Bharati Cement: భారతి సిమెంటు వాహనాలను అడ్డుకున్న గ్రామస్థులు

భారతి సిమెంటు పరిశ్రమకు వెళ్లే వాహనాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లె గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 27 May 2024 07:16 IST

ఆందోళనకు దిగిన గ్రామస్థులకు సర్దిచెబుతున్న పోలీసులు

కమలాపురం, న్యూస్‌టుడే: భారతి సిమెంటు పరిశ్రమకు వెళ్లే వాహనాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైఎస్సార్‌ జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లె గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పరిశ్రమ ఉన్న పందిళ్లపల్లెలో రోడ్డుకు అడ్డంగా తాడు కట్టి వాహనాలను ముందుకు కదలకుండా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. రేయింబవళ్లు ఆ పరిశ్రమ నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు వెళుతుంటాయని, వాటి దుమ్మూ ధూళి వల్ల తమకు శ్యాసకోశ వ్యాధులు వస్తున్నాయని వాపోయారు. పలుమార్లు పరిశ్రమ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని, సిమెంటు లోడు లారీలకు కనీసం పట్టాలు కూడా కట్టుకోకుండా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక పందిళ్లపల్లెలో ఆందోళనకు సిద్ధమైనట్లు నల్లింగాయపల్లె గ్రామస్థులు వెల్లడించారు. వీరి ఆందోళనతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ స్తంభించడంతో పోలీసులు చేరుకుని సర్ది చెప్పేందుకు యత్నించారు. సిమెంటు పరిశ్రమ హెచ్‌ఆర్‌ గోపాల్‌రెడ్డి, సీఎస్‌వో సాంబశివరావు వచ్చి గ్రామస్థులతో మాట్లాడారు. మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని