sandalwood: చందన పరిమళాలకు దూరమవుతున్నాం

Eenadu icon
By Business News Desk Published : 02 Nov 2025 02:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

70% ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించిన ఆస్ట్రేలియా
దేశీయంగా పూర్వవైభవం సాధించడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి
శాండల్‌వుడ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ నివేదిక 
ఈనాడు, దిల్లీ

చందన మార్కెట్‌లో భారత ప్రాభవం కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వం నియమించిన శాండల్‌వుడ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో అత్యధికంగా పెరిగే ఈ వృక్షజాతిని విపరీతంగా నరికేయడం కారణంగా మేలురకం జన్యురకాలు అంతరించి, నాసిరకం జాతులు మిగిలినట్లు వెల్లడించింది. ఒకవైపు సరఫరా తగ్గి, అంతర్జాతీయ మార్కెట్‌లో చందనానికి డిమాండ్‌ విపరీతంగా పెరిగిందని పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 70% మార్కెట్‌ వాటాను గుప్పిట్లో ఉంచుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెలిగిన భారత ప్రభావాన్ని పునరుద్ధరించాలంటే, మన ప్రభుత్వాలు జోక్యం చేసుకుని దేశంలో చందన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని సూచించింది. 

దిగుమతులే అధికం

2023-24లో మనదేశం నుంచి 0.62 మిలియన్‌ డాలర్ల విలువైన చందనం ఎగుమతి జరిగితే 5.59 మిలియన్‌ డాలర్ల దిగుమతులు జరిగాయి. ఒకప్పుడు ప్రధాన చందన తైలం ఉత్పత్తిదారుగా ఉన్న భారత్‌.. క్రమంగా భారీ దిగుమతిదారుగా మారింది. అందుకు కారణం దేశీయంగా కావాల్సినంత చందన కలప దొరకకపోవడమే. ప్రపంచవ్యాప్తంగా చందన మార్కెట్‌ విస్తరిస్తోంది. 2023లో   265.8 మిలియన్‌ డాలర్ల మేర ఉన్న ఈ మార్కెట్, 2030 నాటికి 502.2 మిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఈ ఏడేళ్లలో 9.4% మేర వార్షిక వృద్ధిరేటు నమోదు చేస్తుందని అంచనా. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దేశంలో మరోసారి అమూల్యమైన ఈ వనరుపై దృష్టిసారించి మళ్లీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్‌ను అందుకోవాలి. 

పెంపకందార్లకు ఇబ్బందులు నివారించాలి

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న చట్టాలు, నిబంధనలను సవరించి చందనం చెట్లను సులభంగా పెంచడంతో పాటు, ఇబ్బందుల్లేకుండా రవాణా, మార్కెటింగ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. పంటపొలాల్లో పెంచిన మొక్కలను పంట ఉత్పత్తిగా పరిగణించాలి. ఇందుకోసం కేంద్ర పర్యావరణ, అటవీశాఖ భారత అటవీచట్టం 1927ని సవరించి, పంట పొలాల్లో పెంచిన చందన మొక్కలను అటవీ ఉత్పత్తుల నుంచి తొలగించాలి. ఆర్థిక సంస్థలు ఈ మొక్కల పెంపకానికి అవసరమైన రుణాలు ఇవ్వడంతో పాటు, బీమా సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వాలు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందించాలి. పంట పొలాల్లో పెంచిన చందన ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి. మేలురకం జాతులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూర్చి, పరిశోధనను ప్రోత్సహించాలి. మార్కెట్, ధరలు, ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించి, ఈ రంగంపై ఆధారపడినవారికి అందించాలి. చందన కలపతో చేసే కళాకృతుల వ్యాపారాన్ని సులభతరం చేయాలి. చందన మొక్కల పెంపకం కోసం సంస్థాగతంగా రుణ సౌకర్యం, ప్రోత్సాహకాలు, బీమా సౌకర్యం కల్పించేందుకు కేంద్ర పర్యావరణం, అటవీ, ఆయుష్‌ మంత్రిత్వశాఖలు చర్యలు తీసుకోవాలి. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం అమలయ్యేలా చూడాలి. ఈ పంటను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్రాల స్థాయిల్లోనూ బోర్డులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఈ నివేదిక పేర్కొంది. 

ఇష్టం వచ్చినట్లు కొట్టేయడం వల్లే

చందనం చెట్లు ప్రధానంగా కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోని 9,600 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ వనరుకున్న ప్రాధాన్యాన్ని గుర్తించకుండా విపరీతంగా కొట్టేయడంతో నాణ్యమైన జాతులన్నీ అంతరించిపోయి, తాలు సరుకు మిగిలిపోయింది. ఈ లోపాన్ని అధిగమించాలంటే మళ్లీ మేలురకం మొక్కల పెంపకంపై దృష్టిసారించాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాల్లో చాలా ప్రైవేటు సంస్థలు, సంఘాలు, రైతులు వాణిజ్యపరంగా పెద్దసంఖ్యలో మొక్కల పెంపకం చేపట్టారు. దీనివల్ల పంటపొలాల్లో చందన మొక్కల పెంపకం అన్నది 30,000 హెక్టార్ల దాకా చేరే అవకాశం ఉంది. తర్వాత యేటా 600 హెక్టార్ల మేర విస్తరిస్తుందని అంచనా. ఇది కొంత ఆశాజనకంగా ఉన్నా మొక్కల వృద్ధి, కోత, మార్కెటింగ్‌ విషయంలో రైతులు ప్రధానంగా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మాజీ ఐఏఎస్‌ అధికారి రతన్‌ పి.వాటాల్‌ నేతృత్వంలో శాండల్‌వుడ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నింటినీ సమీక్షించి ఇప్పుడున్న విధానాలు, న్యాయపరమైన నిబంధనావళిలో మార్పులు సూచిస్తూ సిఫార్సులు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు