AP Election Violence: మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రపు సెక్షన్లే

వందల మంది రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రపు సెక్షన్లే తప్ప హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్‌లు పెట్టలేదు.

Updated : 11 Jun 2024 07:54 IST

ఈవీఎంలు ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
గుర్తుతెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు
హింసాత్మక ఘటనల్లో కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం
పోలింగ్‌ వేళ హింసాత్మక ఘటనలపై సిట్‌ తుది నివేదిక

ఈనాడు, అమరావతి: వందల మంది రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడినా నామమాత్రపు సెక్షన్లే తప్ప హత్యాయత్నం (ఐపీసీ 307) సెక్షన్‌లు పెట్టలేదు. మాచర్ల అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా వైకాపా నాయకులు పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేసినా గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదులిచ్చి తప్పించేందుకు యత్నించారు. అలాంటి విధ్వంస ఘటనలపై ప్రిసైడింగ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండగా.. బీఎల్వోలతో ఇప్పించారు. అత్యధిక కేసుల్లో నిందితులను ‘‘గుర్తుతెలియని వ్యక్తులు’’గా పేర్కొనడం గమనార్హం. ఆయా కేసుల్లో కొందరిని గుర్తించినా అరెస్టు చేయలేదు. పోలింగ్‌ రోజున, ఆ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసాత్మక, ఈవీఎంల విధ్వంస ఘటనలపై పోలీసులు వ్యవహరించిన తీరిది. కేసుల నమోదు, వాటి దర్యాప్తులోనూ అవసరమైన శ్రద్ధ చూపించలేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ అంశాలన్నింటినీ గుర్తించింది. గత నెల 20నే ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్‌.. తాజాగా 274 పేజీలతో సమగ్ర తుది నివేదికను డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, ఎన్నికల సంఘానికి అందజేసింది. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో నమోదైన తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన మొత్తం 37 కేసుల గురించి ప్రతి అంశాన్ని అందులో పొందుపరిచింది. వీటిల్లో ఈవీఎంల విధ్వంస ఘటనలకు సంబంధించినవి 7, ఇతర హింసాత్మక ఘటనలకు సంబంధించినవి 30 కేసులు ఉన్నాయి. 

11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు 

మొత్తం 37 కేసులకు గాను ఏకంగా 32 కేసుల్లో ఆ నేరానికి తగిన సెక్షన్లు వర్తింపజేయలేదని సిట్‌ గుర్తించింది. ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు జోడిస్తూ న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించి ఆ సెక్షన్లు జత చేయించింది. 11 కేసుల్లో హత్యాయత్నం సెక్షన్‌ (ఐపీసీ 307) పెట్టాల్సి ఉండగా దాన్ని వర్తింపజేయలేదు. అందులో 7 కేసులు పల్నాడు జిల్లా పరిధిలో, 4 కేసులు అనంతపురం జిల్లా పరిధిలో ఉన్నాయి. 21 కేసుల్లో నేరపూరిత కుట్ర సెక్షన్‌ (ఐపీసీ 120బీ) పెట్టలేదు. అందులో 13 పల్నాడు జిల్లా పరిధిలోనే ఉన్నాయి. 19 కేసుల్లో ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్లను, ఒక కేసులో ప్రభుత్వ ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం సెక్షన్‌లను, ఒక కేసులో ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్లను పెట్టాల్సి ఉన్నా పెట్టలేదు. ఇవే కాకుండా అనేక కేసుల్లో ఐపీసీ 143, 144, 145, 147, 148, 188, 448, 427, 506, 394 (బీ), 352 ,436, 452 రెడ్‌విత్‌ 149 వంటి సెక్షన్లను వర్తింపజేయాల్సి ఉన్నా పట్టించుకోలేదు. ఈ లోపాలను గుర్తించిన సిట్‌ వాటిని సరిదిద్దింది. 

  •  మాచర్లలో వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వాటికి అదనంగా ఐపీసీ 143, 147, 353, 452 రెడ్‌విత్‌/149,  ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 131, 135 సెక్షన్లను సిట్‌ సూచనతో పోలీసులు జత చేశారు.
  •  సత్తెనపల్లి నియోజకవర్గం గుండ్లపల్లె గ్రామంలో 170వ పోలింగ్‌ స్టేషన్‌లో సుమారు 60 మంది విధ్వంసం సృష్టించిన కేసులో పోలీసులు కొన్ని సెక్షన్లను మాత్రమే పెట్టగా వీటికి అదనంగా ఐపీసీ 120బి, 188, 352, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125, 128, 132, 134(ఎ, బి)సెక్షన్లను వర్తింపజేయాలని సిట్‌ తేల్చడంతో తర్వాత దర్యాప్తు అధికారులు వాటిని చేర్చారు.

ఆలస్యంగా ఫిర్యాదులు..

హింసాత్మక ఘటనల్లో అత్యధిక శాతం పట్టపగలు నివాసిత ప్రాంతాల్లోనే చోటుచేసుకున్నా దర్యాప్తులో ప్రత్యక్ష సాక్షుల్ని పోలీసులు ప్రశ్నించనేలేదు. వెబ్‌కాస్టింగ్‌ ఫీడ్‌ నుంచి ఈవీఎంల విధ్వంసానికి పాల్పడిన నిందితుల్ని గుర్తించే అవకాశమున్నా ఆ ప్రయత్నం చేయకుండానే గుర్తుతెలియని వ్యక్తులంటూ ఫిర్యాదులిచ్చారు. అది కూడా ఘటన జరిగిన వెంటనే కాకుండా కొంత జాప్యం చేశారు. ఆయా ఘటనల్లో పోలింగ్‌ బూత్‌ల్లోని సిబ్బందిని తప్పనిసరిగా ప్రశ్నించాలని సిట్‌ పేర్కొంది. ఈ కేసుల్లో ప్రిసైడింగ్‌ అధికారుల నుంచి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించిన సర్టిఫికెట్లు పొందాలని దర్యాప్తు అధికారులను సిట్‌ ఆదేశించింది. ఈవీఎం టెక్నీషియన్లు, పోలింగ్‌ అధికారుల నుంచి సీఆర్‌పీసీ 164 కింద వాంగ్మూలాలు తీసుకోవాలని నిర్దేశించింది. గతంలో భయం వల్ల వాంగ్మూలం ఇవ్వటానికి ముందుకు రాని సాక్షుల్ని గుర్తించి వారితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాలు నమోదు చేయించాలని సిట్‌ సిఫార్సు చేసింది. 


ర్యాలీలకు అనుమతించటం వల్లే తాడిపత్రిలో హింస 

తాడిపత్రిలో పోలింగ్‌ రోజున ఇరువర్గాల వారికి ద్విచక్రవాహనాల ర్యాలీలకు అనుమతిచ్చారు. 144 సెక్షన్‌ అమల్లో ఉన్నప్పటికీ ఇలా చేయడం గమనార్హం. ఆ పర్యవసానమే అక్కడ తీవ్ర హింసాకాండకు దారి తీసింది. ఈ ఘటనల్లో పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు. తిరుపతి, పల్నాడు జిల్లాల్లో చెలరేగిన హింస వల్ల పోలీసుల వాహనాలతో పాటు రాజకీయ నాయకులు, ప్రజల ఆస్తులూ, వాహనాలు ధ్వంసమయ్యాయి. కేసుల నమోదు, దర్యాప్తులో పోలీసులు తగిన శ్రద్ధ చూపకపోవడంతో సాక్షుల్ని మళ్లీ విచారించాలని సిట్‌ నివేదించింది. తీవ్ర గాయాలైన వారి     మెడికల్‌ ఎగ్జామినేషన్‌ రిపోర్టులు సేకరించి     ఆ మేరకు అవసరమైన సెక్షన్లను వర్తింపజేయాలని పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని