విజయాలు ‘రామో జీ’హుజూర్!
మాతృభాష పరిరక్షణకు కృషి చేయడం.. రామోజీరావు చేపట్టిన మరో మహాయజ్ఞం. పరాయి భాషలపై మోజు.. తెలుగు పలుకు ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య.. అమ్మభాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటిచెప్పే బృహత్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు.
విలువలే పునాదులుగా దిగిన వైనం
సమాజ హితమే ఆయన అభిమతం
నిరంతర శ్రమ.. నిత్యం కొత్తదనం కోసం తపన..
నిజాయితీతో కూడిన వ్యాపారం... చెక్కుచెదరని ఆత్మస్థైర్యం
పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం
గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం... పునాదులుగా
పగలూరాత్రి పరిశ్రమించి రామోజీరావు సృష్టించిన మహాసామ్రాజ్యం రామోజీ గ్రూప్!
మాతృభాష పరిరక్షణకు కృషి చేయడం.. రామోజీరావు చేపట్టిన మరో మహాయజ్ఞం. పరాయి భాషలపై మోజు.. తెలుగు పలుకు ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య.. అమ్మభాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటిచెప్పే బృహత్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. లాభాపేక్షలేని రామోజీ ఫౌండేషన్ ద్వారా.. తెలుగు వెలుగు మాసపత్రికను ప్రచురించి.. మాతృభాషాభివృద్ధికి కృషిచేశారు. బాలభారతం ద్వారా చిన్నారుల్లో జ్ఞానం, సృజన, ప్రగతిశీల ఆలోచనా విధానం వంటి గుణాల్ని అలవర్చే ప్రయత్నం చేశారు.
విలువలే మూలస్తంభాలుగా... అడుగుపెట్టిన ప్రతిరంగంలో చెరగని ముద్ర వేశారు రామోజీరావు! సాధించిన దానితో ఆగిపోక... సరికొత్త లక్ష్యాల సాధనకు వడివడిగా అడుగులు వేసి.. అసంఖ్యాక ప్రజల హృదయాల్ని గెలుచుకున్నారు. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ తెలుగువాకిళ్ల వెలుగుచుక్కలా ప్రభవించే ఈనాడు... క్షణక్షణం ఆనంద వీక్షణం అందించే వినోదాల ప్రభంజనం ఈటీవీ... యావద్భారతానికి 13 భాషల్లో క్షణాల్లో వార్తలు అందించే డిజిటల్ విప్లవం ఈటీవీ భారత్... దుక్కిదున్ని జాతికి పట్టెడన్నం పెట్టే రైతన్నకు అండదండగా నిలిచిన అన్నదాత... ప్రపంచంలోనే అతి పెద్ద చిత్రనిర్మాణ ప్రాంగణం రామోజీ ఫిలింసిటీ... అన్నీ ఆయన మానస పుత్రికలే! మీడియా సంస్థ సారథిగా ప్రజాహితంకోసం పాటుపడినా... మాతృభాష పరిరక్షణకు నడుంకట్టినా, చైతన్య దీపికల్లాంటి సినిమాలు నిర్మించినా... భూతల స్వర్గాన్ని తలపించే చిత్రనగరిని సృష్టించినా... ఆయనకు ఆయనే సాటి! ప్రభుత్వాలకు దీటుగా... వేల మందికి ప్రత్యక్ష ఉపాధి... లక్షలమందికి పరోక్ష లబ్ధి చేకూర్చారు రామోజీ!
తొలి అడుగు ఇలా...
1961లో వివాహానంతరం, సతీమణి రమాదేవితో కలసి రామోజీరావు దేశ రాజధానికి మకాం మార్చారు. దక్షిణ దిల్లీ కరోల్బాగ్లో నివసించారు. దిల్లీలో ఆర్టిస్టుగా.. తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది. నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాలలో స్పష్టత వచ్చింది. నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు. తను చేసే పని పదిమందికీ ప్రయోజకంగా ఉండాలని అభిలషించారు. 1962లో పెద్దకుమారుడు కిరణ్ పుట్టిన తరువాత ఓ నిర్ణయానికి వచ్చారు. అదే ఏడాది రామోజీ దిల్లీలో ఉద్యోగపర్వం ముగించారు. వ్యాపార రంగ ప్రవేశానికి మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు..
విజయానికి మార్గదర్శి
రామోజీరావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు.. మార్గదర్శి చిట్ఫండ్స్! 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైందీ సంస్థ. మార్గదర్శి తోడుంటే.. ఆనందం మీ వెంటే... అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది ఖాతాదారులకు తారకమంత్రమైంది. చిట్ఫండ్ వ్యాపారం అంటే అదేదో ఆడవారి వ్యవహారం అని భావించిన రోజుల్లో... రామోజీరావు పట్టుదలతో వసూళ్లు, చెల్లింపుల్లో కచ్చితత్వంతో ముందుకు సాగారు. ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత కారణంగా మార్గదర్శి శరవేగంగా అభివృద్ధి చెందింది. ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, విశ్వసనీయత.. ఈ మూడూ మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు! అవే మార్గదర్శిని దేశంలోనే అగ్రశ్రేణి చిట్ఫండ్ సంస్థగా నిలిపాయి. 60 ఏళ్ల ప్రస్థానంలో 60లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించే ఘనత దక్కేలా చేశాయి. అదే స్ఫూర్తితో.. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3లక్షలకు పైగా ఖాతాదారులు, 4వేల మందికిపైగా ఉద్యోగులు, 18వేలకుపైగా ఏజెంట్లతో విలువలకు కట్టుబడి ముందుకు సాగుతోంది మార్గదర్శి..
రైతుబిడ్డగా రుణం తీర్చుకోవాలని..
మార్గదర్శితో విజయయాత్రలో తొలి అడుగుపడినా... ఆయన ఏనాడూ మూలాలను మరచిపోలేదు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన ఆయన.. సాగుబడికి తనవంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే.. అన్నదాత! 1969లో మీడియా రంగంలో తొలి అడుగువేస్తూ.. అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు. రైతుల కోసం ప్రత్యేకంగా ఓ పత్రిక పెట్టడం సంచలనం! అలాంటి సాహసానికి ఒడిగట్టిన రామోజీ... వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు, కర్షకులకు మధ్య తిరుగులేని వారధిని నిర్మించారు.
తెలుగునాట నవోదయం
ఆంధ్రావనిలో దినపత్రికకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఘనత రామోజీరావుదే! తెలుగు పత్రికా ప్రపంచంలో నవశకానికి నాంది ఆయన ఆరంభించిన ఈనాడు! 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన ఈనాడు దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం! అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంగా ఆరంభమై... 4 ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా ఎదిగింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలో కొత్త ఒరవడి సృష్టించింది. ఈనాడు వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. అప్పటివరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. మారుమూల ప్రాంతాలవారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకో, మరుసటి రోజు ఉదయం వరకో వేచి చూడాల్సిందే! అలాంటి ఇబ్బంది లేకుండా రోజూ సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. తర్వాతికాలంలో ఇతర వార్తాపత్రికలూ ఇదే విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి.
తనచుట్టూ జరిగే చిన్నచిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్న అభిమతంతో జిల్లా సంచికలు తీసుకువచ్చారు రామోజీ! తర్వాతికాలంలో వాటిలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు మరింత పెద్దపీట వేశారు. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో ‘ఈనాడు ముందడుగు’ ద్వారా సామాన్యులకు తెలియ చెప్పారు. స్వచ్ఛభారత్, సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం, జలసంరక్షణ కోసం ఊరూవాడను ఏకం చేశారు. ఇలా ఐదు దశాబ్దాలుగా ప్రతి ఉదయం లక్షల మంది పాఠకుల్ని పలకరిస్తూ.. వార్తా, విజ్ఞాన, వినోదాలతో అలరించటమేగాకుండా... ఎన్నో ప్రజాఉద్యమాలకు ఈనాడును సారథిగా నిలబెట్టారు రామోజీరావు. ఈ విజయయాత్రలో ఈనాడుతోపాటు కీలక మైలురాళ్లుగా నిలిచాయి సితార సినీపత్రిక.., చతుర, విపుల సాహితీ పత్రికలు! ప్రపంచ సాహిత్యంలోని అత్యుత్తమ కథాసాహిత్యాన్ని విపుల ద్వారా తెలుగు పాఠకులకు చేరువ చేశారు.
రుచితో బంధం-ప్రియా
రామోజీ ఆలోచనల విలక్షణతకు నిదర్శనం... ప్రియాఫుడ్స్! 1980 ఫిబ్రవరిలో ఆయన ఈ సంస్థ ద్వారా భారతీయ సంప్రదాయ వంటకాల రుచుల్ని దేశదేశాలకూ పరిచయం చేశారు. పచ్చళ్ల నుంచి చిరుతిండ్ల వరకు.. వందల రకాల ఉత్పత్తులతో, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో అసంఖ్యాక ప్రజానీకం ఆదరణ పొందింది ప్రియా ఫుడ్స్! ఆహార ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు దక్కించుకుంది. ఇదే రీతిలో రామోజీరావు ప్రారంభించిన డాల్ఫిన్ హోటల్స్ ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ట్రెండ్ సెట్టర్... ఈటీవీ!
టీవీ అంటే దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన రోజుల్లో.. ఈటీవీతో బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని, అనతికాలంలోనే జాతీయస్థాయి నెట్వర్క్గా విస్తరించారు. ప్రాంతీయ భాషా ఛానళ్లకు కొత్త అర్ధం చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచార వేదికలుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాలభారత్.. కొంతకాలానికి ఆ కీర్తికిరీటంలో చేరాయి. తెలుగు పత్రికా రంగంలో ఈనాడు సరికొత్త ఒరవడి సృష్టిస్తే.. బుల్లితెర విషయంలో ట్రెండ్సెట్టర్గా నిలిచింది ఈటీవీ. వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలతో ఆబాలగోపాలాన్ని అలరిస్తోంది. ‘పాడుతా.. తీయగా’ అంటూ ప్రేక్షకులపై సుమధుర సంగీతజల్లు కురిపించినా, టాలీవుడ్ క్లాసిక్ మూవీస్తో సినీ ప్రేమికుల్ని కట్టిపడేసినా, ఖతర్నాక్ కామెడీ షో అంటూ ఇంటింటా జబర్దస్త్ నవ్వులు పూయించినా.. ఈటీవీకి మాత్రమే సాధ్యం అనేలా సత్తాచాటింది.
సినీ మంత్రనగరి... ఆర్ఎఫ్సీ
రామోజీరావు కన్న ఓ కల.. భారతీయ చలనచిత్ర రంగం స్థాయిని నూతన శిఖరాలకు చేర్చింది. ఆయన నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ.. యావత్ సినీజగత్తు హైదరాబాద్ వైపు చూసేలా చేసింది. చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన సకల సేవల్ని ఒకేచోట అందిస్తూ.. రామోజీరావు నిర్మించిన ఫిల్మ్సిటీ ప్రపంచంలోనే అతిపెద్దదిగా గిన్నిస్ రికార్డు సాధించింది. సువిశాల ప్రాంగణం.. ముగ్ధమనోహరమైన ఉద్యానవనాలు.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం.. మయసభను తలపించే సెట్టింగులు కలిగిన రామోజీ ఫిల్మ్సిటీ.. సినిమాల చిత్రీకరణకు వేదికవ్వడమే కాక... దేశంలోనే అత్యంత ప్రజాదరణగల పర్యటక కేంద్రంగా వర్ధిల్లుతోంది.
పద్మవిభూషణుడు...
మీడియాలో రామోజీరావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే. అందుకే అనేక పదవులు, పురస్కారాలు ఆయన్ను వరించాయి. 1987 ఏప్రిల్లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికాస్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలకపాత్ర పోషించారు. పాత్రికేయ రంగంలో సేవలకు గుర్తింపుగా బీడీ గోయెంకా, యుధ్వీర్ పురస్కారాలు అందుకున్నారు. 1986లో ఆంధ్రవిశ్వ కళా పరిషత్... ఆయనను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో గౌరవించింది. 1989 మార్చిలో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం.. 2015 సెప్టెంబర్లో ఒడిశాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1982లో జమీన్ రైతు రామానాయుడు అవార్డు, పత్రిక ద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధికి చేసిన కృషికిగాను 1992లో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి అవార్డు, 2013లో ఉర్దూ భాష¯ వికాస పురస్కారం దక్కాయి. 2016లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించడం ఆ సాటిలేని కృషీవలుడికి లభించిన సముచితమైన గౌరవం!
రామయ్య టు రామోజీ
నాటి మద్రాసు రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా తీరంలోని గుడివాడ పట్టణం. దాని సమీపంలో ఓ పచ్చని పల్లెటూరు పెదపారుపూడి. అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మగారిల్లు. 1936వ సంవత్సరం. నవంబర్ 16. పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టిన రోజు అది. ఇద్దరు అక్కలు రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు. కానీ బాల రామయ్య ఘటికుడు, ఆధునికుడు. బడిలో మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి.
ఊరే ప్రేరణగా...
పెదపారుపూడి.. అటు కోవెల గంటల సవ్వడి, దైవ స్తోత్రాలు. ఇటు పక్షుల ధ్వనులు. మరోదిశగా.. పచ్చటి పంటచేలు, చెరువు ఒడ్డు. రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాసుగా నిలిచింది. చిత్రకారుడు కావడానికి నేపథ్యమైంది. భవిష్యత్తు దర్శనం చేసింది. ప్రాథమిక విద్య పూర్తయ్యాక.. పైచదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు. మునిసిపల్ స్కూల్లో... 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమమైన అప్పటి సిక్త్స్ ఫామ్ చదివారు. రామోజీకి చదువు కంటే, కళలు, రాజకీయాలపై ఆసక్తి మిన్న. మాటల్లో నిశిత దృష్టి, సునిశిత పరిశీలన కనపడేవి. వ్యాపారంలో అనుకరణలు వద్దని, సొంత ఒరవడే శ్రేయస్కరమని చెప్పేవారు. ఇందుకే కావచ్చు. రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత, వైవిధ్యం కనపడతాయి..
కమ్యూనిజం- గాంధీయిజం
1951లో రామోజీ హైస్కూల్ చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు. అనంతరం ఆయన సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మ కర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మాగాంధీ ఆయనపై తీవ్ర ప్రభావం చూపించారు. గాంధీ దళిత జనోద్ధరణ అంటే మరీమరీ ఇష్టం!
ఆమె పేరూ మారింది..
1961 ఆగస్టు 19.. రామోజీ జీవితంలో కొత్త మలుపు. పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవితో బెజవాడ కన్యకా పరమేశ్వరి మందిరంలో వివాహం జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ. అది అమ్మమ్మ పేరు. తనపేరు కొంచెం ఆధునికంగా వుండాలని ఆమె అభిలాష. స్కూల్లో చేరినప్పుడు.. తన పేరు రమాదేవిగా రాయించారు. అటు రామయ్య, ఇటు రమణమ్మ తమ పేర్లు మార్చుకోవడం కాకతాళీయమే!
ఈ ఎఫ్ఎం-ఈటీవీ భారత్...
రామోజీరావు ప్రారంభించిన మరో వేదిక.. ఈ ఎఫ్ఎం రేడియో. అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల్లోని నాలుగు ప్రధాన నగరాల శ్రోతలకు అభిమాన రేడియో ఛానల్గా మారింది 2019లో డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. మొబైల్ యాప్ ద్వారా తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో వార్తలు అందించే ఈటీవీ భారత్ను ప్రారంభించారు. ఈటీవీ విన్ ఓటీటీ తీసుకొచ్చారు.
ఆ సంఘర్షణే బీజం వేసింది...
డిగ్రీ తర్వాత భిలాయ్లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. నిరాశే మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తనే పదిమందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు.. దిల్లీలో మళయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్దికాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. మళ్లీ అంతర్మథనం! అయిన వాళ్ల కోసం విదేశీ అవకాశాన్ని వదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట