డబ్బు కోసం బాలుడి కిడ్నాప్‌.. చంపేసి గోనె సంచిలో కుక్కిన వైనం

థానేలోని గోరేగావ్‌లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, అనంతరం దారుణంగా హత్య చేసి గోనె సంచిలో కుక్కిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Published : 26 Mar 2024 16:22 IST

మహారాష్ట్ర: థానేలోని గోరేగావ్‌లో డబ్బు కోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, అనంతరం హత్య చేసి గోనె సంచిలో కుక్కిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థానేలోని గోరేగావ్‌కు చెందిన సల్మాన్ మౌల్వీ అనే వ్యక్తి టైలర్‌గా జీవనం సాగిస్తున్నాడు. చాలా కాలం నుంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా అతని వద్ద అంత డబ్బు లేకపోవంతో ఎవరినైనా కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేయాలని కుట్ర పన్నాడు. 

ఇందులో భాగంగా అదే గ్రామానికి చెందిన ఇదాబ్(9) అనే బాలుడు ఆదివారం సాయంత్రం మసీదులో ప్రార్థనలు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా అతడిని కిడ్నాప్ చేశాడు. బాలుడిని ఇంటికి తీసుకెళ్లి గోనె సంచిలో కట్టేసి ఇంటి వెనుక పెరట్లో దాచాడు. అనంతరం బాలుడి తండ్రికి ఫోన్‌ చేసి రూ.23 లక్షలు ఇవ్వాలని లేదంటే ఇదాబ్‌ను హత్య చేస్తామని బెదిరించాడు. బాలుడు అపహరణకు గురయ్యాడని తెలియడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతడి కోసం వెతికారు. అనంతరం బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం సల్మాన్‌కు తెలియడంతో భయంతో మొబైల్‌లోని సిమ్‌ కార్డ్‌ తీసి పారేశాడు.

గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు సల్మాన్‌ ఇంటిని తనిఖీ చేయగా °హత్య చేసి గోనె సంచిలో కట్టి పడేసిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు. కిడ్నాప్, హత్య ఘటనలో సల్మాన్ సోదరుడు సఫువాన్‌ మౌల్వీ ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు