేవలు ఎక్కువ దెబ్బతింటాయి. ఏపీ ఆర్థిక సర్వే, బడ్జెట్‌ నివేదికల ప్రకారం సంవత్సరానికి రూ. 50 వేల కోట్ల చొప్పున ఈ అయిదేళ్లలో రూ. రెండున్నర లక్షల కోట్లు డీబీటీ కింద వెచ్చించారు. రాష్ట్ర సొంత వార్షికాదాయం రూ. 85 వేల కోట్లు. ఇందులో 60 నుంచి 65 శాతం దీనికి వెళ్తున్నాయి.
నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూలో కూడా మూడోవంతు. అభివృద్ధి-సంక్షేమం రెండూ ఉంటే కానీ ఎకానమీ సుస్థిరత ఉండదు. దీని పర్యవసానం ఏమిటంటే, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ సుబ్బారావు చెప్పినట్లు భవిష్యత్తు తరాల మీద అప్పు పెంచుతున్నాం. సంక్షేమ పథకాలు ఉండాలి. కానీ అభివృద్ధి-సంక్షేమం మధ్య సమతుల్యం అవసరం. ఆర్‌బీఐ లెక్కల ప్రకారం అప్పులు జీఎస్‌డీపీలో 33 శాతానికి చేరాయి. కార్పొరేషన్ల గ్యారంటీలు అన్నీ లెక్కిస్తే మొత్తం రూ.పది లక్షల కోట్లని, ఓ లెక్క ప్రకారం రూ. 14 లక్షల కోట్లు అని కూడా అంటున్నారు. అప్పులకు వడ్డీ, అసలు రెండూ చెల్లించాల్సిందే. అప్పులకు, సంక్షేమానికి ఖర్చు చేస్తే ఆర్థిక సేవలు, సామాజిక సేవలు దెబ్బతింటాయి. వాజపేయీ సమయంలో జాతీయ రహదారులకు ప్రాధాన్యంఇచ్చి నిర్మించారు. ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం సూరత్‌, శ్రీకాకుళం వంటి చోట్ల ఈ రహదారుల కారణంగా వ్యాపారం, ఉపాధి అవకాశాలు నూరుశాతం పెరిగాయి. కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన చాలా కీలకం. గ్రామీణ మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు తదితరాలపై ఖర్చు చేయాలి. తద్వారా పేదరికం తగ్గుతుంది. ఇప్పుడు విద్య, ఆరోగ్యంపై కొంత ఖర్చు చేయగలుగుతున్నా, భవిష్యత్తులో చాలా కష్టమవుతుంది.

నాడు-నేడు కార్యక్రమం వల్ల విద్యారంగంలో నిజమైన మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారా?

విద్య, వైద్యం రంగాల్లో కేటాయింపులు జీడీపీలో 5 శాతం కన్నా తక్కువే. ఈ రంగాల్లో ఏపీ వెనకబడి ఉంది. నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన పరిస్థితుల్లేవు. మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే వెనకబడి ఉన్నాం. కొంత ప్రభావమున్నా.. పెద్దగా మార్పులేమీ జరగలేదు. ఏపీలో అక్షరాస్యత 66 శాతమే. జాతీయ స్థాయిలో 78 శాతం. అంటే నాడు-నేడు కార్యక్రమాలు పెద్దగా ప్రభావం చూపలేదు.

ఏపీలో ఒక్కో వ్యక్తిపై ఎంత అప్పు ఉంటుందంటారు?

ఆర్‌బీఐ ప్రకారం 2019లో ఉన్న అప్పు రూ. 2.2 లక్షల కోట్లు కాగా, 2022-23లో ఉన్న అప్పు రూ. 4.56 లక్షల కోట్లు. అంటే రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. అప్పులు ఏటా 15 నుంచి 20 శాతం చొప్పున పెరుగుతున్నాయి. అంతకుముందు కూడా పెరిగినా ఇప్పటిలా కాదు. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి తగ్గట్లుగానే తలసరి అప్పు కూడా పెరిగింది.   ఆర్‌బీఐ అధికారికంగా చూపించిన దానికంటే, వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చినవి, గ్యారంటీలు ఇవ్వనివి ఇలా అన్నీ కలిపి తలసరి రుణభారం చాలా ఎక్కువగానే ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవిక ఆర్థిక వృద్ధి ఎలా ఉందంటారు?

2019-20 నుంచి నాలుగేళ్ల సగటు వృద్ధి రేటు 4.8 శాతమే. కరోనా సమయంలో మైనస్‌ రెండు శాతం, తర్వాత 11, తర్వాత 7.6 శాతం ఉన్నా సరాసరి మాత్రం 4.8 శాతమే. అంతకుముందు అయిదేళ్లలో వృద్ధి రేటు 9 శాతంగా ఉంది. వృద్ధి రేటుకు రాజకీయాలతో సంబంధం లేదు. 2013-14 నుంచి పదేళ్ల సరాసరి చూస్తే 6.5 శాతం కాకుండా గత నాలుగేళ్ల సరాసరి 4.8 శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌డీపీలో వ్యవసాయ రంగం వాటా చాలా ఎక్కువ. 35 శాతంగా ఉంది. దేశంలో చూస్తే 18-19 శాతం మాత్రమే. వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే.. ఏపీలో తయారీ, సర్వీసు రంగాలపై దృష్టి పెట్టాలి. యువతలో నైపుణ్యాలు మెరుగుపరచాలి. ఏపీ తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకులో ఉంది. మానవాభివృద్ధి సూచీలో 25వ స్థానంలో ఉన్నాం. ఏపీలో చాలా సవాళ్లు ఉన్నాయి.. వీటికి డబ్బు కావాలి. తలసరి ఆదాయం చూస్తే తమిళనాడు, కేరళ కన్నా వెనకబడి ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమం-అభివృద్ధి మధ్య సమతూకం లోపించడం వల్ల వివిధ రంగాలపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడుతున్నట్లు విమర్శలున్నాయి. ఆర్థికవేత్తగా మీ అభిప్రాయం?

సంక్షేమం అయితే కొన్ని వర్గాలకు ఉండాలి. ఏ దేశంలో అయినా, ఏ ప్రభుత్వంలో అయినా ఇవి ఉంటాయి. అయితే ఓ ఆర్థికవేత్తగా చెప్పేదేంటంటే సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఎలా! ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలంలో మంచిగానే కనిపించినా.. మధ్యంతర, దీర్ఘకాలంలో అన్ని రంగాలపై వ్యతిరేక ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అభివృద్ధి చెందాలంటే తొలుత ఉద్యోగావకాశాలు, ఉపాధిపై దృష్టిపెట్టాలి. చదువుకున్నవారిలో నిరుద్యోగిత 25 శాతానికి పైగా ఉంది. దేశ సరాసరి కంటే రాష్ట్రంలో ఎక్కువ. మరోవైపు వృద్ధిరేటు తక్కువగా ఉంది. నీటిపారుదల రంగాన్ని మెరుగుపరచాలి. ప్రస్తుతానికి నీటిపారుదల సౌకర్యం సగానికి సగమే ఉంది. 

ఏడాదికి రెండు లక్షల మంది ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. వీరిలో కొందరికి కూడా రాష్ట్రంలో ఉద్యోగం రావడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత భవిష్యత్‌ ఏమిటి?

యువతకు ఉపాధి అవకాశాలు రావాలంటే సంపద సృష్టించాలి. వ్యవసాయం, పరిశ్రమలు, తయారీ, సర్వీసు రంగాల్ని ప్రోత్సహించాలి. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఏటా 2 లక్షలమంది యువత ఇంజినీరింగ్‌లో చేరుతున్నారు. కానీ వచ్చే ఉద్యోగాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాజిక అస్థిరతకు దారితీయవచ్చు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. డిగ్రీ చదివిన యువతలో నిరుద్యోగిత 30-40 శాతం ఉంది. యువతకు ఉద్యోగాలు రాకుంటే విద్యారంగంలో సంక్షోభం నెలకొంటుంది. ఉపాధి లేకపోవడంతో డ్రగ్స్‌ ఇతర వ్యసనాల బాట పట్టే పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వాలు ఉపాధిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. నైపుణ్యాభివృద్ధిలో వెనుకబడి ఉన్నాం. మూడేళ్ల క్రితం నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం ఫార్మల్‌ ఎడ్యుకేషన్‌లో 2.5 శాతమే వర్కర్లుగా ఉన్నారు. కానీ అమెరికాలో 60 శాతం, కొరియాలో 95 శాతం, బ్రిటన్‌లో 70 శాతం మందికి నైపుణ్యాలు ఉన్నాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కావాలంటే నైపుణ్యాలు అవసరం. యూనివర్సిటీలు, కళాశాలల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రత్యేక కోర్సులు తప్పనిసరి చేయాలి.

పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులన్నీ మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం పరిస్థితి ఏంటి?

ఏపీలో 50 శాతం వ్యవసాయం సాగునీటిపై.. మిగతా 50 శాతం వర్షాధారంపై ఉంది. పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తిచేసి నీరిస్తే రైతుల ఉత్పాదకత, ఆదాయం పెరుగుతాయి. కానీ నాలుగేళ్లలో వ్యవసాయం పరిస్థితి బాగా లేదు. 3-4 శాతమే వృద్ధి నమోదైంది. నీటిపారుదల రంగంపై తగినంత ఖర్చు చేయలేదు. మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌, యాంత్రీకరణ కల్పించలేదు.

మితిమీరిన ఎన్నికల వ్యయం వల్ల రాజకీయాలు ధనస్వామ్యం అయ్యాయి. అన్ని అవలక్షణాలకు ఎన్నికల వ్యవస్థే కేంద్రబిందువు అయింది. దీనికి పరిష్కారం ఏమిటి?

దేశంలో ఎన్నికల బాండ్లు పారదర్శకంగా లేవు. ఒకటి రెండు పార్టీలకు మినహా మిగతా పార్టీలకు విరాళాలు రావడం లేదు. దేశంలో ఎన్నికలంటే డబ్బు కాదు.. ప్రజలు డబ్బు మీద ఆధార పడకుండా డిమాండ్లపై ఓట్లు అడిగితే భవిష్యత్తు తరాలకు ఉపయోపడుతుంది. నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే ఎక్కువగా డబ్బు ఖర్చులేకుండా చూడాలి. పారదర్శకమైన, ధనరహిత ఎన్నికల కోసం స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలి.

ఎన్డీయే హయాంలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. గత పదేళ్లలో వ్యవసాయ రంగం ఎలా ఉంది.?

ఎన్డీయే హయాంలో వృద్ధిరేటు బాగానే ఉంది. దీనికి కారణం లైవ్‌స్టాక్‌, హార్టికల్చర్‌కు ప్రాధాన్యం ఇవ్వడం. కానీ ఎక్కువ మంది ఆధారపడిన పంటలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వరి, గోధుమ పంటల్లో కేవలం 1-2 శాతమే వృద్ధిరేటు నమోదైంది. కనీస మద్దతు ధర కొంత పెంచినా.. రైతుల కష్టాలు తగ్గలేదు. పెట్టుబడి వ్యయం పెరుగుతున్నా ఆ మేరకు పంటలపై ఆదాయం రావడం లేదు. 2019-20 ఎన్‌ఎస్‌ఎస్‌ సర్వే ప్రకారం అయిదేళ్లలో రైతుల ఆదాయం 3.5 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది.

ఒక శాతం మంది చేతుల్లోనే 40 శాతం సంపద ఉన్నట్లు ఇటీవల వెల్లడైంది. దీని వల్ల ధనిక-పేద అంతరాయం ఇంకా పెరుగుతుంది కదా.. విరుగుడేంటి?

కొన్ని దేశాల్లో ఒక శాతం జనాభా చేతిలో 25 నుంచి 30 శాతం సంపద ఉంది. కొన్నిచోట్ల ఇంకా ఎక్కువ ఉంది, కొన్ని దేశాల్లో తక్కువ ఉంది. అయితే మొత్తంమీద పైనున్న పది శాతం చేతిలో 50 శాతం సంపద ఉంటే కిందున్న 50 శాతం మంది చేతిలో ఒకటి రెండు శాతం సంపద మాత్రమే ఉంది. అసమానతలు ఎక్కువయ్యాయనడానికి ఇదే నిదర్శనం. నాణ్యమైన ఉపాధి అవకాశాలతో ఈ పరిస్థితిని నివారించవచ్చు. రెగ్యులర్‌ ఉద్యోగులు 10 శాతం ఉంటే, అసంఘటిత రంగంలో పని చేసే వారు 90 శాతం మంది ఉంటున్నారు. అసంఘటిత రంగంలో ఉన్నవారికి నాణ్యమైన ఉద్యోగావకాశాలు రావాలి. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి. రెండోది విద్య, వైద్యంలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మార్పు రావాలి. అందరికి నాణ్యమైన విద్య అందితే ఉపాధి అవకాశాలు పెరిగి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికవేత్త థామస్‌ పికెటి ప్రతిపాదించినట్లు సంపద పన్ను లాంటివి వేసి వచ్చే డబ్బుతో పేదల సౌకర్యాలు మెరుగుపరచవచ్చు. 

స్టాక్‌ మార్కెట్‌ సంపద 400 లక్షల కోట్లకు చేరడం దేశ నిజమైన ఆర్థిక వృద్ధికి సంకేతమా?

స్టాక్‌ మార్కెట్‌కు, రియల్‌ ఎకానమీకి సంబంధం లేదు. వ్యవసాయం, సర్వీసు రంగాల్లో వృద్ధి నిజమైన ఆర్థిక వృద్ధి. కొవిడ్‌ సమయంలో వృద్ధి తగ్గింది. కానీ స్టాక్‌ మార్కెట్‌పై ఈ ప్రభావం లేకపోగా పెరిగింది. కాబట్టి రెండింటికి సంబంధం లేదు. స్టాక్‌ మార్కెట్‌లో సంపద పెరగడం వల్ల కంపెనీలు దీన్ని గ్యారంటీగా చూపించి రుణాలు తీసుకొని పెట్టుబడి పెడతాయి. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నా దృష్టిలో వాస్తవ ఆర్థికాభివృద్ధికి, స్టాక్‌ మార్కెట్‌ సంపద పెరగడానికి సంబంధం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని