AP High Court: పిన్నెల్లి రోజూ ఎస్పీ కార్యాలయంలో హాజరుకావాలి

పోలింగ్‌ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో అరెస్టు నుంచి జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 29 May 2024 07:12 IST

పాస్‌పోర్టు కోర్టులో అప్పగించాలి.. 
నరసరావుపేటలోనే ఉండాలి.. 
సాక్షులను కలవడానికి వీల్లేదు 
మాచర్ల ఎమ్మెల్యేకు హైకోర్టు ఆంక్షలు
జూన్‌ 6 వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు
ఆయనపై నిఘా ఉంచాలని సీఈఓకు ఆదేశం

ఈనాడు, అమరావతి: పోలింగ్‌ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో మూడు కేసుల్లో అరెస్టు నుంచి జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ మంగళవారం హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అరెస్టుతోపాటు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అయితే ఎమ్మెల్యే పల్నాడు ఎస్పీ కార్యాలయంలో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోపు హాజరు కావాలని స్పష్టం చేసింది. నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ఆ ఊళ్లో ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని ఆదేశించింది. పాస్‌పోర్టు అప్పగించాలని, దేశం దాటి వెళ్లొద్దని ఆంక్షలు విధించింది. న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘిస్తే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది.

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం, తనను నిలదీసిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను తీవ్రంగా దుర్భాషలాడటం, పోలింగ్‌ మరుసటిరోజు తన సోదరుడు, అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరచడం వంటి ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్‌ ఇవ్వవద్దని బాధితులు, పోలీసులు, బెయిల్‌ ఇవ్వాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ ఇవ్వద్దని బాధితుల తరఫు న్యాయవాదులు వాదించగా.. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని, ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిన్నెల్లి తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. సోమవారం వాదనలు ముగిశాయి. పిన్నెల్లికి అరెస్టు నుంచి జూన్‌ 6 వరకు రక్షణ కల్పిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.


షరతులు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చు

  • పిన్నెల్లి కదలికలపై పోలీసు అధికారులతో పూర్తిస్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ని హైకోర్టు ఆదేశించింది.
  • ఏ విధమైన నేరకార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని, నేర ఘటనలను పునరావృతం చేయవద్దని  తేల్చిచెప్పింది.
  • జిల్లాలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించొద్దని పిన్నెల్లికి స్పష్టం చేసింది.
  • అనుచరులను నియంత్రించే బాధ్యత, ఆ ప్రాంతంలో ప్రశాంతతకు, బాధితులకు ఏ విధమైన అవరోధాలు కలిగించే ప్రయత్నాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదేనని తెల్చిచెప్పింది. 
  • ఈ కేసులకు సంబంధించి తన పాత్ర గురించి మీడియాతో మాట్లాడవద్దని స్పష్టం చేసింది. బాధితులను/సాక్షులను కలవడానికి వీల్లేదంది. వారిని ప్రభావితం, భయపెట్టడం చేయవద్దని ఆదేశించింది.
  • పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలో మాత్రమే ఉండాలని పిన్నెల్లికి తేల్చిచెప్పింది. ఓట్ల లెక్కింపు కేంద్రం మరోచోట ఉన్నట్లయితే.. లెక్కింపు రోజు మాత్రమే అక్కడికి వెళ్లవచ్చంది. 
  • గురజాల మేజిస్ట్రేట్‌ కోర్టులో పాస్‌పోర్టును అప్పగించాలని పిన్నెల్లిని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లొద్దంది. 
  • బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వారికి రక్షణగా గస్తీ ఏర్పాటు చేయాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది.  

ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాల్సిందే

ఏడేళ్లకు పైబడి శిక్షపడేందుకు వీలున్న ఐపీసీ సెక్షన్‌ 307 (హత్యాయత్నం) కేసుల్లో ఎన్నికల్లో పాల్గొన్న పలువురు అభ్యర్థులకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఇదే న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని న్యాయమూర్తి గుర్తుచేశారు. అదే సూత్రం పిటిషనర్‌కు వర్తిస్తుందన్నారు. ఎన్నికల బరిలో ఉన్నవారు/ప్రజాప్రతినిధులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. కేసు లోతుల్లోకి వెళ్లడం లేదని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ‘న్యాయచక్రాలు నెమ్మదిగా తిరుగుతుండొచ్చు కానీ.. సక్రమంగా తిరుగుతాయి’ అని సుప్రీంకోర్టు ఓ కేసులో ఉటంకించిన విషయాన్ని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. కౌంటర్‌ వేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను జూన్‌ 6కి వాయిదా వేశారు. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ.. ఎస్పీ ముందు హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఓట్ల లెక్కింపు రోజు (జూన్‌ 4)న ఆర్వో ముందు హాజరయ్యేలా సవరించాలని కోరగా ఆ ఒక్కరోజుకు కోర్టు వెసులుబాటు ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు