Tirupati: హారన్‌ కొట్టాడని.. బస్సు డ్రైవర్‌పై దాడి

నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న యువకులు.. హారన్‌ కొట్టాడని ఓ బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటన తిరుపతిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Updated : 11 Nov 2023 07:28 IST

తిరుపతిలో నడిరోడ్డుపై పుట్టినరోజు సంబరాలు  
దారివ్వాలని హారన్‌ కొట్టడంతో ఆగ్రహం

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: నడిరోడ్డుపై పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న యువకులు.. హారన్‌ కొట్టాడని ఓ బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ ఘటన తిరుపతిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తిరుపతిలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన శివ, శశి స్నేహితుల పుట్టినరోజు వేడుకలను గురువారం అర్ధరాత్రి స్థానిక శంకరంబాడి సర్కిల్‌ సమీపంలోని ఎంఆర్‌ఎఫ్‌ షోరూం వద్ద ప్రధాన రోడ్డుపై నిర్వహించారు. ఆరుగురు యువకులతో కలిసి నడిరోడ్డుపై ద్విచక్రవాహనాలు అడ్డు పెట్టి కేకులు కోస్తూ హడావుడి చేశారు. అదే సమయంలో అభిషేక్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తూ ఆ మార్గంలోకి ప్రవేశించింది. రోడ్డుకు అడ్డుగా ఉన్న యువకులు తప్పుకోవాలని బస్సు డ్రైవర్‌ గణేష్‌ హారన్‌ కొట్టారు. ఆగ్రహించిన యువకులు బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు పక్క అద్దాలు పగిలాయి. వారిని అడ్డుకోబోయిన డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టారు. ఇంతలో పోలీసులు రావడంతో యువకులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు. డ్రైవర్‌ను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. గంజాయి తీసుకోవడం వల్లే ఆ యువకులు అలా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని