50,000 → 10,117 → 3,350

‘‘మాట తప్పను.. మడమ తిప్పను.చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’‘మీట’ల మాస్టర్‌ జగన్‌ ‘బ్రాండ్‌’ మాటలు ఇవి.కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్‌..!

Updated : 23 Apr 2024 06:47 IST

ఒప్పంద ఉద్యోగులపై.. క్రమబద్ధీకరణ పేరిట జగన్‌ సర్కారు కాకి లెక్కలు
మ్యానిఫెస్టోలో చెప్పింది ఒకటి.. ఆచరణలో పెట్టింది మరొకటి..
ఎన్నికల షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు ఉత్తర్వులు
కోడ్‌ కారణంగా చేయలేకపోయామని కపట నాటకం
ఈనాడు, అమరావతి

‘‘మాట తప్పను.. మడమ తిప్పను.
చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’
‘మీట’ల మాస్టర్‌ జగన్‌ ‘బ్రాండ్‌’ మాటలు ఇవి.
కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్‌..!
అందుకే మాట ‘తిప్పారు’!
అధికారంలోకి వచ్చాక ఒప్పంద ఉద్యోగుల కొలువులను క్రమబద్ధీకరించి వారి సంఖ్యను ‘తగ్గిస్తా’నన్న జగన్‌..
తన మాట నిలబెట్టుకున్నారు!
ఎలా..
క్రమబద్ధీకరించాల్సిన ఉద్యోగాల సంఖ్యను ‘తగ్గించేశారు!’


మ్యానిఫెస్టోలో ఏం చెప్పారు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఒప్పంద(కాంట్రాక్టు) ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం. క్రమేణా ఇలా క్రమబద్ధీకరిస్తూ ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తాం.

సీఎం అయ్యాక ఏం చేశారు

క్రమబద్ధీకరించాల్సిన ఉద్యోగుల సంఖ్యను ఎలా తగ్గించాలనే దానిపైనే కసరత్తు చేశారు. రకరకాల నిబంధనలు తీసుకొచ్చి అర్హుల సంఖ్యకు కత్తెర వేశారు. పంచపాండవులు ఎంత మంది అంటే.. మంచం కోళ్లలాగ ముగ్గురు అని రెండు వేళ్లను చూపిన సామెతలా వ్యవహరించారు. రాష్ట్రంలో 50 వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు ఉంటే 10,117 మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని ప్రకటించి కేవలం 3 వేలమంది ఉద్యోగులనే క్రమబద్ధీకరించారు. అదీ.. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి రెండు రోజుల ముందే..!


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. వీలైనంత ఎక్కువ మంది ఒప్పంద ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఊరించారు. క్రమబద్ధీకరణకు చట్టం తీసుకొచ్చి, ఉత్తర్వులు ఇచ్చి వారితో క్షీరాభిషేకం చేయించుకున్నారు. తర్వాత రకరకాల సాకులు చూపుతూ రెగ్యులరైజ్‌ చేయాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. కొందరి ఉద్యోగాలనే క్రమబద్ధీకరించారు. అదీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడానికి కొన్నిరోజుల ముందే. ‘కోడ్‌’ వచ్చేసిందంటూ మిగిలినవారి ఆశలను అడియాసలు చేసి తన మాయమాటలతో మోసగించారు.


నిబంధనలతో కాలం గడిపేసి..

ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్‌.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి రకరకాల నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు. వడపోతలపై వడపోతలు చేసి సాగదీశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చేంత వరకు ఇదే ధోరణిని ప్రదర్శించి.. ఇక రెగ్యులరైజ్‌ చేయలేమంటూ చేతులెత్తేశారు. ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇష్టం లేని జగన్‌.. రెగ్యులరైజ్‌ సంఖ్యను తగ్గించడానికి మొదట 2014 జూన్‌ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారే అర్హులనే నిబంధన విధించారు. దీనిపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో కొంతకాలం సాగదీసి మాట మార్చారు. 2014 జూన్‌ నాటికి పనిచేస్తూ ఉండేవారే అర్హులు అన్న నిబంధన తీసుకొచ్చారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారినే క్రమబద్ధీకరిస్తామని మరొక నిబంధన పెట్టారు. దీంతో విద్య, వైద్య, ఆరోగ్య, అటవీ, సాంకేతిక విద్యా శాఖ తదితరాల్లో మినహా.. సొసైటీలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు అనర్హులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తుండగా.. జగన్‌ సర్కారు విధించిన నిబంధనలతో కేవలం 10,117 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత సాధించారు. వారిలో 3,350 మంది ఉద్యోగాలను మాత్రమే రెగ్యులరైజ్‌ చేశారు.


తలాతోక లేని తలతిక్క నిబంధనలు

ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి మ్యానిఫెస్టోలో ఎలాంటి నిబంధనలు పేర్కొనని జగన్‌.. క్రమబద్ధీకరణకు వచ్చేసరికి మాత్రం సవాలక్ష షరతులు పెట్టారు. ఒప్పంద ఉద్యోగులతో ఓ ఆట ఆడుకున్నారు! ఆ నిబంధనలు ఇలా..

  • ఒప్పంద ఉద్యోగి పనిచేస్తున్న పోస్టు.. ప్రభుత్వం మంజూరు చేసినదై ఉండాలి.
  • ఉద్యోగంలో చేరిన నాటి నుంచి క్రమబద్ధీకరించే సమయానికి మంజూరు పోస్టులోనే పనిచేస్తూ ఉండాలి.
  • ఉద్యోగ నియామకానికి ప్రకటన జారీ కావాలి. ఆ పోస్టుకు రిజర్వేషన్‌ రోస్టర్‌ అమలవ్వాలి.
  • ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నోటిఫై చేసిన పోస్టు కాకుండా ఉండాలి.

ఇలా అంతూపొంతులేని నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేశారు. విద్యాశాఖలో సబ్జెక్టుకు సంబంధించి క్లియర్‌ వేకెన్సీ ఉండాలన్న నిబంధనతోనూ చాలా మంది అర్హత కోల్పోయారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నా సబ్జెక్టుల విషయంలో తేడా ఉంది.  అన్ని విభాగాల్లోని ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చే వరకు కపటనాటకం ఆడిన వైకాపా సర్కారు.. కోడ్‌ వచ్చిన తర్వాత కుదరదు అంటూ మోసం చేసింది. ఇప్పుడు.. మరోసారి క్రమబద్ధీకరణ జపం పఠిస్తూ ఒప్పంద ఉద్యోగులను మభ్యపెట్టేందుకు జగన్‌ ‘సిద్ధం’ అయ్యారు.


ప్రభుత్వ తప్పులకు ఉద్యోగులు బలి

ఇంటర్మీడియట్‌ విద్యలో గత కొన్నేళ్లుగా 3,593 మంది ఒప్పంద ప్రాతిపదికన అధ్యాపకులుగా కొనసాగుతున్నారు. వారిలో ఒక్కరినీ రెగ్యులరైజ్‌ చేయలేదు వైకాపా సర్కారు. అందుకు ఏవేవో కారణాలు చూపింది.

  • రాష్ట్రంలోని 82 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు అసలు లెక్చరర్‌ పోస్టులే మంజూరు కాలేదు. వాటిలో కాంట్రాక్ట్‌ లెక్చరర్లతోనే నెట్టుకొస్తున్నారు. వైకాపా ప్రభుత్వం వారందర్నీ క్రమబద్ధీకరించాలనుకుంటే పోస్టులు మంజూరు చేయొచ్చు. కానీ, జగన్‌ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
  • 2021లో ఏపీపీఎస్సీ ద్వారా 180 మంది అధ్యాపకులు నియమితులయ్యారు. వారి కోసం అప్పటికే మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న 175 మంది ఒప్పంద ఉద్యోగులను నాన్‌ శాంక్షన్డ్‌ పోస్టులోకి నెట్టేసింది. ఇది ప్రభుత్వం చేసిన తప్పైనా దానికి ఒప్పంద ఉద్యోగులనే బాధ్యులుగా చేసింది.
  • శాంక్షన్డ్‌ పోస్టులు లేని జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న 475 మంది అధ్యాపకులకు జీతాల సమస్య రావడంతో 2020లో వారిని మంజూరు పోస్టుల్లోకి మార్చింది. తెలుగు, సివిక్స్‌ సబ్జెక్టులకు మంజూరు పోస్టులు లేవని 51 మందిని నాన్‌ శాంక్షన్డ్‌ పోస్టుల్లోనే వదిలేసింది. వీరందరినీ అనర్హులుగా తేల్చింది. ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన ఈ తప్పిదానికి అమాయకులైన లెక్చరర్లను బలి చేసింది.
  • డిగ్రీ కళాశాలల్లో 650 అర్హులైన వారు ఉండగా.. వారిలో ఒక్కరి ఉద్యోగాన్ని కూడా క్రమబద్ధీకరించలేక పోయింది వైకాపా సర్కారు

‘పాలిటెక్నిక్‌’లో..

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 309 మంది ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఇద్దరి ఉద్యోగాలను మాత్రమే క్రమబద్ధీకరించారు. మిగిలినవారికి మొండిచేయి చూపారు. వర్క్‌షాపుల్లో 140 మంది అటెండర్లు పనిచేస్తుంటే.. కేవలం 22 మందినే రెగ్యులరైజ్‌ చేశారు. వీరిలో కొందరికి ఎన్నికల కోడ్‌ వచ్చిన రోజు ఉదయమే పీఓ ఇచ్చారు. కమిషనర్‌ నియామక ఉత్తర్వులు ఇచ్చేలోపు కోడ్‌ రావడంతో
నియామకాలు నిలిచిపోయాయి.


వైద్య ఆరోగ్య శాఖలో..

వైద్య ఆరోగ్య శాఖలో 2014 జూన్‌ 2కు ముందు విధుల్లో చేరిన సుమారు వెయ్యి మంది ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వం.. కోర్టు కేసులను సాకుగా చూపి పక్కన పెట్టింది. ఈ శాఖలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న 3,821 మందికి క్రమబద్ధీకరణ అర్హత ఉందని గుర్తించారు. వీరిలో మల్టీపర్సస్‌ హెల్త్‌ అసిస్టెంట్లు(మేల్‌) వెయ్యి మంది వరకు ఉన్నారు. 2002లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. 2003లో వీరు పోస్టింగులు పొందారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలపై కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కొందరిని విధుల నుంచి తప్పించారు. తుది తీర్పు వచ్చిన తర్వాత విధుల్లోకి తీసుకున్నారు. కానీ, ప్రభుత్వం వీరి ఉద్యోగాలను ఇంతవరకు క్రమబద్ధీకరించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని