సంక్షిప్తవార్తలు(4)

ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో మాజీ సీఎం జగన్‌తో పాటు మాజీ మంత్రుల ఫొటోలు లేకుండా చూసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 09 Jun 2024 07:15 IST

ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో జగన్‌ ఫొటోలు తొలగించాలి
సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో మాజీ సీఎం జగన్‌తో పాటు మాజీ మంత్రుల ఫొటోలు లేకుండా చూసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ సమయంలో తొలగించినా.. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే వాటిని కూడా తొలగించాలని ఆదేశించింది. 


ఏయూలో దస్త్రాలు భద్రం: రిజిస్ట్రార్‌ 

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ)లోని అన్ని దస్త్రాలు, రికార్డులు గత ఐదేళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయని రిజిస్ట్రార్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ స్పష్టం చేశారు. ‘ఏయూలో కీలక దస్త్రాలు మాయం!’ శీర్షికన ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉపకులపతికి వ్యక్తిగతంగా ఎలాంటి దస్త్రాలతో సంబంధం ఉండదని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ రిజిస్ట్రార్‌ హోదాలో ఉన్న వీసీ వ్యక్తిగత కార్యదర్శి దస్త్రాలను భద్రపరిచే బాధ్యతలను నిర్వహిస్తారని వివరించారు.


‘వీసీలు హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లొద్దు’

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు హెడ్‌ క్వార్టర్‌లను విడిచి వెళ్లొద్దని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్, ఎస్పీలను సంప్రదించి పరిష్కరించుకోవాలని, షెడ్యూల్‌ ప్రకారం ప్రవేశాలు నిర్వహించాలని ఆదేశించింది. శాఖాపరమైన సమస్యలు ఉంటే ఉన్నత విద్యాశాఖను సంప్రదించాలని సూచించింది.


ప్రకృతి వ్యవసాయ పరిశీలనకు జాంబియా బృందం

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని తమ దేశంలోనూ ఆచరించడానికి జాంబియా దేశ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోందని రైతు సాధికార సంస్థ తెలిపింది. అనంతపురంలోని పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్ని ఈ నెల 21 వరకు ఈ బృందం పరిశీలించనుందని చెప్పింది. జాంబియా బృందం ప్రకృతి వ్యవసాయంపై లోతుగా అధ్యయనం చేసి అవగాహన చేసుకోనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్‌ఎఫ్‌) పేరుతో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని 10.35 లక్షల మంది రైతులు అనుసరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు