ఎన్టీఆర్‌ స్టిక్కర్‌ తొలగించడంపై గొడవ

ద్విచక్రవాహనంపై ఎన్టీఆర్‌ స్టిక్కర్‌ తొలగించే విషయమై ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు తూర్పుబజారు ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మందా కార్తీక్‌ (19), వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కారె నాగరాజు మధ్య గొడవ చోటుచేసుకోవడం, కొద్ది గంటల్లోనే కార్తీక్‌ మృతదేహమై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Updated : 06 Jun 2024 09:06 IST

గంటల వ్యవధిలోనే బాధిత యువకుడి మృతి
హతమార్చారని కుటుంబసభ్యుల ఆరోపణ

వత్సవాయి, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనంపై ఎన్టీఆర్‌ స్టిక్కర్‌ తొలగించే విషయమై ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు తూర్పుబజారు ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మందా కార్తీక్‌ (19), వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త కారె నాగరాజు మధ్య గొడవ చోటుచేసుకోవడం, కొద్ది గంటల్లోనే కార్తీక్‌ మృతదేహమై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఎస్సై అభిమన్యు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. నాగరాజు వైకాపా కార్యకర్త. ఆయనకు టాటా ఏస్‌ వాహనం ఉంది. ఈ వాహనానికి తెదేపా సానుభూతిపరుడైన కార్తీక్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పెనుగంచిప్రోలులో నిర్వహించిన తెదేపా సంబరాల్లో కార్తీక్‌ పాల్గొన్నారు. సాయంత్రం తన ద్విచక్రవాహనంపై వేమవరం వెళ్లారు. నాగరాజును కలిశారు. ఆ సమయంలో కార్తీక్‌ తన ద్విచక్రవాహనం వెనుక అంటించుకున్న ఎన్టీఆర్‌ స్టిక్కర్‌ను ఆయనతోనే బలవంతంగా తొలగింపజేస్తూ నాగరాజు వీడియో తీశారు. కార్తీక్‌ వారించినా వినలేదు. ఆ వీడియోను నాగరాజు తన వాట్సప్‌ స్టేటస్‌గా పెట్టుకున్నారు. స్టిక్కర్‌ తీసేయించిన 2, 3 గంటల్లోనే వేమవరం సమీపంలో రోడ్డు పక్కన కార్తీక్‌ తీవ్రగాయాలతో శవమై కనిపించారు. మృతదేహంపై బలమైన గాయాలున్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. గాయాలు కింద పడితే తగిలినట్లు లేవని, బలంగా కొట్టి హతమార్చారని మృతుడి తండ్రి మందా బెనర్జీ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వత్సవాయి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. నాగరాజుతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని