‘అమ్మఒడి’.. మామ కత్తెర!

పిల్లల్ని బడికి పంపండి చాలన్నారు.. అందరికీ ‘అమ్మఒడి’ సాయం అందిస్తామన్నారు.. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ లబ్ధి కల్పిస్తామన్నారు.. తల్లులను ఆశల పల్లకీ ఎక్కించారు.. ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నారు.. ఆ తర్వాత.. నిబంధనల కత్తి అందుకున్నారు.

Updated : 22 Apr 2024 15:21 IST

నిబంధనల సుడిగుండంలో పథకం
ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి.. ఒక్కరికేనని కొర్రీ
కత్తెరకు పదునుపెట్టి.. లబ్ధిదారుల సంఖ్యలో కోత
అయిదేళ్లలో నాలుగుసార్లే ఇచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
బడుల నిర్వహణ పేరుతో సాయంలో మినహాయింపులు
ఈనాడు - అమరావతి

పిల్లల్ని బడికి పంపండి చాలన్నారు.. అందరికీ ‘అమ్మఒడి’ సాయం అందిస్తామన్నారు..
ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ లబ్ధి కల్పిస్తామన్నారు.. తల్లులను ఆశల పల్లకీ ఎక్కించారు..
ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నారు.. ఆ తర్వాత.. నిబంధనల కత్తి అందుకున్నారు..
ఆదాయ పరిమితి తీసుకొచ్చారు.. విద్యుత్తు వాడకం లెక్క తీశారు..
అర్హుల సంఖ్యను కుదించేశారు.. బడుల నిర్వహణ పేరిట సాయంలోనూ కోతేశారు..


పేదిళ్లలో పిల్లల చదువులకు ఏ తల్లీ భయపడొద్దు. ఇంట్లో ఇద్దరు పిల్లలకు 1-5 తరగతి వరకు నెలకు రూ.వెయ్యి, 6-10 తరగతి వరకు రూ.1,500, ఇంటర్మీడియట్‌ చదువులకు
రూ.2 వేలు తల్లులకు అందిస్తాం.

2017 జులై 10న జగన్‌


సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామని భుజాలు చరుచుకునే జగన్‌ మాటల్లోని డొల్లతనాన్ని ‘అమ్మఒడి’ పథకం బట్టబయలు చేసింది. చిన్నారులకు మేనమామనంటూ.. వారి చదువుల బాధ్యత తనదేనంటూ గొప్పలు చెప్పి చివరకు టోపీ పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తామంటూ జగన్‌ సతీమణి భారతి ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించారు. జగన్‌ సైతం 6-10 తరగతుల్లో ఇద్దరికి ఏడాదికి రూ.18వేలు, ఇంటర్మీడియట్‌లో ఇద్దరికి రూ.24వేలు చొప్పున ఇస్తామంటూ హామీలు గుప్పించారు. గెలిచాక ఒక్కరికే ఇస్తామంటూ నాలుక మడతేశారు. అధికార పీఠం దక్కిన తర్వాత ఇంక ప్రజలతో అవసరమేంటని అనుకున్నారో ఏమో.. లబ్ధిదారులను తగ్గించడంపైనే దృష్టిపెట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో నిబంధన తీసుకొస్తూ కోతలకు పదునుపెట్టారు. ఐదేళ్ల పాలనలో 75శాతం హాజరు నిబంధనతో నాలుగేళ్లే పథకాన్ని అమలు చేసి.. దాదాపు రూ.6,300కోట్లు మిగుల్చుకున్నారు. పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో పేదలకు ఇవ్వాల్సిన రూ.2,598 కోట్లను మిగుల్చుకున్నారు. తనలోని పెట్టుబడిదారి నైజాన్ని మరోసారి చాటుకున్నారు.

పొరుగు సేవల ఉద్యోగులకు సెగ

పొరుగుసేవల ఉద్యోగులకు రూ.15 వేల వేతనం ఇచ్చినట్లే ఇస్తూ.. జగన్‌ మార్కు షాక్‌ రుచి చూపించారు. వివిధ శాఖల పరిధిలో పని చేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల మేలు కోసమే ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌సోర్స్‌డ్‌ సర్వీసెస్‌(ఆప్కాస్‌) తెచ్చినట్లు గొప్పలు చెప్పి.. దీని పరిధిలోకి వచ్చిన లక్ష మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోకి వచ్చినట్లేనని అధికారులు సమాధానమిస్తుండడం గమనార్హం. అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగుసేవల వారికి ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. గ్రామీణంలో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు చూపుతూ.. నిధులను మిగుల్చుకున్నారు.

నిర్వహణ పేరుతో నొక్కేసి..

అమ్మఒడి పథకానికి సవాలక్ష నిబంధనలు పెట్టి అర్హులను తగ్గించేసిన జగన్‌ సర్కారు.. ఇచ్చే దాంట్లోనూ పాఠశాలల నిర్వహణ పేరుతో కోత పెట్టారు. ఆ లెక్కన రూ.2,598 కోట్లు మిగుల్చుకున్నారు. 2019-20లో పథకంలో భాగంగా రూ.15 వేల చొప్పున తల్లులకు ఇచ్చిన జగన్‌.. ఆ ఏడాదే మరుగుదొడ్ల నిర్వహణ పేరిట అందులోంచి రూ.వెయ్యి వసూలు చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఆ మొత్తం వెనక్కి ఇవ్వకపోవడంతో, మరుసటి ఏడాది నుంచి ఆ రూ.వెయ్యి కోసిన తర్వాతే తల్లుల ఖాతాల్లోకి జమ చేయసాగారు. 2020-21లో రూ.వెయ్యి మినహాయించగా.. 2021-22, 2022-23లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి, పాఠశాల నిర్వహణకు రూ.వెయ్యి అంటూ కోతను రూ.2 వేలకు పెంచేశారు. అలా నాలుగేళ్లలో ఒక్కో లబ్ధిదారు రూ.6 వేలు కోల్పోయారు. అలాగని కోత కోసిన డబ్బులను బడుల నిర్వహణకు ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. లబ్ధిదారులకు ఇచ్చేదాంట్లో కోత కోస్తేకానీ పాఠశాలల నిర్వహణ చేపట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అని విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిడెడ్‌ బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందిస్తున్న సాయం నుంచీ రూ.2 వేలు మినహాయిస్తున్నా.. వాటిని తిరిగి ఆ పాఠశాలల నిర్వహణకు మాత్రం ఇవ్వడం లేదు. ఆ బాధ్యత యాజమాన్యాలదేనంటూ వైకాపా సర్కారు తప్పించుకుంది.


మూడేళ్లలో 1.86 లక్షల మంది తరుగుదల

గత ఎన్నికలకు ముందు పిల్లల్ని బడికి పంపే తల్లులందరికీ అమ్మఒడి ఇస్తామని జగన్‌ బాకాలు ఊదారు. సీఎం పీఠం ఎక్కిన తర్వాత.. లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలి? సొమ్మును ఎలా మిగుల్చుకోవాలి? అన్నదానిపైనే దృష్టిపెట్టారు. దీనికోసం రకరకాల నిబంధనలు తీసుకొచ్చారు. నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్తు వాడకం ఉండకూదడనీ, నెల వేతనం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలకు మించి ఉండకూడదనీ నియమం పెట్టారు. ఆ తర్వాత విద్యార్థులకు 75 శాతం హాజరన్నారు. దీంతో 2020-21 నుంచి ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత మూడేళ్లలో 1.86 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. ఎన్నికల ముందు అమ్మఒడి పథకానికి ఎలాంటి నిబంధనలు చెప్పలేదు. దీంతో పిల్లల్ని బడికి పంపితే ప్రయోజనం లభిస్తుందని తల్లులందరూ భావించారు. జగన్‌ పాలనా పగ్గాలు చేపట్టాక కానీ, ‘ఒక్క ఛాన్స్‌’ పేరిట ఆయన చేసిన మోసం జనానికి తెలిసిరాలేదు.


ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మోసం

లబ్ధిదారులు కోరుకుంటే 9-12 తరగతుల పిల్లలకు అమ్మఒడి నగదు సాయానికి బదులుగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని 2021 జనవరి 11న జగన్‌ ప్రకటించారు. ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని.. 7 లక్షల మంది డబ్బులకు బదులు ల్యాప్‌టాప్‌ కావాలని దరఖాస్తు చేశారు. గుత్తేదారు ఒక్కో ల్యాప్‌టాప్‌కు రూ.26 వేలు కోట్‌ చేయడంతో అమ్మఒడి సాయానికి అదనంగా రూ.13 వేలు ఇవ్వాల్సి వస్తుందని జగన్‌ చేతులెత్తేశారు. పేదలపై అంత ప్రేమే ఉంటే, అదనపు భారం పడుతుందని ల్యాప్‌టాప్‌లు ఇస్తామన్న మాటను గాలికి వదిలేస్తారా?


హాజరు పేరిట ఏడాది ఎగ్గొట్టి..

పిల్లలు రకరకాల సాకులు చెప్పి బడికి ఎగ్గొట్టే తరహాలో.. జగన్‌ కూడా ఒక సంవత్సరం అమ్మఒడి పథకం నిధులను మిగుల్చుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఐదు పర్యాయాలు ఇవ్వాల్సి ఉండగా.. నాలుగేళ్లే ఇచ్చారు. ఇందుకోసం విద్యార్థులకు 75శాతం హాజరు నిబంధనను తీసుకొచ్చారు. మొదటి రెండేళ్లు జనవరిలో పథకం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత దాన్ని జూన్‌కు మార్చేసింది. 2021-22లో 75శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్‌లో అమ్మఒడి డబ్బులు వేశారు. 2022-23కీ అదే లెక్కన గత జూన్‌లో జమ చేశారు. ఇలా నాలుగేళ్లు మాత్రమే ఇచ్చినట్లయింది. 2023-24 సాయం ఇవ్వకుండానే ఎన్నికలు వచ్చేశాయి. ఆ రకంగా ఒక ఏడాదికి పేదలకు ఇవ్వాల్సిన పథకం డబ్బులు రూ.6,300 కోట్లను మిగుల్చుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని