సంక్షిప్తవార్తలు (7)

Eenadu icon
By Business News Desk Published : 01 Nov 2025 01:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

8% తగ్గిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) సెప్టెంబరు త్రైమాసికంలో రూ.4,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.5,328 కోట్ల కంటే ఇది 8% తక్కువ. ఆదాయం కూడా రూ.35,445 కోట్ల నుంచి రూ.35,026 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం మాత్రం రూ.30,278 కోట్ల నుంచి రూ.31,511 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.11,637 కోట్ల నుంచి రూ.11,954 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) సెప్టెంబరు చివరికి 2.16 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలూ 0.57 శాతానికి తగ్గాయి. మొండి బాకీలకు కేటాయింపులు రూ. 2,336 కోట్ల నుంచి రూ.1,232 కోట్లకు తగ్గాయి.


బీపీసీఎల్‌ డివిడెండ్‌ రూ.7.50

దిల్లీ: భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), సెప్టెంబరు త్రైమాసికంలో రూ.6,442.53 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం రూ.2,397.93 కోట్లతో పోలిస్తే ఇది 169% అధికం. రిఫైనింగ్‌ మార్జిన్లు పుంజుకోవడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.7.5 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 

బ్యారెల్‌ ముడిచమురును పెట్రోల్, డీజిల్‌ వంటి ఇంధనాలుగా మార్చడం ద్వారా 10.78 డాలర్లను సంస్థ ఆర్జించింది. 2024 జులై- సెప్టెంబరులో ఇది బ్యారెల్‌కు 4.41 డాలర్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం 3% పెరిగి రూ.1.21 లక్షల కోట్లకు చేరింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో తమ రిఫైనరీలు 111% సామర్థ్య వినియోగంతో 9.82 మిలియన్‌ టన్నుల ముడిచమురును శుద్ధి చేశాయని, ఏడాది క్రితం ఇది 10.29 మిలియన్‌ టన్నులుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దేశీయ విక్రయాలు గత త్రైమాసికంలో 2.26% పెరిగి 12.67 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. 


నకిలీ ఐటీసీ రాకెట్‌ను ఛేదించిన జీఎస్‌టీ అధికారులు 

దిల్లీ: నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) క్లెయిమ్‌ చేసి రూ.31.95 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన కేసును జీఎస్‌టీ అధికారులు ఛేదించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు శుక్రవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మోసపూరితంగా ఐటీసీని ఒక కంపెనీ పొందుతున్నట్లు సీజీఎస్‌టీ దిల్లీ సౌత్‌ కమిషనరేట్‌కు చెందిన పన్ను ఎగవేత నిరోధక శాఖ దర్యాప్తులో గుర్తించింది. దీంతో ఆ కంపెనీ డైరెక్టరును అరెస్టు చేశారు. 


క్షీణత బాటలోనే చైనా తయారీ రంగం

చైనా తయారీ రంగ ఉత్పత్తిలో వరుసగా ఏడో నెలా క్షీణత నమోదైంది. ఆ దేశ అధికారిక తయారీ రంగ సూచీ అక్టోబరులో 49 పాయింట్లకు దిగివచ్చింది. అంచనా వేసిన దాని కంటే కూడా ఇది చాలా తక్కువ. సెప్టెంబరులో ఇది 49.8 పాయింట్లుగా ఉంది. చైనాపై సుంకాలను 57% నుంచి 47 శాతానికి తగ్గించనున్నట్లు అమెరికా తాజాగా నిర్ణయించడంతో, చైనా ఎగుమతులు పుంజుకోవచ్చని భావిస్తున్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపించొచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  


67% పెరిగిన పతంజలి ఫుడ్స్‌ లాభం 

పతంజలి ఫుడ్స్, సెప్టెంబరు త్రైమాసికంలో రూ.516.69 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2024-25 ఇదే కాల లాభం రూ. 308.58 కోట్ల కంటే ఇది 67% అధికం. మొత్తం ఆదాయం రూ. 8132.76 కోట్ల నుంచి రూ.9850.06 కోట్లకు పెరిగింది. 


విదేశీ మారకపు నిల్వలు తగ్గాయ్‌

అక్టోబరు 24తో ముగిసిన వారంలో మన విదేశీ మారకపు నిల్వలు 6.925 బిలియన్‌ డాలర్లు తగ్గి 695.355 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలో ఇవి 4.496 బిలియన్‌ డాలర్లు పెరిగి 702.28 బిలియన్‌ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 3.862 బిలియన్‌ డాలర్లు తగ్గి 566.548 బిలియన్‌ డాలర్లకు పరిమితం అయ్యాయి. పసిడి నిల్వల విలువ 3.01 బిలియన్‌ డాలర్లు తగ్గి 105.536 బిలియన్‌ డాలర్లకు దిగివచ్చింది. 


సంక్షిప్తంగా.. 

  • హరిత ఇంధన రంగంలోని ప్రముఖ సంస్థలతో 28 ఒప్పందాలను వి.ఒ.చిదంబరనార్‌ పోర్ట్‌ అథారిటీ (ట్యుటికారన్‌) కుదుర్చుకుంది. ఈ మొత్తం ఒప్పందాల విలువ రూ.1.27 లక్షల కోట్ల వరకు ఉంటుంది. 
  • కొత్త తరం ఇంజిన్ల తయారీ నిమిత్తం చెన్నై ప్లాంటులో రూ.3,250 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెరికా వాహన తయారీ సంస్థ ఫోర్డ్‌ తెలిపింది. 
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు స్థిరమైన భవిష్యత్‌ అంచనాతో బీఏఏ2 రేటింగ్‌ను మూడీస్‌ కొనసాగించింది. మూలధన వ్యయాల కోసం అధికంగా వెచ్చిస్తున్నా, పటిష్ఠ ఆర్థిక మూలాలు, నిధుల లభ్యత, ఆర్థిక విధాన నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని సంస్థకు ఈ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు