ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్‌ ఎదుగుతోంది

ప్రపంచంలోనే భారత్‌ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు.

Published : 21 May 2024 03:30 IST

యువత, విద్యార్థులదే కీలకపాత్ర 
మాజీ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ప్రపంచంలోనే భారత్‌ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసానుపల్లిలో సోమవారం దిల్లీ పబ్లిక్‌ స్కూలు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాబోయే రోజుల్లో దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి బాటలో పరుగులు పెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాలతో సంబంధం ఉన్నవారే కాకుండా.. విద్య, వైద్య రంగాలకు చెందిన ఎందరో విదేశాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చి ఓట్లేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతులు తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థితిలో చూడాలనుకుంటారని.. కానీ అందుబాటులో మంచి పాఠశాలలు లేక చదివించలేకపోతున్నారని చెప్పారు. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లినా.. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. విద్య అనేది మార్కులు బాగా సంపాదించడం కాదని, జ్ఞానాన్ని సముపార్జించడమని వివరించారు. నీతి, నిజాయతీ, ధైర్యం, సత్యం, నైతిక విలువల్ని నేర్పించే విద్య ఇప్పుడు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో దిల్లీ పబ్లిక్‌ స్కూలు సెక్రటరీ, కరస్పాండెంట్‌ నాగోతు ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని