South Central Railway: పట్టాలు తప్పిన గూడ్సు రైలు

సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం స్టేషన్‌ సమీపంలో ఆదివారం గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్సు రైలు రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి.

Published : 27 May 2024 05:34 IST

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

పిడుగురాళ్ల రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ 

దామరచర్ల, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌-గుంటూరు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం స్టేషన్‌ సమీపంలో ఆదివారం గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్సు రైలు రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో ఉండటంతో డ్రైవర్‌ చాకచక్యంగా బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరగడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. సింగిల్‌ ట్రాక్‌ కావడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని స్థానిక పోలీసుల సహకారంతో జేసీబీలు, క్రేన్లను రప్పించి నాలుగు బోగీలను ట్రాక్‌పై నుంచి తప్పించి రైళ్ల రాకపోకలను అనుమతించారు.

ప్రయాణికుల పాట్లు

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఆదివారం పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను మార్గంమధ్యలో నిలిపివేయడం, కొన్నింటిని ఆలస్యంగా నడపడం, మరికొన్నింటిని మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. గుంటూరుకు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే నిలిచిపోయింది. ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేయడంతో దాన్ని గుంటూరు నుంచి సత్తెనపల్లి వరకు పంపారు. అంతకుముందు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పిడుగురాళ్ల స్టేషన్‌లోనే రెండు గంటల పాటు ఆపేశారు. విజయవాడ నుంచి లింగంపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను గంట ఆలస్యంగా నడిపారు. సికింద్రాబాద్‌ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట మీదుగా మళ్లింపు మార్గంలో నడిపారు. ఈరోడ్‌ నుంచి నాందేడ్‌ వెళ్లే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను గుంటూరులోనే కొంత సమయం నిలిపివేశారు. సికింద్రాబాద్‌ నుంచి వచ్చే శబరి, పల్నాడు, రేపల్లె ఎక్స్‌ప్రెస్‌లను మార్గం మధ్యలోనే ఆపివేయడంతో గుంటూరుకు దాదాపు ఐదు గంటలు ఆలస్యంగా వచ్చాయి.  

విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్సు రైలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని