East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..

ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

Updated : 29 Nov 2023 07:05 IST

తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

నల్లజర్ల, గోపాలపురం, న్యూస్‌టుడే: ఓ దస్తావేజు లేఖరిని ఇద్దరు దుండగులు ఇంటికి వచ్చి మరీ తుపాకీతో కాల్చి చంపిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, పోలీసులు తెలిపిన ప్రకారం.. పుల్లలపాడుకు చెందిన కాట్రగడ్డ ప్రభాకర్‌(60) సమీపంలోని అనంతపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద భూ సెటిల్‌మెంట్‌లు చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయిస్తుంటారు. ఈ క్రమంలో పలువురు ఆయన ఇంటికి వెళ్తుంటారు. అదే మాదిరిగా మంగళవారం సాయంత్రం 6:30 ప్రాంతంలో కారులో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్‌ ఇంటికి వచ్చారు. వాళ్లు ఆయనతో రూ.12 లక్షల విషయం ఏం చేశారని మాట్లాడుతుండటంతో భూమికి సంబంధించిన విషయమై ఉంటుందని అక్కడే ఉన్న భార్య సావిత్రి లోపలకు వెళ్లిపోయారు. ఇంతలో రెండు నిమిషాలకే తుపాకీ పేలిన శబ్దం రావడంతో ఆమె బయటకు రాగా అప్పటికే ప్రభాకర్‌ మృతి చెందినట్లు గుర్తించారు. దుండగులు ఇద్దరూ కారులో పరారయ్యారు. ఎస్పీ జగదీష్‌, కొవ్వూరు డీఎస్పీ వర్మ, సీఐ నున్న రాజు, ఎస్సైలు ఘటనా స్థలాన్ని, సమీపంలోని సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించారు. క్లూస్‌ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మృతుడు ఎక్కువగా భూమి సెటిల్‌మెంట్లు చేస్తుంటారని, ఆ కోణంలోనే హత్య జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని