పిల్లలను హతమార్చిన దంపతుల ఆత్మహత్య

పాలల్లో విషం కలిపి తాగించి లోకం తెలియని కన్నబిడ్డలిద్దర్నీ కడతేర్చిన దంపతులు చివరికి ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 13 Apr 2024 05:32 IST

34 రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో మృతదేహాల గుర్తింపు

గార్ల, న్యూస్‌టుడే: పాలల్లో విషం కలిపి తాగించి లోకం తెలియని కన్నబిడ్డలిద్దర్నీ కడతేర్చిన దంపతులు చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. 34 రోజుల తర్వాత అటవీ ప్రాంతంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..గార్ల మండలం అంకన్నగూడెం గ్రామానికి చెందిన పి.అనిల్‌ (26), దేవి (22) దంపతులకు లోహిత(3), జశ్విత(1) కుమార్తెలు. దంపతులిద్దరూ కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడి ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. మరోవైపు మూడోసారి గర్భం దాల్చిన దేవికి అనారోగ్య సమస్యలతో గర్భస్రావం జరిగింది. ఈ నేపథ్యంలో గత నెల 10వ తేదీ రాత్రి దంపతులిద్దరూ కుమార్తెలకు పాలల్లో విషం కలిపి తాగించారు. పిల్లలు మృతిచెందారని నిర్ధారించుకున్నాక ద్విచక్రవాహనంపై పరారయ్యారు. అప్పట్నుంచి అటు పోలీసులు, ఇటు బంధువులు వారి కోసం గాలిస్తూ వస్తున్నారు. అనిల్‌ ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని గత నెల 23న బయ్యారం మండలం నామాలపాడు వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వాహనం దొరికిన ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో ఇరువురి మృతదేహాలను పోలీసులు శుక్రవారం గుర్తించారు. ‘పిల్లలను కడతేర్చి..తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక సమస్యలు, దేవి అనారోగ్యమే కారణమని మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని