ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేద్దాం

తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన అమ్రాబాద్, నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వుల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ, ఏపీ అటవీశాఖలు నిర్ణయించాయి.

Published : 10 Jun 2024 04:56 IST

తెలంగాణ, ఏపీ అటవీశాఖల నిర్ణయం

అధికారులతో సమావేశమైన తెలంగాణ, ఏపీ పీసీసీఎఫ్‌(హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌)లు ఆర్‌ఎం డోబ్రియాల్, చిరంజీవి చౌదరి

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన అమ్రాబాద్, నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వుల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ, ఏపీ అటవీశాఖలు నిర్ణయించాయి. ఆదివారం ఇరు రాష్ట్రాల అటవీశాఖల సంయుక్త సమావేశం నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంటలో జరిగింది. అటవీ సరిహద్దు సమస్యలు, రక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్లాస్టిక్‌ నిషేధంతో నీళ్ల బాటిళ్ల తరలింపుపై ప్రభావం పడనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అటవీ సంరక్షణ ప్రధానాధికారులు, దళాధిపతులు(పీసీసీఎఫ్‌-హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌-శ్రీశైలం మార్గం ప్రధానంగా తెలంగాణలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌(ఏటీఆర్‌)తో పాటు ఏపీలోని నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌(ఎన్‌ఎస్‌టీఆర్‌) పరిధిలోనూ ఉంటుందని, తీర్థయాత్రల కోసం జనం తాకిడి పెరగడంతో ఈ ప్రాంతంలో ప్లాస్టిక్‌ బెడద ఎక్కువగా ఉందని తెలంగాణ, ఏపీ పీసీసీఎఫ్‌(హెచ్‌ఓఎఫ్‌ఎఫ్‌)లు ఆర్‌ఎం డోబ్రియాల్, చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాలు చేపట్టిన ఉమ్మడి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్లాస్టిక్‌తో అటవీప్రాంతాలు, వన్యప్రాణులకు జరుగుతున్న నష్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని