Love marriage: ప్రేమ పెళ్లి విషయంలో ఘర్షణ.. ముగ్గురి మృతి

కొన్ని నెలల క్రితం జరిగిన ప్రేమ వివాహం విషయంలో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలో ముగ్గురి ప్రాణాలు బలైపోయాయి.

Updated : 28 Feb 2024 19:46 IST

ముజఫర్‌నగర్‌: గతంలో జరిగిన ప్రేమ వివాహం విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఫులాత్‌ గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు గ్రూపుల మధ్య మంగళవారం చెలరేగిన ఈ ఘర్షణలో అంకిత్‌ (25), రోహిత్‌ (29) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో యువకుడు బుధవారం ప్రాణాలు విడిచాడు. 

వివరాల్లోకి వెళ్తే.. అంకిత్‌ అనే యువకుడు హరిమోహన్‌ అనే వ్యక్తి కుమార్తెను ఆ కుటుంబానికి ఇష్టం లేకుండా కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ జంట మేరఠ్‌లో కాపురం పెట్టింది. అప్పట్నుంచి ఇరువర్గాల మధ్య వైరం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో అంకిత్‌ మంగళవారం ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు మేరఠ్‌ నుంచి ముజఫర్‌నగర్‌ వచ్చాడు. గమనించిన హరిమోహన్‌ వర్గం యువకుడిపై దాడికి పాల్పడింది. ఈక్రమంలో తుపాకీ కాల్పులు చోటుచేసుకోవడంతో అంకిత్‌తో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురిపై కేసు నమోదు చేసినట్లు సీనియర్‌ ఎస్పీ అభిషేక్‌సింగ్‌ తెలిపారు. గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తుగానే అక్కడ పోలీసులను మోహరించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని