iPhone: ఇకపై పాత ఫోన్‌ పార్ట్స్‌తో ఐఫోన్‌ రిపేర్‌!

iPhone: ఇప్పటివరకు ఒక ఐఫోన్‌ పార్ట్స్‌ను రిపేర్‌ అయిన మరో ఫోన్‌లలో వాడేందుకు అనుమతి లేదు. ఇక నుంచి అందుకు అవకాశం ఇవ్వనున్నట్లు యాపిల్‌ తెలిపింది.

Published : 12 Apr 2024 15:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌ (iPhone) రిపేర్‌ ప్రక్రియను ఎట్టకేలకు యాపిల్‌ సులభతరం చేయనుంది. పాత ఫోన్లలోని విడి భాగాలతో మరమ్మతులు చేసుకునేందుకు త్వరలో అనుమతించనున్నట్లు గురువారం ప్రకటించింది. వీటి వాడకం వల్ల రిపేర్‌ చేసిన ఫోన్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, ఈ మార్పును కొన్ని మోడళ్లకు మాత్రమే అనుమతించనుంది. అవేంటనేది మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ప్రస్తుతం ఐఫోన్‌ను (iPhone) రిపేర్‌ చేయాలంటే పార్ట్స్‌ పెయిరింగ్‌ అనే ప్రక్రియను అవలంబించాల్సి ఉంటుంది. అంటే డివైజ్‌ సీరియల్‌ నంబరుతో యాపిల్‌ విక్రయించిన కొత్త విడిభాగానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య సరిపోలాలి. అలాకాకుండా వాడిన పాత ఫోన్‌ నుంచి తీసుకున్న లేదా మార్కెట్‌లో దొరికిన పార్ట్‌ను అమర్చితే తరచూ నోటిఫికేషన్లు వస్తాయి. కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసిన పరికరాన్ని ధ్రువీకరించలేకపోతున్నామని చెబుతుంది. ఫేస్‌ఐడీ, టచ్‌ఐడీ వంటి సెన్సార్లయితే అసలు పని చేయవు. 

కొత్తగా తీసుకురానున్న విధానంతో ఈ గొడవ ఉండదు. పాత డివైజ్‌ నుంచి తీసుకున్న పరికరాలను రిపేర్‌కు గురైన ఫోన్‌లో అమర్చితే దానికదే ధ్రువీకరించుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే కొత్త భాగాలను కొనుగోలు చేసేటప్పుడు యూజర్లు, రిపేర్‌ షాప్‌వాళ్లు ఇకపై ఫోన్‌ సీరియల్‌ నంబర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫేస్‌ఐడీ, టచ్‌ఐడీ.. వీటన్నింటికీ ఈ మార్పు వర్తించనుంది.

ఈ మార్పుతో యాపిల్‌ (Apple) పాత ఫోన్ల పరికరాల వాడకాన్ని సైతం ట్రాక్‌ చేయనుంది. యాక్టివేషన్‌ లాక్‌ ఫీచర్‌ను ఐఫోన్‌ పార్ట్స్‌కు సైతం విస్తరించనున్నట్లు తెలిపింది. తద్వారా దొంగతనానికి గురైన ఫోన్లలోని విడి భాగాలను వాడితే అవి పనిచేయబోవు. రిపేర్‌ చేస్తున్న ఫోన్‌లో యాక్టివేషన్‌ లాక్‌ లేదా లాస్ట్‌ మోడ్‌ ఎనేబుల్‌ చేసిన ఫోన్‌లో పాత డివైజ్‌లోని విడిభాగాన్ని వాడితే దాని పనితీరును ఐఓఎస్‌ కట్టడి చేస్తుంది. అయినా, అలాగే వాడుతూ ఉంటే సెట్టింగ్స్‌లోని సర్వీస్‌ హిస్టరీ సెక్షన్‌లో ఆ సమాచారం సేవ్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని