Bapatla: వాగులో మునిగి తండ్రీకుమారుల మృతి

వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి సరదాగా గడుపుదామని బాపట్ల జిల్లాకు వచ్చిన హైదరాబాద్‌ వాసుల విహారయాత్ర విషాదంగా మారింది.

Published : 30 May 2024 04:45 IST

మరో ఇద్దరు గల్లంతు - నలుగురూ హైదరాబాద్‌వాసులే 
వేసవి సెలవులకని వస్తే విషాదం..
బాపట్ల శివారులో ఘటన 

బాపట్ల, న్యూస్‌టుడే: వేసవి సెలవుల్లో పిల్లలతో కలిసి సరదాగా గడుపుదామని బాపట్ల జిల్లాకు వచ్చిన హైదరాబాద్‌ వాసుల విహారయాత్ర విషాదంగా మారింది. స్థానిక నల్లమడ వాగులో స్నానం చేస్తుండగా మునిగిపోతున్న కుమారుణ్ని కాపాడటానికి వెళ్లిన తండ్రి, వారిని రక్షించడానికి ప్రయత్నించిన మరో ఇద్దరు బంధువులు గల్లంతయ్యారు. వారిలో తండ్రీకుమారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట బీరప్పనగర్‌కు చెందిన దరబడి సునీల్‌కుమార్, ఆయన భార్యా పిల్లలు, బంధువులు బండా నందు, శ్రీనాథ్, ఈసీఐఎల్‌ సమీపంలోని నాగారానికి చెందిన వడ్లకొండ కిరణ్‌ కుటుంబసభ్యులతో కలిసి మొత్తం 12 మంది ఆదివారం బాపట్ల జిల్లాకు వచ్చారు. స్థానికంగా ఉన్న బంధువులను కలవడంతో పాటు సూర్యలంక బీచ్‌కు వెళ్దామని నిర్ణయించుకున్నారు. తొలుత పొన్నూరు మండలం వడ్డిమక్కులలో బంధువుల ఇంటికి వెళ్లి రెండ్రోజులు ఉన్నారు. అనంతరం బుధవారం ఉదయం మునిపల్లెలో మరో బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి పర్చూరు మండలం వీరన్నపాలెం వెళ్తుండగా పట్టణ శివారులోని నల్లమడ వాగు వద్ద ఆగారు. 

ఒకరి వెంట మరొకరు మృత్యుఒడిలోకి..

కొంతసేపు సేదదీరాక వాగులో స్నానం చేయడానికి శ్రీనాథ్, నందు కుమారుడు బిట్టు, సునీల్‌కుమార్‌ కుమారుడు సన్నీ దిగారు. శ్రీనాథ్, బిట్టు స్నానం చేసి ఒడ్డుకు వచ్చారు. పోటు ప్రభావంతో సముద్రంలోని నీరు వాగులో ఎదురు ప్రవహిస్తూ ఉద్ధృతంగా ఉంది. వాగునీటిలో టైర్‌ ట్యూబ్‌ను పట్టుకుని సన్నీ(13) ఎగురుతుండగా అదుపుతప్పి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో ఒడ్డున ఉన్న తండ్రి సునీల్‌కుమార్‌(36) వాగులోకి దిగారు. కుమారుణ్ని కాపాడే ప్రయత్నంలో ఆయన కొట్టుకుపోయారు. సునీల్‌కుమార్‌ను రక్షించేందుకు కిరణ్‌(35), నందు(35) వెళ్లి వారూ గల్లంతయ్యారు. సుడిగుండాలు ఎక్కువగా ఉండటంతో నలుగురు బయటకు రాలేకపోయారు. స్థానిక మత్స్యకారులు స్పందించి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలించారు. 

గంటన్నర గాలింపు తర్వాత..: సమాచారం తెలుసుకుని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. వాగులో ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత 500 మీటర్ల దూరంలో సునీల్‌కుమార్, సన్నీ మృతదేహాలు కనిపించాయి. భర్త, కుమారుడి మృతదేహాలను చూసి భార్య కోటేశ్వరి గుండెలవిసేలా రోదించారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని