తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న చిన్నారి అదృశ్యం

తల్లి పొత్తిళ్లలో పడుకున్న 11 నెలల చిన్నారి అదృశ్యమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం కలకలం రేపింది.

Published : 22 May 2024 05:14 IST

సత్తుపల్లి, న్యూస్‌టుడే: తల్లి పొత్తిళ్లలో పడుకున్న 11 నెలల చిన్నారి అదృశ్యమైన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం కలకలం రేపింది. చిన్నారి తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ జయమ్మ కాలనీకి చెందిన వానరాసి జంపన్న, దుర్గ దంపతులు వారం క్రితం బతుకుదెరువు కోసం తమ కుమారుడు సాయిదేవాన్షును తీసుకుని సత్తుపల్లికి వలసవచ్చారు. స్థానిక గుడిపాడు రోడ్డు శివారులోని ప్రైవేటు భూముల్లో డేరా వేసుకుని అందులో తలదాచుకుంటున్నారు. జంపన్న గ్యాస్‌ పొయ్యిలను బాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో దుర్గ నిద్ర లేచి కుమారుడికి పాలు ఇచ్చి.. దుప్పటి కప్పి పడుకోబెట్టింది. ఒంటి గంటకు తిరిగి లేచి చూసేసరికి గుడారంలో అతడు కన్పించలేదు. చుట్టుపక్కల డేరాలు వేసుకున్న వారి వద్దకు వెళ్లి ఆరా తీశారు. స్థానికులతో కలిసి ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడపట్టారు. అయినా ఆచూకీ లభించలేదు. తమ కుమారుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ టి.కిరణ్‌ నేతృత్వంతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. తాము నివాసం ఉండే ప్రాంతానికి గత నాలుగైదు రోజులుగా సాయంత్రం సమయంలో ఓ కారు వస్తోందని, అందులో ఓ వ్యక్తి రాత్రి వరకు ఉండి వెళ్లిపోతున్నాడని, అతడే రెక్కీ చేసి చిన్నారిని కిడ్నాప్‌ చేసి ఉండొచ్చని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని