Pinnelli: అలా ఉపశమనం.. ఇలా ప్రత్యక్షం

హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు.

Published : 29 May 2024 05:57 IST

నరసరావుపేటకు వచ్చిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 
హైకోర్టు ఉత్తర్వులిచ్చిన గంటల వ్యవధిలోనే రాక 
ఎస్పీ మలికా గార్గ్‌ ఎదుట రాత్రి 12 గంటలకు హాజరు
ఇన్నాళ్లూ ఆయన్ను పట్టుకోని పోలీసులు

పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పిన్నెల్లి

ఈనాడు, అమరావతి: హత్యాయత్నం కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం పొందిన గంటల వ్యవధిలోనే మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో ప్రత్యక్షమయ్యారు. మూడు కేసుల్లో జూన్‌ 6 వరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దంటూ మంగళవారం మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వగా... రాత్రి 9 గంటలకు ఆయన నరసరావుపేట చేరుకుని స్థానికంగా ఓ హోటల్‌లో బస చేశారు. రాత్రి 12 గంటల సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఎదుట ఆయన హాజరయ్యారు. కోర్టు విధించిన షరతులలో ప్రతిరోజూ ఎస్పీ ఎదుట హాజరు కావాలన్నది ఒకటి. అయితే, మొత్తం అన్ని కేసుల్లో అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి ఉపశమనం పొందేవరకూ పిన్నెల్లిని పట్టుకోలేకపోవటం రాష్ట్ర పోలీసుల వైఫల్యానికి నిదర్శనం. ఈవీఎం విధ్వంసం, హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలతో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల 15న రాష్ట్రం దాటి వెళ్లిపోయారు.

అయినా పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించలేదు. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను నేలకొసి కొట్టిన ఘటన సీసీటీవీ ఫుటేజి ఈ నెల 21న వెలుగుచూడటం, ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించడంతో అప్పటికప్పుడు ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆయన కోసం గాలిస్తున్నామని ప్రకటనలివ్వడమే తప్ప పట్టుకోలేదు. ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించి, అరెస్టు కాకుండా తాత్కాలిక రక్షణ పొందారు. ఈ నెల 23న ఈ ఉత్తర్వులొచ్చాయి. హత్యాయత్నం కేసుల్లో అరెస్టు చేసే అవకాశమున్నా పోలీసులు ఆ దిశగా చొరవ చూపలేదు. చివరికి ఆ కేసుల్లోనూ ఆయన హైకోర్టును ఆశ్రయించి అరెస్టు కాకుండా ఉత్తర్వులు పొందేవరకూ పోలీసులు మౌనముద్ర దాల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు