Crime: అబ్బాయి పుడతాడో లేదో తెలుసుకోవాలని భార్య కడుపు కోశాడు..నిందితుడికి జైలు శిక్ష

భార్య కడుపులో ఉన్నది మగా, ఆడ తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఓ కిరాతకుడికి ఉత్తరప్రదేశ్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

Published : 25 May 2024 00:03 IST

లఖ్‌నవూ: భార్య కడుపులో ఉన్నది మగబిడ్డా, ఆడబిడ్డా తెలుసుకోవడానికి ప్రయత్నించిన ఓ కిరాతకుడికి ఉత్తరప్రదేశ్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.  వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన పన్నాలాల్ కు ఐదుగురు సంతానం. వారంతా ఆడపిల్లలే కావడంతో అతడు తనకు కుమారుడు కావాలని భార్యను తరచూ హింసించేవాడు. తనకు కుమారుడిని ఇవ్వకపోతే విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. 

మరోసారి గర్భిణి అయిన తన భార్య అనిత మగబిడ్డకు జన్మనిస్తుందో, లేదోననే ఆలోచనతో ఆమెతో రోజూ గొడవకు దిగేవాడు. ఓ రోజు బిడ్డ విషయంలో గొడవ జరగ్గా కడుపులో ఉన్నది మగ బిడ్డేనా, లేదా అని తెలుసుకోవడానికి కొడవలితో ఆమె కడుపును చీల్చాడు.  దాంతో నొప్పి భరించలేక కేకలు వేస్తూ అనిత బయటకు పరిగెత్తింది. సమీపంలో ఉన్న బాధితురాలి సోదరుడు ఆమె అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అనితను ఆసుపత్రికి తరలించాడు. దాడి జరిగిన సమయంలో బాధితురాలు ఎనిమిది నెలల గర్భిణి అని, ఆమె కడుపులో ఉన్న మగబిడ్డ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. పరారీలో ఉన్న నిందితుడు పన్నాలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020 సెప్టెంబర్‌లో ఈ సంఘటన జరగ్గా ఈ కేసులో నిందితుడికి న్యాయస్థానం తాజాగా జీవిత ఖైదు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని