Liquor scam: దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ను మించిన మద్యం కుంభకోణం

దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న దానికంటే మించి గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు సూత్రధారులుగా.. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటినీ గుత్తాధిపత్యంలో పెట్టుకుని భారీగా దోచుకున్నారు.

Published : 08 Jun 2024 03:56 IST

సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు
వైకాపాకు మద్దతుదారులైన అధికారులతో వ్యవస్థీకృత దందా
మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటా వారిదే గుత్తాధిపత్యం
ఏపీఎస్‌బీసీఎల్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు నేపథ్యంలో.. పాత్రధారులైన ఇతర అధికారులపైనా చర్చ
సీబీఐ, ఈడీలకు దర్యాప్తు అప్పగించాలనే డిమాండ్లు

ఈనాడు, అమరావతి: దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో చోటుచేసుకున్న దానికంటే మించి గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది. గత ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నాయకులు, వారి సన్నిహితులు సూత్రధారులుగా.. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలు అన్నింటినీ గుత్తాధిపత్యంలో పెట్టుకుని భారీగా దోచుకున్నారు. వైకాపాకు కరడుగట్టిన మద్దతుదారులైన అధికారులను పాత్రధారులుగా మార్చుకుని ఈ వ్యవస్థీకృత దందా కొనసాగించారు. రాష్ట్రంలో అధికారమార్పిడి జరిగిన తరుణంలో ఈ కుంభకోణంపై తెదేపా దృష్టిసారించింది. వైకాపా నాయకులు కుట్రదారులుగా రూపొందించిన నేర విధానాన్ని అన్నీ తానై అమలుచేశారనే అభియోగాలున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ శుక్రవారం కేసు నమోదుచేసింది. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఐడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ఇతర అధికారుల పాత్రపై తెదేపా వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారు భారీగా వెనకేసుకున్నారని తెలుస్తోంది. సూత్రధారుల్ని, పాత్రధారుల్ని పట్టుకునేలా ఈ కుంభకోణంపై విచారణను సీబీఐ, ఈడీలకు అప్పగించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

దోపిడీకీ అన్నీ తానైన వాసుదేవరెడ్డి

  • ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు మద్యం విధానంలో కొనసాగించిన దోపిడీకి వాసుదేవరెడ్డే కళ్లు, చెవులు సహా అన్నీ తానై వ్యవహరించారనే ఫిర్యాదులున్నాయి. వైకాపా అధికారం చేపట్టగానే ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీగా, డిస్టిలరీస్, బ్రూవరీస్‌ కమిషనర్‌గా ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని నియమించుకున్నారు. నాలుగున్నరేళ్ల పాటు ఆ పోస్టులో కొనసాగి.. వైకాపా నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటుచేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారుచేసే ‘జే బ్రాండ్లు’ మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో లభ్యమయ్యేలా చేసింది ఈయనేనని తెదేపా గుర్తించింది. ప్రభుత్వ పెద్దలు, అధికారపార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు రూ.200-250 చొప్పున, ప్రతి బీరు కేసుకు రూ.100-150 చొప్పున కమీషన్‌ చెల్లించిన మద్యం కంపెనీలకే 99% కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి.
  • ఏ మద్యం కంపెనీలకు ఎంతవిలువైన ఆర్డర్లు ఇవ్వాలి? ఏయే బ్రాండ్లకు అనుమతులివ్వాలి? ఇలా ప్రతి అంశంపై సీఎంఓలోని కీలక అధికారి ఆదేశాలను పాటిస్తూ.. ప్రభుత్వపెద్దలు, వైకాపా ముఖ్య నాయకులకు అనుచిత లబ్ధి కలిగించారనేది ఈయనపై ప్రధాన ఆరోపణ.
  • రమేష్‌రెడ్డి, కరీముల్లా, సురేష్‌రెడ్డి అనే ఉద్యోగుల్ని తనతోపాటు రైల్వే నుంచి డిప్యుటేషన్‌పై ఏపీఎస్‌బీసీఎల్‌కు తీసుకొచ్చిన వాసుదేవరెడ్డి.. వారిని ఈ దందాలో కీలకంగా మార్చారన్న ఫిర్యాదులున్నాయి. 

‘జే’ ట్యాక్స్‌ వసూళ్ల బాధ్యతల్లో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించే కంపెనీలకే మద్యం ఆర్డర్లు లభించేలా చేయడం, వారినుంచి ‘జే’ ట్యాక్స్‌ వసూలు లాంటి బాధ్యతలన్నీ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డే నిర్వహించారనే ఫిర్యాదులున్నాయి. వైకాపా ప్రభుత్వంలో కొన్నాళ్లు ఐటీ సలహాదారుగా పనిచేసిన ఈయన.. జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్ల అమ్మాలనేది ఈయన ఆదేశాల మేరకే జరిగేవన్న విమర్శలున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భారీ కార్యాలయం ఏర్పాటుచేసుకుని ఈ దందా నడిపించినట్లు సమాచారం. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు, బ్రూవరీస్, ఇథనాల్‌ ప్లాంట్ల నుంచి ‘జే ట్యాక్స్‌’ వసూలు చేసేవారని తెదేపా శ్రేణులు చెబుతున్నాయి.

దందా అమలులో పాత్రధారులు సత్యప్రసాద్, శౌరి, వేణుగోపాల్‌

  • ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు చెల్లించేందుకు అంగీకరించిన కంపెనీల బ్రాండ్లు, జే బ్రాండ్లకే ఆర్డర్లు లభించేలా చేయడంలో సత్యప్రసాద్‌దే ప్రధానపాత్ర అనే ఫిర్యాదులున్నాయి. కసిరెడ్డి ఆదేశాల మేరకు పనిచేస్తూ, వాటిని అమలు చేసేవారు. ఏపీఎస్‌బీసీఎల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన చెప్పిన బ్రాండ్లే ప్రభుత్వ దుకాణాల్లో అమ్మేలా డిపో మేనేజర్లకు రోజూ ఆదేశాలిచ్చేవారన్న ఫిర్యాదులున్నాయి. 
  • ఎక్సైజ్‌ శాఖలో ఈఎస్‌గా ఉన్న శౌరి... సత్యప్రసాద్‌కు సహాయకుడిగా ఉంటూ మద్యం కొనుగోలు ఆర్డర్లు సిద్ధం చేయడంలో కీలకపాత్ర పోషించారనే ఫిర్యాదులున్నాయి.
  • ఏసీఎస్‌బీసీఎల్‌లో జీఎంగా పదవీవిరమణ చేసి, తర్వాత వాసుదేవరెడ్డి వద్ద ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాల్‌ది ఈ దందాలో ప్రధానపాత్రని తెదేపా గుర్తించింది. 

సచివాలయంలో కీలక అధికారి ప్రమేయం?

సచివాలయంలో కీలకంగా ఉన్న ఓ సీనియర్‌ ఉన్నతాధికారి... ఈ అక్రమాల్ని అడ్డుకోకుండా పరోక్షంగా సహకరించారన్న ఫిర్యాదులున్నాయి. అందుకు ప్రతిగా ఆయన తరఫున బినామీగా, కలెక్షన్‌ ఏజెంట్లుగా ఉండే ఓ వ్యక్తికి భారీగా సొమ్ములు అందాయని చెబుతున్నారు.

రూ.లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలే

చిన్న చిల్లర దుకాణం వద్ద చూసినా డిజిటల్‌ లావాదేవీలు ఉంటాయి. కానీ జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని నగదు రూపంలోనే అమ్మింది. గతేడాది ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది. ఈ మొత్తం దందాలో వేలకోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని, నల్లధనం పోగుపడుతోందన్న ఫిర్యాదులున్నాయి. 

సీబీఐ, ఈడీ రంగంలోకి దిగితేనే..

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా మొదలుకుని.. విక్రయాల వరకూ అన్నింటా వ్యవస్థీకృతంగా సాగించిన ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో సూత్రధారులుగా ఉన్న నేతలు, పాత్రధారులైన అధికారులు, ప్రభుత్వ  పెద్దలు, అధికారపార్టీ కీలక నాయకుల బినామీలు, సన్నిహితులుగా పేరొందిన వారి నివాసాలు, కార్యాలయాల్లో, అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు  దక్కించుకున్న సంస్థల్లో ఎక్కడ సోదాలు చేసినా ఈ కుంభకోణం డొంక బయటపడుతుంది. వారిలో ఏ ఒక్కరిని విచారించినా గుట్టంతా వీడుతుంది. దిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న ట్రైడెంట్‌ కెమ్‌ఫర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు, ఏపీఎస్‌బీసీఎల్‌ నుంచి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌  లిమిటెడ్‌కు మధ్య విడదీయలేని అనుబంధముంది. ఈ కోణంలోనూ సీబీఐ, ఈడీ దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు