Crime news: మరో ఘోరం: మహిళను చంపి.. 50ముక్కలుగా కోసి..!

దిల్లీలోని శ్రద్ధ ఉదంతం తరహాలో ఝార్ఖండ్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. మహిళను 50 ముక్కలుగా కోసి చంపిన కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్టుచేశారు.

Updated : 18 Dec 2022 16:51 IST

రాంచీ: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ(Delhi) శ్రద్ధా వాకర్‌(Shraddha Walkar) హత్యోదంతం మరిచిపోకముందే మరో షాకింగ్‌ ఘటన(Shocking incident) వెలుగుచూసింది. తన సహజీవన భాగస్వామి శ్రద్ధను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్‌ పూనావాలా అత్యంత కిరాతకంగా చంపి 35 ముక్కలుగా కోసి చంపగా.. తాజాగా అదే తరహా ఘోరం  ఝార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళను చంపేసి దాదాపు 50కి పైగా ముక్కలుగా కోసిన ఘటనలో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అత్యంత హేయమైన ఈ ఘటన ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌ జిల్లా బోరియో పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం వెలుగుచూసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో 12 శరీర భాగాలను గుర్తించిన పోలీసులు.. మిగతా భాగాల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు రుబికా పహాదిన్‌ (23)తో దిల్దార్‌ అన్సారీ (28) అనే వ్యక్తి రెండేళ్లుగా సహజీవనం చేసి ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రలోభానికి గురిచేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అతడికి ఇది రెండో వివాహం. మహిళను చంపిన తర్వాత అరెస్టు నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో నిందితుడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 6గంటల సమయంలో సంతాలీ మోమిన్‌ తోలా ప్రాంతంలో ఓ పాత ఇంటి వద్ద ఓ మహిళ ఛిద్రమైన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ అనురంజన్‌ కిస్పొట్టా, ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అనంతరం జాగిలాలను రంగంలోకి దించారు. బాధితురాలు గిరిజన వర్గానికి చెందిన రుబికా పహాదిన్‌గా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. ఇంకా కొన్ని భాగాలు మిస్‌ అయ్యాయని.. వాటి కోసం సోదాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆమె భర్త దిల్దార్‌ అన్సారీని అరెస్టు చేశామని.. మృతురాలు అతడికి రెండో భార్య అని వివరించారు. మరోవైపు, మహిళను చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసేందుకు నిందితులు ఎలక్ట్రిక్‌ కట్టర్‌లాంటి పదునైన ఆయుధాన్ని వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక అనుమానితుడిగా ఆమె భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కిరాతక చర్యలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనతో రాజకీయ దుమారం నెలకొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రతిపక్ష భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు. హేమంత్‌ సోరెన్‌ సారథ్యంలోని ఝార్ఖండ్‌ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా.. చర్యలు తీసుకోవడంలేదని మండిపడుతున్నారు. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించకపోతే వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి తగిన రీతిలో సమాధానం చెబుతామని భాజపా అధికార ప్రతినిధి ప్రతుల్‌ సహదేవ్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని