పోలీసు యాప్‌ల హ్యాకర్‌ 20 ఏళ్ల విద్యార్థి!

పోలీసు యాప్‌లను హ్యాక్‌ చేసి, అందులోని డేటాను విక్రయానికి పెట్టిన నిందితుడిని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) ఎట్టకేలకు పట్టుకుంది.

Updated : 10 Jun 2024 07:19 IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన జతిన్‌కుమార్‌గా నిర్ధారణ
దిల్లీలో అరెస్టు చేసి తీసుకొచ్చిన టీజీసీఎస్‌బీ బృందం

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు యాప్‌లను హ్యాక్‌ చేసి, అందులోని డేటాను విక్రయానికి పెట్టిన నిందితుడిని తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ) ఎట్టకేలకు పట్టుకుంది. హ్యాకర్‌ దిల్లీలో ఉంటున్న విద్యార్థి జతిన్‌కుమార్‌(20)గా గుర్తించి శనివారం అక్కడకు వెళ్లి అరెస్టు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఝాన్సీకి చెందిన జతిన్‌ గ్రేటర్‌ నొయిడాలో ఉంటూ చదువుకుంటున్నాడు. తెలంగాణ పోలీసుశాఖకు చెందిన ‘హ్యాక్‌ఐ’ యాప్‌ను గుర్తుతెలియని వ్యక్తి హ్యాక్‌ చేసినట్లు టీజీసీఎస్‌బీ ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే తెలంగాణ పోలీసుశాఖకే చెందిన ‘టీఎస్‌కాప్‌’ యాప్, ‘ఎస్‌ఎంఎస్‌ సర్వీసెస్‌’లోని డేటాను కూడా అదే హ్యాకర్‌ దొంగిలించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో ఆ డేటాను 150 అమెరికన్‌ డాలర్లకు విక్రయిస్తామంటూ అంతర్జాలంలో ప్రత్యక్షమవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు హ్యాకర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలీసుల డేటాను కొనుగోలు చేయదలిచినవారు తమను సంప్రదించాలంటూ హ్యాకర్‌ రెండు టెలిగ్రామ్‌ ఐడీలను అంతర్జాలంలో పొందుపరిచాడు. తనను పోలీసులు గుర్తించకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే టీజీసీఎస్‌బీ పోలీసులు సోషల్‌ ఇంజినీరింగ్‌ విధానాన్ని వినియోగించి హ్యాకర్‌ జతిన్‌కుమార్‌ దిల్లీలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసింది. అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్‌ రిమాండుపై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. విచారణ క్రమంలో నిందితుడు గతంలోనూ ఈ తరహా సైబర్‌ నేరాలకు పాల్పడినట్లు తేలింది. ఆధార్‌తోపాటు మరికొన్ని కీలక ఏజెన్సీల డేటాను లీక్‌ చేసినట్లు గుర్తించారు. బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయెల్‌ పర్యవేక్షణలో తక్కువ సమయంలో కేసును పరిష్కరించినందుకు ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్‌ కంపాటి, డీఎస్పీలు కేవీఎం ప్రసాద్, సంపత్, ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌రెడ్డి, కానిస్టేబుల్‌ సురేశ్‌ను డీజీపీ రవిగుప్తా అభినందించారు. పోలీసుశాఖకు చెందిన యాప్‌లు హ్యాక్‌ అయినా వినియోగదారుల సున్నిత, ఆర్థిక డేటాకు వచ్చిన ఇబ్బందేమీ లేదని డీజీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు. తప్పుడు ప్రచారం ద్వారా దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని