వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలికంగా నియామకాల నిలుపుదల

స్టాఫ్‌ నర్సుల నియామకం, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంల్లో అర్హులకు ఎంపీహెచ్‌ఏలు(ఫిమేల్‌)గా పదోన్నతులు కల్పించడాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.

Published : 07 Jun 2024 05:53 IST

ఈనాడు, అమరావతి: స్టాఫ్‌ నర్సుల నియామకం, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఏఎన్‌ఎంల్లో అర్హులకు ఎంపీహెచ్‌ఏలు(ఫిమేల్‌)గా పదోన్నతులు కల్పించడాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభం కానున్న 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవసరాల కోసం ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. కడప ప్రాంతీయ ఆరోగ్య శాఖ అధికారులు.. 206 స్టాఫ్‌ నర్సుల ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లు దరఖాస్తు చేసిన వారికి శుక్రవారం కాకుండా.. గురువారమే కౌన్సెలింగ్‌ నిర్వహించాలనుకోవడం వివాదాస్పదమైంది. అలాగే.. సచివాలయాల్లోని ఏఎన్‌ఎంలకు ఎంపీహెచ్‌ఏలుగా పదోన్నతి కల్పించేందుకు 10న జాబితా, 11న కౌన్సెలింగ్, 12న ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించడంపైనా అభ్యంతరాలు వచ్చాయి. గత ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పదోన్నతులు, నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని జిల్లాలకు వైద్య, ఆరోగ్య శాఖ నుంచి తాజాగా ఆదేశాలు వెళ్లాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వీటిని తిరిగి చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని