ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?

రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది.

Updated : 24 Apr 2024 08:09 IST

మరోసారి వృద్ధుల ఉసురు పోసుకుంటారా?
ధనుంజయరెడ్డి, జవహర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డికి ఇంకా వైకాపా ప్రయోజనాలే ముఖ్యమా?
మే నెల పంపిణీకి మరో వారమే గడువు.. దిద్దుబాటు చర్యలేవీ?
సీఈఓ మీనా దృష్టి పెడితేనే లబ్ధిదారులకు మేలు
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. 66 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో వికృతక్రీడకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో అమలుచేసిన ఆదేశాల్నే.. మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది. సీఎం ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్‌ జవహర్‌రెడ్డి, సెర్ప్‌ సీఈఓ మురళీధర్‌రెడ్డి తదితరులంతా వైకాపా కుటిల రాజకీయానికి వంతపాడుతున్నారు. వృద్ధులు నానాకష్టాలు పడుతున్నా.. ఏప్రిల్‌లో 30 మందికి పైగా మరణించినా వీరి మనసు కరగడం లేదు. వారంలో మే నెల పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా.. ఇంటి దగ్గరే పంపిణీపై స్పష్టత ఇవ్వట్లేదు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండల్లో సచివాలయాలకు రప్పించి నరకయాతన పెట్టారు. ఇప్పుడూ అలాగే వృద్ధుల జీవితాలతో ఆటలాడుతూ.. మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘమూ జోక్యం చేసుకోవట్లేదు.

వృద్ధుల్ని నరకయాతన పెట్టడమే ధనుంజయరెడ్డి లక్ష్యమా?

పాలనలో ప్రతి చిన్న విషయంలో జోక్యం చేసుకునే సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి.. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సచివాలయాలకు నడవలేక రాష్ట్రంలో లక్షలమంది వృద్ధులు నరకయాతన పడుతున్నా నిర్ణయాల్ని ఎందుకు సమీక్షించడం లేదు? మళ్లీ మే నెలలోనూ వాటినే కొనసాగించి.. తెలుగుదేశం పైకి నెపం నెట్టే ప్రయత్నమా? ఆయనకు ఇంకా వైకాపా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?

జవహర్‌రెడ్డికి జగన్‌ ప్రయోజనాలే ముఖ్యమా?

తమ నిర్ణయాల వల్లే.. ఏప్రిల్‌లో పింఛన్ల కోసం తిరిగి వృద్ధులు మరణించారని సీఎస్‌ జవహర్‌రెడ్డి ఇప్పటికీ గుర్తించలేకపోయారా? గుర్తిస్తే సమీక్షించి పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయనది కాదా? వృద్ధుల కష్టాలు ఆయనకు కనిపించడం లేదా? పింఛనుదారుల ఇబ్బందులకు కారణమైన సీఎస్‌ను పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల  సంఘానికి వినతిపత్రాలూ ఇచ్చాయి. ఇప్పటికైనా పింఛనుదారుల కష్టాలు తీర్చాలని ఆయన ఎందుకు భావించడం లేదు? లక్షల మంది వృద్ధుల కంటే జగన్‌ ప్రయోజనాలే ముఖ్యమా?

మురళీధర్‌రెడ్డి వైకాపా ముద్ర వీడరా?

సజావుగా సాగాల్సిన పింఛన్ల పంపిణీలో.. ఇన్ని సమస్యలకు కారణం మురళీధర్‌రెడ్డి నిర్ణయాలే. ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలూ ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నాయి. వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించాలనే ఆలోచన చేసిందీ సీఎం ముఖ్య కార్యదర్శి ధనుంజయరెడ్డి, మురళీధరరెడ్డిలే. అదే 30 మందికి పైగా వృద్ధుల మరణాలకు దారితీసింది. కనీసం మే నెలలో అయినా ఇళ్లవద్దే పంపిణీ చేస్తే తమపై పడిన మచ్చను వారు కొంతైనా తుడిచేసుకునే అవకాశం లభిస్తుంది. అలా కాకుండా ఇప్పటికీ వైకాపా సేవే ముఖ్యం అనుకుంటే మరింత మంది వృద్ధుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన పాపం ఆయనదే అవుతుంది.

సీఈఓ మీనాకు బాధ్యత లేదా?

ముదిరిన ఎండలు, పెరిగిన వడగాలుల తీవ్రత నేపథ్యంలో కిలోమీటర్లు నడిస్తే.. వృద్ధుల ప్రాణాలకే ప్రమాదమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మీనాకు చెప్పాల్సిన పనిలేదు. ఆ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించి ఎందుకు జోక్యం కోరడం లేదు? ఏప్రిల్‌లో పింఛను కష్టాలు, మరణాలు ఆయనకు తెలుసు కదా? అయినా వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ వద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చిందని.. సరిదిద్దాల్సిందీ వారేనని, తనకేమీ సంబంధం లేదని ఎలా తప్పించుకుంటారు? వృద్ధుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న నేతల తీరును సీఈసీ దృష్టికి తీసుకెళ్లారా? రాష్ట్రంలో వాలంటీరు వ్యవస్థను రద్దుచేశారంటూ ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి.. ఎన్నికల సంఘం ఆదేశాలను వక్రీకరిస్తున్నా దానిపైనా ఎందుకు నోరు మెదపరు?

వృద్ధుల జీవితాలతో రాజకీయమా.. జగన్‌కు ఇదేమి ఆనందం?

ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీని తెదేపా అడ్డుకుంటోందని, వైకాపాకు ఓటేయకపోతే ఇంటి దగ్గరకు పింఛన్లు అందవని తాము పదేపదే చెబుతున్న అబద్ధాలు నిజమే అని నమ్మించాలంటే.. మే నెలలోనూ సచివాలయాలకు నడిపించడం, పంపిణీలో జాప్యం చేయడమే మార్గంగా వైకాపా భావిస్తోంది. మే నెలలో నాలుగైదు రోజుల పాటు వృద్ధుల్ని ఇబ్బందులు పెడితే తప్పంతా తెదేపా మీదకు నెట్టేయొచ్చని, ఓట్లు దండుకోవచ్చనేది ఆ పార్టీ వ్యూహం. మంచాలపై వృద్ధుల్ని తరలించడం ద్వారా కార్యకర్తలు ఎవరైనా తప్పుదారిలో నడుస్తుంటే అడ్డుకోవాల్సిన జగన్‌.. తానే శవ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబే తన మనిషి నిమ్మగడ్డ రమేశ్‌ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయించి.. వాలంటీరు వ్యవస్థను రద్దుచేయించారని, ఇంటి దగ్గర పింఛను ఇవ్వకుండా అడ్డుకున్నారని ప్రచారం చేస్తున్నారు.

ఇంటింటి పంపిణీకి సరిపడా ఉద్యోగులున్నా..

ఎన్నికలు తప్ప ఇప్పుడు అత్యవసర పనులేవీ లేవు. నాలుగురోజుల పాటు అందరినీ వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులు, ఇతర పంచాయతీ సిబ్బంది కలిపితే 1.30లక్షల మంది పైనే ఉంటారు. సగటున ఒక్కొక్కరు 40-50 మందికి ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రప్రభుత్వం సాకు చెబుతున్నట్లు ఎండాకాలంలో వ్యవసాయ అనుబంధ సహాయకులకు అంత పని ఒత్తిడేమీ ఉండదు. అత్యవసర సర్వీసుల్లోని సిబ్బందిని పక్కన పెట్టినా.. ఇంటింటి పంపిణీకి అవసరమైన ఉద్యోగులు ఉన్నా.. ప్రభుత్వం కావాలనే వృద్ధుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.


పింఛను సొమ్ము అందుబాటులో ఉంటుందా?

మే నెలలో పింఛను పంపిణీకి సొమ్ము అందుబాటులో ఉంటుందా.. లేదా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. వివిధ పథకాలకు సంబంధించి సీఎం జగన్‌ ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే రూ.8,200 కోట్లకు బటన్‌ నొక్కినా ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. ఏప్రిల్‌ 30 నుంచి చేయూత, ఇతర పథకాల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయని సచివాలయ, వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. వీటికోసం పింఛను చెల్లింపులు నిలిపేసే అవకాశం ఉందని, ఆ నెపాన్నీ తమపై నెట్టేసి తెదేపా వల్లే పింఛను అందట్లేదని ప్రచారం చేస్తారని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని