Pinnelli: కోర్టు షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారు

మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను పగలగొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తనపై నమోదుచేసిన మరో మూడు కేసులలో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Updated : 27 May 2024 12:44 IST

హైకోర్టుకు నివేదించిన పీపీ
ముందస్తు బెయిలు పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడు
సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది వాదన
మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిలు కోసం పిన్నెల్లి పిటిషన్లు 

ఈనాడు, అమరావతి: మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను పగలగొడుతూ అడ్డంగా దొరికిపోయిన కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ పొందిన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తనపై నమోదుచేసిన మరో మూడు కేసులలో ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ఆదివారం అత్యవసర విచారణ జరిపింది. వాదనల కొనసాగింపునకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సీఐ నారాయణస్వామిపై పిన్నెల్లి, ఆయన అనుచరులు దాడిచేసి గాయపరిచిన కేసు వివరాలను పరిశీలించాలని పీపీకి సూచించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. 

మూడింటిలో రెండు హత్యాయత్నం కేసులు

  • రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌స్టేషన్‌లో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై రెంటచింతల పోలీసులు పిన్నెల్లితో పాటు మరో 15 మందిపై ఐపీసీ 307(హత్యాయత్నం)తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
  • పోలింగ్‌ మర్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. ఫిర్యాదు మేరకు పిన్నెల్లి, ఆయన తమ్ముడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.
  • పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను బద్దలుకొట్టి బయటకొస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లిని చెరుకూరి నాగశిరోమణి అనే మహిళ ప్రశ్నించగా.. ఆమెను తీవ్రంగా దుర్భాషలాడారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 506, 509, ఆర్‌పీ చట్టం సెక్షన్‌ 131 కింద కేసు నమోదు చేశారు.

అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో బహుళ ఎఫ్‌ఐఆర్‌లు

ఈ మూడు కేసులలో ముందస్తు బెయిలు కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో పిటిషనర్‌పై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారన్నారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు చూస్తున్నారని చెప్పారు. 

  • పోలీసుల తరఫున పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ‘హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారు. దీంతో పోలీసులు ఆయన కదలికలపై నిఘా ఉంచలేకపోయారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి నాకు సూచనలు అందాయి. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారు. మధ్యంతర బెయిలు మంజూరు చేయొద్దు. కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలి. ఓట్ల లెక్కింపు రోజున అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉంది’ అని తెలిపారు.
  • సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. హత్యాయత్నం లాంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఓ కేసులో సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తుచేశారు. బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి పూర్వ నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికలలో సైతం పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని కోర్టు దృష్టికి తెచ్చారు. ముందస్తు బెయిలు పొందేందుకు పిటిషనర్‌ అనర్హుడని చెప్పారు. వాదనల కొనసాగింపునకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని