‘జగన్‌ను ఇప్పుడైనా కలవనివ్వండి’

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్‌ నివాసం వద్ద గురువారం సాయంత్రం అమరావతి రైతులు, మహిళలు గాంధీగిరీ చేశారు. పూలబొకేలు, పండ్లు, స్వీట్లతో వెళ్లిన వారిని... పోలీసులు అడ్డుకున్నారు.

Updated : 07 Jun 2024 13:39 IST

ఆయనకు అభినందనలు తెలిపేందుకు వచ్చాం
తాడేపల్లి నివాసం వద్ద అమరావతి రైతుల గాంధీగిరీ

జగన్‌ నివాసం వద్దకు వచ్చిన అమరావతి రైతులు, మహిళలను అడ్డుకున్న పోలీసులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్‌ నివాసం వద్ద గురువారం సాయంత్రం అమరావతి రైతులు, మహిళలు గాంధీగిరీ చేశారు. పూలబొకేలు, పండ్లు, స్వీట్లతో వెళ్లిన వారిని... పోలీసులు అడ్డుకున్నారు. ‘ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఉన్నంతకాలం మా గ్రామాల మీదుగా సచివాలయానికి వెళుతూ పరదాలు కట్టుకుని వెళ్లారు. ఆ సమయంలో ఆయన్ను కలుద్దామన్నా పోలీసులు నెట్టేసేవారు. ఇప్పుడైనా ఆయన్ను కలిసి అభినందించేందుకు అవకాశం ఇవ్వండి’ అని రైతులు పోలీసులను అభ్యర్థించారు. ఏంటి హేళన చేయడానికి వచ్చారా అని పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్‌ను కలిసేందుకు అవకాశం ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీనికి రైతులు బదులిస్తూ.. ‘29 గ్రామాల రైతులు, మహిళలు ఏమీ చేయలేరని ఐదేళ్లపాటు ఆయన వెటకారం చేయలేదా? మేం సాధించినది ఏంటో చెప్పడానికే ఇక్కడకు వచ్చాం. ఆయన ఇప్పుడు సీఎం కాదు.. ఎమ్మెల్యేనే కదా, అయినా మేం కలవడానికి మీకెందుకు అభ్యంతరం?’ అని ప్రశ్నించారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని సీఐ సూచిస్తూనే.. మహిళా పోలీసులతో నెట్టించేందుకు ప్రయత్నించారు. చేసేది లేక తీసుకువెళ్లిన పండ్లు, మిఠాయిలు అక్కడ ఉన్నవారందరికీ పంపిణీ చేశారు. రెండురోజుల్లో జగన్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తామని పోలీసులు తెలపడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని