Kidney Racket: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి హైదరాబాద్‌ వైద్యుడు!

కేరళలో  వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు.

Updated : 24 May 2024 06:47 IST

కేరళ పోలీసుల దర్యాప్తులో వెల్లడి
ముఠాలో మరో ఇద్దరు దళారులు
వారిని పట్టుకునేందుకు రాజధానికి చేరుకున్న సిట్‌ బృందం

కేరళ పోలీసులకు పట్టుబడిన సబిత్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేరళలో  వెలుగుచూసిన అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడని కేరళ పోలీసులు గుర్తించారు. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్‌ నాసిర్‌ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ను నడిపించారని, అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది. ఈ కేసు ఛేదనకు ఎర్నాకుళం రూరల్‌ ఎస్పీ వైభవ్‌ సక్సేనా ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సభ్యులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇక్కడి మరో ఇద్దరు దళారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.  యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. కిడ్నీలు అమ్మించిన ఈ రాకెట్‌కు సూత్రధారి అయిన వైద్యుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. 

ఓ యువకుడి మృతితో వెలుగులోకి..

బెంగళూరు, హైదరాబాద్‌లకు చెందిన పేద యువకులను ముఠా సభ్యులు ఇరాన్‌ తీసుకెళ్లి.. అక్కడ కిడ్నీలను విక్రయింపజేస్తున్నారు. బాధిత యువకుల్లో ఒకరు మృతి చెందడంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని కీలక సభ్యుడు సబిత్‌ ఇరాన్‌ నుంచి కొచ్చి రాగా.. గత ఆదివారం అక్కడి విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని అంగమాలి జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. రిమాండ్‌ రిపోర్టులోని వివరాల ప్రకారం.. సబిత్‌ ఈ వృత్తిలోకి రావడానికి హైదరాబాద్‌కు చెందిన వైద్యుడే ప్రధాన కారణం. 2019లో దిల్లీకి చెందిన ఒక వ్యక్తికి కిడ్నీ ఇప్పించడం ద్వారా హైదరాబాద్‌ వైద్యుడు, సబిత్‌ల మధ్య స్నేహం మొదలైంది. బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి 40 మంది యువకులను ఇరాన్‌ తీసుకెళ్లి.. వారి కిడ్నీలు విక్రయించినట్లు సబిత్‌ అంగీకరించాడు. 

డబ్బు అవసరం ఉన్న పేద యువతను గుర్తించి.. వారికి డబ్బు ఆశ చూపి.. కిడ్నీలు విక్రయించేలా దళారులు ఒప్పిస్తున్నారు. వారికి కావాల్సిన పాస్‌పోర్టు, వీసాల వంటివి మరికొందరు దళారులు సమకూర్చి.. ఇరాన్‌కు తరలిస్తున్నారు. ఇరాన్‌లో రక్తసంబంధీకులు కానివారు అవయవాలు దానం చేసేందుకు అనుమతి ఉందని, అందుకే అక్కడికి తీసుకెళ్తున్నారని దర్యాప్తులో తేలింది. ఎవరి కిడ్నీ ఏ గ్రహీతకు సరిపోతుందో నిర్ధారణ అయిన తర్వాత ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చేయిస్తున్నారు. అనంతరం 20 రోజులపాటు దాతను అపార్ట్‌మెంట్లో ఉంచి.. కోలుకున్న తర్వాత స్వస్థలానికి తరలిస్తున్నారు. ఒక్కో కిడ్నీ దానం చేసినందుకు రూ.20 లక్షల వరకూ ఇస్తామని ఆశపెడుతున్నప్పటికీ ఖర్చులన్నీ చూపించి.. రూ.6 లక్షలు ముట్టజెబుతున్నారు.

ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు?

అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ సూత్రధారిగా చెబుతున్న హైదరాబాద్‌ వైద్యుడి గురించి సబిత్‌ చెబుతున్న వివరాలు స్పష్టంగా లేవని కేరళ పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడ్డా తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా సబిత్‌కు తప్పుడు వివరాలు చెప్పి ఉండవచ్చని భావిస్తున్నారు. దాదాపు 40 మంది యువకులను ఇరాన్‌ తరలించి కిడ్నీ దానం చేయించామని, ఇందులో హైదరాబాద్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారని పోలీసుల దర్యాప్తులో సబిత్‌ వెల్లడించాడు. ఆ యువకులు ఎవరన్నది కూడా తేలాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని