ఎన్డీయే కూటమి అభ్యర్థులకే పెన్షనర్ల ఓటు

జగన్‌ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీయే కూటమికి ఓటు వేసి గెలిపిస్తామని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ ప్రకటించింది.

Published : 22 Apr 2024 05:24 IST

ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ నేతలు

ఈనాడు-అమరావతి, పట్టాభిపురం-న్యూస్‌టుడే: జగన్‌ నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీయే కూటమికి ఓటు వేసి గెలిపిస్తామని ఆంధ్రా పెన్షనర్స్‌ పార్టీ ప్రకటించింది. ఆదివారం గుంటూరులో ఆ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్‌ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉద్యోగులు, పెన్షనర్లకు జరిగిన అన్యాయం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, జగన్‌ ప్రభుత్వంలో జరిగిన ఘోరాల్ని వివరించడానికి రాష్ట్ర పర్యటన చేస్తామన్నారు. ‘గత ప్రభుత్వాల హయాంలో ప్రతి నెలా ఒకటో తేదీన ఠంఛనుగా వచ్చే పెన్షన్లు జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 15వ తేదీకి కూడా రావడం లేదు. 17 లక్షల కుటుంబాలు ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఓట్లు అవసరం లేదని జగన్‌ భావిస్తున్నారు. మాకు రావాల్సిన బకాయిలు సంవత్సరాలు గడుస్తున్నా రావడం లేదు. కొందరు తమ కష్టార్జితం చూడకుండానే మరణిస్తుండటం అమానుషం. అందుకే ఈ ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయకూడదని నిర్ణయించుకున్నాం’ అని సుబ్బరాయన్‌ పేర్కొన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పెన్షనర్లు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు అందరూ తెదేపా, జనసేన, భాజపా అభ్యర్థులను గెలిపించుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దన్న గౌడ్‌, ఉపాధ్యక్షుడు మున్నయ్య, కార్యదర్శి పీఎస్‌ఎన్‌ మూర్తి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వరరావు, కోశాధికారి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని