Secunderabad: మాను రూపంలో మాటు వేసిన మృత్యువు

భార్య కాలినొప్పితో బాధపడుతుండటంతో వైద్యుడికి చూపించేందుకు తీసుకెళ్తున్న భర్తను ఓ మోడువారిన చెట్టు రెప్పపాటులో బలి తీసుకుంది. వారి కోసమే కాచుకొనుందా అన్నట్లు ఆ దంపతులు ద్విచక్రవాహనంపై ఆసుపత్రి ఆవరణలోకి రాగానే ఒక్కసారిగా మీద పడింది.

Updated : 22 May 2024 09:35 IST

ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కూలిన చెట్టు
భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆసుపత్రి వద్ద చెట్టు విరిగి ఛాతీపై పడటంతో
ప్రాణాలొదిలిన రవీంద్ర, వెనుక రక్తమోడుతున్న సరళాదేవి

బొల్లారం, న్యూస్‌టుడే: భార్య కాలినొప్పితో బాధపడుతుండటంతో వైద్యుడికి చూపించేందుకు తీసుకెళ్తున్న భర్తను ఓ మోడువారిన చెట్టు రెప్పపాటులో బలి తీసుకుంది. వారి కోసమే కాచుకొనుందా అన్నట్లు ఆ దంపతులు ద్విచక్రవాహనంపై ఆసుపత్రి ఆవరణలోకి రాగానే ఒక్కసారిగా మీద పడింది. ఈ ఘటనలో భార్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన చూపరులను ఉలికిపాటుకు గురి చేసింది. నెల రోజుల క్రితమే ఎండిపోయిన ఆ వృక్షాన్ని ముందే తొలగించి ఉంటే ఒకరి ప్రాణాలు నిష్కారణంగా పోయేవి కాదని.. కనీసం ఇటీవల వర్షాలకు మొదళ్లు పెకలించుకుని వచ్చినప్పుడైనా స్పందించి ఉంటే ఆ ఉపాధ్యాయురాలికి ఇంత శోకం మిగిలేది కాదని అక్కడున్న వారు చెప్పుకోవడం గమనార్హం. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేటలోని తూంకుంట పట్టణంలో నివసించే సరళాదేవి బొల్లారంలోని త్రిశూల్‌ పార్కు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె కాలినొప్పికి చికిత్స నిమిత్తం భర్త రవీంద్ర(52)తో కలిసి ద్విచక్రవాహనంపై కంటోన్మెంట్‌ ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా పక్కనున్న తురాయి చెట్టు కుప్పకూలింది. రవీంద్ర ఛాతీపై కాండం పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన తన వెనుకున్న సరళాదేవి మీద పడటంతో ఆమె నేలపైపడ్డారు. దీంతో తల, వెన్నుపూస, కాళ్లకు గాయాలయ్యాయి. ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొద్ది క్షణాల ముందు అదే చెట్టు కింద నుంచి వచ్చిన వారు ఈ ఘటనను చూసి వణికిపోయారు. భర్త చనిపోయిన విషయం తెలియక ఆసుపత్రిలో ఆయన క్షేమ సమాచారాన్ని అడుగుతున్న సరళాదేవి పరిస్థితిని చూసి బంధువులు, తోటి ఉపాధ్యాయులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో మధుకర్‌నాయక్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. రెండు వారాల క్రితమే ఆసుపత్రిలోని ప్రమాదకర వృక్షాలను నరికి వేయించినట్లు వైద్యులు ఆయనకు వివరించడం గమనార్హం.

ఉదయం 10:03: 59 సెకన్లకు ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశిస్తున్న సరళాదేవి, రవీంద్ర దంపతులు

10:04 నిమిషాలకు వారిపై కూలిన చెట్టు

రవీంద్ర, సరళాదేవి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని