Software Engineer: అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గంగూరి శ్రీనాథ్‌(32) అమెరికాలో మృతిచెందారు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు అయిదేళ్ల క్రితం వివాహమైంది.

Updated : 18 Oct 2022 06:54 IST

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: గుంటూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గంగూరి శ్రీనాథ్‌(32) అమెరికాలో మృతిచెందారు. గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు, రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణి, రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌కు అయిదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఫ్లోరిడాలో ఉన్న వీరు ఆరు నెలల క్రితమే అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ఆహ్లాదంగా గడిపేందుకు భార్యాభర్తలు అట్లాంటాలో సాహస యాత్ర(ట్రెక్కింగ్‌)కు వెళ్లారు. క్లీవ్‌లెన్స్‌ మౌంటెన్‌ హిల్స్‌లో ఎత్తయిన ప్రదేశానికి వెళ్లిన శ్రీనాథ్‌ ప్రమాదవశాత్తూ 200 అడుగుల ఎత్తు నుంచి కింద పడి మృతిచెందారు. ఈ సమాచారం అందడంతో శ్రీనాథ్‌ తల్లిదండ్రులు మల్లేశ్వరి, బాబూరావు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శ్రీనాథ్‌ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకువచ్చేందుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉందని మృతుడి మామ సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు. అమెరికాలో ఉంటున్న గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్‌ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మల్లిక్‌ మేదరమెట్ల, అశోక్‌ కొల్లా, సరేష్‌ కాకర్ల బాధిత కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని