యథా రాజ... తథా విద్య!

విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్‌,బకలారియేట్‌ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్‌ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్‌ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్‌షిప్‌ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి...చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్‌ సర్కారే!

Updated : 25 Apr 2024 13:53 IST

జగన్‌ హయాంలో విద్యావ్యవస్థ సర్వనాశనం
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చదువును దూరం చేసిన జగన్‌
ఐదేళ్లలో 1,952 ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లకు తాళం
అసంబద్ధ సిలబస్‌తో పిల్లల బతుకులతో ఆటలు
ప్రపంచబ్యాంకు అప్పుకోసం పాఠశాల విద్య తాకట్టు
‘రాజకీయ వీసీ’ల నియామకాలతో భ్రష్టుపట్టిన వర్సిటీలు

విద్య లేని వాడు వింత పశువు...
మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి?
పాఠశాల విద్యార్థులను బైజూస్‌,బకలారియేట్‌ విధానాలతో కలవరపెట్టి..
స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి...
ఎయిడెడ్‌ పాఠశాలలను బెదిరించి...మూయించి...
ఇంటర్‌ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి..
ఇంటర్న్‌షిప్‌ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి..
పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దు చేసి..
విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి...
చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్‌ సర్కారే!

మీకు పేద పిల్లలు బాగుపడడం ఇష్టం లేదా? వాళ్లు ఆంగ్లం మాట్లాడడం ఇష్టం లేదా? సర్కారు బడులు బాగుపడడం ఇష్టం లేదా? అంటూ ప్రభుత్వ విద్యను సంస్కరించేందుకు అవతరించినట్లు మాట్లాడే జగన్‌.. ఐదేళ్లలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వారిపై ప్రేమ నటించే జగన్‌ ఈ వర్గాలకు చదువును దూరంచేశారు. తరగతుల విలీనం పేరుతో ఎస్సీ, బీసీ కాలనీల్లో బడులను మూసేశారు. అసంబద్ధ సిలబస్‌ను అమలుచేసి పిల్లలు, ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేశారు. ప్రపంచ బ్యాంకు రుణం రూ.1,862 కోట్ల కోసం జగన్‌ విద్యా వ్యవస్థను చెరబట్టారు. మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటామని నిబంధన పెట్టుకుని, ఉపాధ్యాయుల నియామకాలను నిలిపేశారు. గత ఐదేళ్లలో తరగతుల విలీనం కారణంగా 587 ప్రభుత్వ బడులు మూతపడగా... వందల ఎయిడెడ్‌ స్కూళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రైవేటుకు విద్యార్థుల వలసలు పెరిగి, ప్రభుత్వబడులు వెలవెలబోయే దుస్థితి వచ్చింది. విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి భ్రష్టు పట్టించారు  జగన్‌. ఉపకులపతుల పదవికి జాతీయ స్థాయిలో ప్రకటన ఇచ్చినా ఎవ్వరూ స్పందించనంతగా వర్సిటీల ప్రతిష్ఠను దిగజార్చారు. మొత్తంగా విద్యావ్యవస్థను అధఃపాతాళానికి నెట్టేశారు.

  • డిగ్రీలో ఇంటర్న్‌షిప్‌ పేరుతో పిల్లలతో రొయ్యలు ఒలిపించారు. బేకరీల్లో , కిరాణా దుకాణాల్లో పని చేయించారు. ఇలా ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన చాలామందికి ఉద్యోగాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీలో ఒక సెమిస్టర్‌ మొత్తం ఈ పనులు చేయడం వల్ల మూడేళ్ల డిగ్రీలో నాణ్యత లేకుండాపోయింది. డిగ్రీ ప్రవేశాలు తగ్గిపోయాయి. రాష్ట్రంలో నాణ్యమైన చదువు లేక పక్క రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. 2020-21లో డిగ్రీ ప్రవేశాలు 2.62 లక్షలు ఉంటే ఈ ఏడాది 1.55 లక్షలకు పడిపోయింది.
  • జగన్‌ గత ఐదేళ్లలో తల్లిదండ్రులపై ఫీజుల రూపంలో రూ.3,174 కోట్ల భారం మోపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాల ఫీజు ఇవ్వలేదు.
  • ఒక్క విడతకు బటన్‌ నొక్కినా 50 శాతం మందికి డబ్బులు పడలేదు. మూడు విడతల డబ్బులు రూ.2,124 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రులే భరించారు. కరోనా సమయంలో మరో రూ.600 కోట్లు ఎగ్గొట్టారు. పోస్టుగ్రాడ్యుయేషన్‌ కోర్సులకు 2020-21 నుంచి ఇప్పటివరకు చెల్లించాల్సిన ఫీజు మొత్తం రూ.450 కోట్లకు చేరుకుంది. రెండేళ్లుగా వసతి దీవెన ఇవ్వడమే లేదు.
  • జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ నిలిపేశారు. తెదేపా హయాంలో ప్రారంభించిన మధ్యాహ్న భోజనం పథకాన్ని రద్దుచేశారు. బాలికలకు ప్రత్యేక ఇంటర్మీడియట్‌ విద్యంటూ ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లో పుస్తకాలు, అధ్యాపకులు లేకుండా చేయడంతో 88 శాతం మంది పేద బాలికలు ఫెయిలయ్యారు. ఇదే కారణంతో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో అశ్వినీతేజ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది జగన్‌ సర్కార్‌ చేసిన హత్యగా భావించాలి.

రాజకీయ కేంద్రాలు...వర్సిటీలు

విశ్వవిద్యాలయాల ఉపకులపతులు(వీసీ)గా తన వందిమాగధులను జగన్‌ నియమించారు. వారిక్కడ చదువును పూర్తిగా గాలికొదిలేసి వర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చారు. మంత్రి పెద్దిరెడ్డి సిపార్సుతో అర్హత లేని ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌రెడ్డిని ఎస్వీ విశ్వవిద్యాలయం వీసీగా నియమించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టుపట్టించారని, రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాదరెడ్డిని రెండోసారి వీసీగా నియమించారు. ఈయన ఏకంగా వర్సిటీలో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటుచేశారు. గతంలో శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీగా పనిచేసిన రామకృష్ణారెడ్డి విద్యార్థులను కటకటాల్లోకి పంపించి మరీ వర్సిటీలో వైఎస్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్‌ బంధువైన విక్రమ సింహపురి వర్సిటీ వీసీ సుందర వల్లి జగన్‌ స్మరణలో తరించిపోతున్నారు. నాగార్జున వర్సిటీ ఉపకులపతి రాజశేఖర్‌ జగన్‌ మూడు రాజధానుల మోసానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, వీసీ హోదాను దిగజార్చారు. జేఎన్‌టీయూ వీసీ ప్రసాదరాజు వర్సిటీని వైకాపా కార్యకలాపాలకు కేటాయించారు.


అధోగతి 1
ఊరి బడికి ఉరి..

రాష్ట్రంలో ఒక్క పాఠశాల కూడా మూతపడదని, గతంలో మూసివేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్‌.. సంస్కరణల పేరుతో ఊరు బడికి తాళాలు వేసేశారు. ఎస్సీ, ఎస్టీల ఆవాసాల్లోని స్కూళ్లను మూసేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ, ఎయిడెడ్‌ కలిపి 1,952 బడులకు తెరదించారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులను సబ్జెక్టు టీచర్లతో బోధన పేరుతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడంతో... 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి వాటిలో చాలావరకు మూతపడ్డాయి.  విద్యార్థుల ఆవాసానికి ప్రాథమిక పాఠశాలలు కిలోమీటరు దూరంలోపు ఉండాలనే నిబంధనను విద్యా హక్కు చట్టాన్ని సవరించి మరీ మార్చేశారు.


అధోగతి 2
ఎయిడెడ్‌ను బలిపెట్టారు

ఎయిడెడ్‌ ఆస్తులపై కన్నేసిన జగన్‌ సర్కారు ఆ వ్యవస్థను నాశనం చేసింది. ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలను కనుమరుగు చేసింది. వాటిని ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని... లేదంటే సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశించి, బలవంతంగా ఆ వ్యవస్థను లేకుండా చేయాలని చూసింది. దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్‌ అధికారంలోకి వచ్చేటప్పటికి 2,202 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు ఉండగా.. ప్రస్తుతం 837 మాత్రమే మిగిలాయి. 845 బడులు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సిబ్బందిని వెనక్కి ఇచ్చేసి, ప్రైవేటుగా మారిపోయాయి. 423 పాఠశాలలు కాలగర్భంలో కలిసిపోయాయి. 122 జూనియర్‌ కళాశాలలకుగాను ఇప్పుడు  44 మాత్రమే మిగిలాయి. 137 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల సంఖ్య 63కి పడిపోయింది. ఆరు కళాశాలలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి నిర్వహణను అప్పగించేశాయి. మరో 68 ప్రైవేటుగా మారిపోయాయి.


అధోగతి 3
ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు..

ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్ధీకరణ, తరగతుల విలీన ప్రక్రియలకు తెరతీసింది. ఉన్నవారినే సర్దుబాటు చేసి, కొత్త నియామకాలు లేకుండా చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,88,162 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా.. 1,69,642 మంది మాత్రమే పని చేస్తున్నారు. 18,520 ఖాళీలున్నాయి. నోటిఫికేషన్‌కు  కొద్ది రోజుల ముందు 6,100 పోస్టులకు డీఎస్సీ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసింది. చివరకు ఎన్నికల కోడ్‌తో అదీ నిలిచిపోయింది. గత ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి, ఐదేళ్లలో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఒప్పంద ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అసలా పోస్టులే లేకుండా చేసింది. 7 వేలకుపైగా ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, ఎస్జీటీ పోస్టులను రద్దు చేసింది.


అధోగతి 4
ఐదేళ్లు... 7,752 పోస్టులు రద్దు..

కొత్త నియామకాలు చేపట్టకపోగా.. ప్రభుత్వం ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌, ఎస్జీటీ పోస్టులను ఎడాపెడా రద్దు చేసింది. మండలానికి ఇద్దరు ఎంఈవోలు కావాలంటూ 692 పోస్టుల మంజూరు కోసం అప్పటికే ఉన్న 1,145 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ పోస్టులను రద్దు చేసింది. కమిషనరేట్‌లో 5 అదనపు డైరెక్టర్‌ పోస్టుల కోసం 15 పోస్టులను లేకుండా చేసింది. ఆదర్శ పాఠశాలల్లో సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ, హైస్కూల్‌ ప్లస్‌లో పీజీటీ ఉపాధ్యాయుల నియామకానికి 1,752 ఎస్జీటీ, హెచ్‌.ఎం. పోస్టుల కోసం మరో 76 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసింది. గత ఎన్నికల ముందు పాదయాత్రలో ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఒప్పంద ఉపాధ్యాయ పోస్టులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పోస్టులే లేకుండా చేశారు.


అధోగతి 5
‘ఏకోపాధ్యాయ’లో జాతీయ రికార్డు..

రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని, ప్రతి బడికీ ఇద్దరు ఉపాధ్యాయులను నియమిస్తామని బాకా ఊదిన జగన్‌.. చివరికి ఏకోపాధ్యాయ పాఠశాలల విషయంలో జాతీయ రికార్డు సంపాదించారు. రాష్ట్రంలో 2020 అక్టోబరు నాటికి సింగిల్‌ టీచర్‌ బడులు 7,774 ఉండగా.. ప్రస్తుతం అవి 9,602కు పెరిగాయి. ఇది దేశంలోనే అత్యధికం. హేతుబద్ధీకరణ ఉత్తర్వుల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో దానికి కొర్రీ పెట్టారు. 1-5 తరగతులున్న పాఠశాలల్లో... ఒకటో తరగతి వారికి అక్షరాలు నేర్పించడం, ఐదో తరగతి వారికి పాఠాలు చెప్పడం ఒకే ఉపాధ్యాయుడికి కష్టంగా మారింది. బోధనేతర పనులూ ఆ టీచరే చేయాల్సిన దుస్థితితో పాఠాలు చెప్పేందుకు సమయం లేకుండాపోయింది.


అధోగతి 6
ప్రవేశాలు రివర్స్‌

కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలామంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇది తమ ఘనతేనని సీఎం జగన్‌ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్‌ చేపట్టిన సంస్కరణల కారణంగా విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని గతంలో పదో తరగతి ఫెయిల్‌ అయిన వారికి రీ-అడ్మిషన్లు ఇచ్చి, పిల్లల సంఖ్య పెరిగినట్లు చూపేందుకు ప్రయత్నించారు. సీబీఎస్‌ఈ, బైజూస్‌, టోఫెల్‌ అంటూ ప్రభుత్వం అమలుచేసిన గందరగోళ విధానాలతో విసుగుచెందిన తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు తీసుకెళ్లిపోయారు. 2021-22లో 44,29,569మంది విద్యార్థులు ఉండగా.. 2023-24 వచ్చేసరికి ఆ సంఖ్య 38,68,333కు తగ్గిపోయింది. ఇది కాకుండా రికార్డుల్లో ఉన్న వారిలో లక్షన్నర మంది విద్యార్థులు గత కొన్నేళ్లుగా బడికే రావడం లేదు. వీరినీ తీసేస్తే వాస్తవ విద్యార్థుల సంఖ్య 36లక్షలకు మించదు. మరోవైపు 1.73 లక్షల మంది మధ్యలోనే చదువు మానేశారు.


అధోగతి 7
సిలబస్‌తో సర్కస్‌

విద్యార్థుల మానసిక పరిణతి, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పట్టించుకోకుండా జగన్‌ సర్కార్‌ సిలబస్‌పై తీసుకున్న నిర్ణయాలు తీవ్ర గందరగోళానికి కారణమయ్యాయి. తొలుత రాష్ట్ర సిలబస్‌లోని పుస్తకాలను మార్చింది. 2022-23 నుంచి సీబీఎస్‌ఈని తెచ్చింది. ప్రపంచంలో దీనికి మించిందే లేదని ప్రచారం చేసింది. రెండేళ్లలోనే దాన్ని మూలకు పడేసింది. తాజాగా ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌ (ఐబీ) అంటూ ఓట్ల కోసం కొత్త ప్రచారం అందుకుంది. ఇలా రకరకాల ప్రయోగాలతో పిల్లలను అయోమయానికి గురి చేసింది. బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇచ్చారు. దాన్ని వినియోగిస్తుండగానే రూ.లక్షలు ఖర్చు చేస్తూ రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి కొత్తగా కంటెంట్‌ తయారుచేసింది. ఉపాధ్యాయుల సామర్థ్యాలను పట్టించుకోకుండా సిలబస్‌ల మార్పు చేయడంతో పిల్లల అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోయాయి. చాలామంది దీన్ని భరించలేక ప్రైవేటుకు వెళ్లిపోయారు.


అధోగతి 8
ఉన్నత విద్య నాశనం..

జగన్‌ సర్కార్‌ నిర్ణయాలతో ఉన్నత విద్య అస్తవ్యస్తంగా తయారైంది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిలిపివేశారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు వాటిలో సీటు ఇస్తామన్నా చేరేవారు లేకుండా పోయారు. పీజీలో 44 వేలకు పైగా సీట్లు ఉంటే చేరుతున్న వారు 17 వేలకు మించడం లేదు. ఐదేళ్లలో వర్సిటీల్లో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు. అన్ని వర్సిటీల్లో కలిపి 3,480 పోస్టులు ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్న వారు 845 మంది మాత్రమే. 3,220 పోస్టుల భర్తీకి అనేక లోపాలతో ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం దీనిపై కేసులు పడడంతో చివరికి నోటిఫికేషన్‌ సవరిస్తామంటూ సమాధానమిచ్చింది. మరోవైపు సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంతో ప్రభుత్వ డిగ్రీలో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. రాష్ట్రంలో 24 ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు ఉంటే ఒక్కో కోర్సుకు రూ.20వేలు చెల్లించకుండా వాటిని మూసివేయాలని ఆదేశించారు. పేద పిల్లలకు ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులను దూరం చేసే ఎత్తుగడ వేశారు.


అధోగతి 9
గాల్లో కలిసిన నాడు-నేడు

మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దశ మార్చేస్తానంటూ గొప్పలు చెప్పిన జగన్‌ నాడు.. నేడు కార్యక్రమం ప్రారంభించి నాలుగున్నరేళ్లు గడిచినా ఇప్పటివరకు రెండో విడతవే పూర్తి చేయలేదు. పూర్తయినట్లు నట్లు జగన్‌ సర్కార్‌ చెబుతున్న మొదటి విడతలోనూ అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. 2019 నవంబరు 14న నాడు-నేడు మొదటి విడత పనులకు ప్రారంభోత్సవం చేయగా.. 2021 ఆగస్టు 16 నాటికి వీటిని పూర్తి చేశారు. అదే రోజున రెండో విడతకు శ్రీకారంచుట్టారు. వీటిని పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు పనులు ఎక్కడివక్కడ నిలిపేశారు.


ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని