జీ‘వి’తాలతో ఆడుకున్నారు

జగన్‌ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్‌.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు.

Published : 22 Apr 2024 06:03 IST

వైకాపా హయాంలో ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు
వేతనాల కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు
సమయానికి ఇచ్చేలా చట్టం చేయాలని గవర్నర్‌కు వినతి
పీఆర్సీలో తీవ్ర మోసం.. బకాయిలు ఇవ్వకుండా ఉత్తుత్తి చర్చలు
పెన్షన్లు అందక అల్లాడిన పండుటాకులు
ఈనాడు, అమరావతి


‘ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి..’
ఓ సీనియర్‌ మంత్రి హెచ్చరిక లాంటి హితబోధ!


‘నిధుల్ని ప్రజలకు పంచాలా.. లేక ఉద్యోగులకు ఇవ్వాలా?’
చిట్టాపద్దుల శాఖా మంత్రి సూటిప్రశ్న!


ఇక సకల శాఖల మంత్రి అయితే.. పైవారికి తానేం తీసిపోననేలా..
‘కంట్రోల్‌లో ఉండండి...’ అంటూ ఉచిత సలహాలాంటి బెదిరింపు!


సకాలంలో జీతాలు ఇవ్వాలనీ, పీఆర్సీ అమలు చేయాలనీ.. అడిగినందుకే ఈ పెడసర మాటలూ, కూతలూ! వైకాపా ఐదేళ్ల పాలనలో.. ఉద్యోగులకు రోజూ ఇలాంటి అవమానాలే!


  • జీతాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా?
  • పీఆర్సీ సక్రమంగా అమలు చేయలేదనీ, ఉన్న ప్రయోజనాలనే ప్రభుత్వం తొలగించిందని ఉద్యోగులు నిరసన తెలిపిన పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా?
  • ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాక ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్లు వాయిదాలు వేసుకున్నది ఎప్పుడైనా చూశారా?

జగన్‌ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్‌.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. ‘నాకు జీతం వచ్చింది’ అని నెల తొలిరోజే ఆనందంతో వాట్సప్‌ గ్రూపుల్లో పెట్టడమనేది... జగన్‌ పాలనలో ఊహించుకోవటానికే సాధ్యం కాని పరిస్థితి! ప్రభుత్వం దివాలా తీసినట్లుగా కొన్నిసార్లు 12వ తేదీ వరకూ జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడింది. జీతాల కోసం పొరుగుసేవల సిబ్బంది, ఒప్పంద ఉద్యోగులు ఇబ్బంది పడడం లాంటివి ఒకటీ అరా చూసుంటాం. రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ‘జీతాలు ఇప్పించండి మహాప్రభో’ అంటూ వేడుకునే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదు. అందుకే ఘనత వహించిన జగన్‌ పాలనలో జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగుల సంఘం ఏకంగా జీతాలు ఇప్పించేందుకు చట్టం చేయాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. దీంతో ప్రభుత్వం పరువుపోయింది. ఈ వినతిపత్రం ఇచ్చినందుకు ఆ నాయకుడిని జగన్‌ సర్కారు తీవ్ర వేధింపులకు గురి చేసింది. ప్రతినెలా ‘ప్రభుత్వానికి అప్పు పుట్టిందా?’, ‘ఈ నెల మనకు జీతం అందుతుందా?’ అంటూ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెట్టిన దుస్థితి జగన్‌ పాలనలో కొనసాగింది. జీతం వస్తే పండగే అనే పరిస్థితి కనిపించింది. ఇక పెన్షనర్ల పరిస్థితైతే వర్ణనాతీతం. పెన్షన్లు ఆలస్యంగా ఇవ్వడంతో మందులు కొనుక్కోవడానికి పండుటాకులు అల్లాడిపోయారు. ఆర్థిక ప్రయోజనాల మాట దేవుడెరుగు.. ఒకటో తేదీన జీతం, పెన్షన్లు ఇస్తే చాలు అనే దుస్థితిని జగన్‌... ఉద్యోగులకు కల్పించారు.

‘సమగ్ర శిక్ష..’లో చెప్పలేని బాధ..

‘జగనన్నా.. సమగ్ర శిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో ఉద్యోగులం.. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. అప్పుల కోసం ప్రయత్నించినా పుట్టలేదు. దసరా పూట పస్తులు ఉండలేక పిల్లల డిబ్బీని పగలగొట్టి డబ్బులు వాడుకుంటున్నాం’ అంటూ.. ఓ ఉద్యోగి తన బాధను గతేడాది వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఎస్‌ఎస్‌ఏకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది. వీటిని ట్యాబ్‌లు, ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌, స్మార్ట్‌టీవీలు, విద్యాకానుకలు, నాడు-నేడుకు మళ్లించి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. ఇదే కాదు.. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు చాలామంది జీతాలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా, డీఅడిక్షన్‌ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాల్లేవు. ఇలా అనేక మంది ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పడుతున్నారు.


పీఆర్సీలో పచ్చి మోసం..

జగన్‌ ప్రభుత్వం 11వ పీఆర్సీలో ఉద్యోగులను మోసం చేసింది. ఎప్పుడూ లేనివిధంగా మధ్యంతర భృతి(ఐఆర్‌) 27% ఉంటే 4% తగ్గించి 23%  ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. పీఆర్సీ చరిత్రలో ఇలా ఇవ్వడం  ఇదే మొదటిసారి. ఐఆర్‌తో తీసుకున్న జీతం కంటే   ఫిట్‌మెంట్‌తో తీసుకున్న జీతం తగ్గిపోయింది.

  • ఇంటి అద్దె భత్యంలో కోత వేసింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వంలో 30% హెచ్‌ఆర్‌ఏ ఉంటే జగన్‌ వచ్చాక 24శాతానికి.. జిల్లా కేంద్రాల్లో గతంలో 20% హెచ్‌ఆర్‌ఏ ఉండగా.. దీన్ని 16 శాతానికి కుదించేశారు.
  • పీఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్‌ వేశారు. పీఆర్సీ పేస్కేళ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం కరస్పాండింగ్‌ స్కేల్స్‌ ఇచ్చేసింది. ఏ పేస్కేళ్లను ప్రామాణికంగా తీసుకొని 12వ పీఆర్సీ కమిషనర్‌ కొత్తవి నిర్ణయిస్తారు?
  • 12వ పీఆర్సీ కమిషన్‌ వేసినా ఇది ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. నిబంధనల ప్రకారం 2023 జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఆలస్యమవుతుందని ప్రతిసారీ ఐఆర్‌ ఇస్తారు. ఈసారి ఐఆర్‌కూ జగన్‌ సర్కారు మంగళం పాడేసింది.

పెత్తనం చేయడమే పనిగా..

ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలిపించడం.. దాంట్లో ఏమీ తేల్చకుండా పంపించి వేయడం.. ఇది జగన్‌ పాలనలో సాగిన ఎడతెరిపిలేని చర్చల సారాంశం. ‘ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాల’ని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ‘కంట్రోల్‌లో ఉండండి’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీఎన్జీఓ సంఘం నాయకుడిని ఫోన్‌లో బెదిరించారు. ‘నిధుల్ని 90శాతం ప్రజలకు పంచాలా.. లేక ఉద్యోగులకు ఇవ్వాలా?’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.. ఇలా వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఉద్యోగులపై పెత్తనం చేశారు. జగన్‌ సీఎం పీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారు. సీఎంను కలిసి సమస్యలు విన్నవించుకుందామన్నా ఆయన దర్శనం లభించని దుస్థితి. 2019 ఎన్నికల ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన ఆయన అధికారంలోకి వచ్చాక వారిని దగ్గరకు కూడా రానివ్వలేదు. సర్వం సలహాలదారుడు సజ్జలనే అనేట్లు తయారు చేశారు. 11వ పీఆర్సీ కమిషన్‌ నివేదిక కోసం ఉద్యోగులు సచివాలయంలో నిరసన చేయాల్సి వచ్చింది. బీఆర్టీఎస్‌ రోడ్డు ముట్టడి తర్వాత గాని పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు. అందులోనూ కొన్ని పేజీలను తొలగించి ఇచ్చారు.

ప్రభుత్వాన్ని గడగడలాడించి..

పీఆర్సీ అమల్లో జగన్‌ సర్కార్‌ చేసిన అన్యాయంపై ఉద్యోగులు 2022 ఫిబ్రవరి 3న నిర్వహించిన గర్జన   జగన్‌కు ముచ్చెమటలు పట్టించింది. బీఆర్టీఎస్‌ రోడ్డు   దిగ్బంధాన్ని విఫలం చేయడానికి జగన్‌ ప్రభుత్వం..   పోలీసులను ప్రయోగించినా ఉద్యోగులు లెక్క చేయలేదు. నిర్బంధాల్ని ఛేదించి.. అడ్డంకుల్ని అధిగమించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఉద్యమాల పురిటిగడ్డ బెజవాడకు  వెల్లువెత్తి వచ్చారు. దాదాపు 4 కి.మీ. పొడవున్న    బీఆర్టీఎస్‌ రహదారి మొత్తం వేల మంది ఉద్యోగులు,  ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కిక్కిరిసి పోయింది. చీకటి పీఆర్సీ జీఓలు రద్దు చేయాలంటూ  నినదించారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని     సదుపాయాలను కల్పించింది. ఈ ఉద్యమం తర్వాత  ‘విభజించు.. పాలించు’ సూత్రాన్ని అమలు చేశారు జగన్‌. సంఘాలను విడగొట్టి నిరసనలు జరగకుండా అణచి వేశారు. జగన్‌ చెప్పినట్లు వైకాపాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమైతే ‘చలో విజయవాడ’లాంటి పెద్ద కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది. సలహాదారులంటూ.. తన అనుచరగణానికి దోచిపెడుతూ     ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలేమో ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు జగన్‌.. ఫలితమే అసంతృప్తులూ, నిరసనలూ!


బకాయిలు దేవుడికే తెలియాలి..

ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.19వేల కోట్లు ఉన్నాయి. ఇంత మొత్తాన్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

  • పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డీఏ, పీఆర్సీ బకాయిలు రూ.7,500 కోట్లు ఉన్నాయి. వీటిని రాబోయే ప్రభుత్వంపైకి నెట్టేశారు. 2027లోగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడం తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు.
  • ఉద్యోగుల టీఏ, డీఏ బకాయిలు రూ.274 కోట్ల వరకు ఉన్నాయి. సరెండర్‌ లీవుల బకాయిలు     రూ.2,250కోట్లు, ఇవికాకుండా    2021-22 నాటికి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.300కోట్లుఉన్నాయి.
  • మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రూ.118కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవికాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్‌ మొత్తాన్ని ప్రాన్‌ ఖాతాకు జమ చేయలేదు. ఇలా అనేక బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.
  • ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. పాత బకాయిలే ఇవ్వలేదు.. ఈ చెల్లింపులు చేస్తుందా? పదవీ విరమణ పొందితే ప్రయోజనాలు ఎలా? అని ఉద్యోగులు మధనపడే దుస్థితి కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని