Hyderabad: ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు.. స్నాప్‌చాట్‌లో చాటింగ్‌, డ్రగ్స్‌ సరఫరా

గచ్చిబౌలి ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తోన్న క్రమంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి.

Published : 02 Mar 2024 23:20 IST

హైదరాబాద్‌: గచ్చిబౌలి ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తోన్న క్రమంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన డ్రగ్‌ సరఫరాదారుడిగా ఉన్న మీర్జా వహీద్‌ బేగ్‌ను పోలీసులు విచారించి, రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు పొందుపర్చారు. స్నాప్‌చాట్‌లో చాటింగ్‌ చేస్తూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గత నెల 29న బేగ్‌ను అరెస్టు చేసి అతని వద్ద 3.58 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఫిబ్రవరిలో 10 సార్లు బేగ్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇందులో క్రిష్‌ పేరును మరోమారు ప్రస్తావించారు. బేగ్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసేందుకు రెండు దఫాల్లో నిందితులు అతనికి రూ.30వేలు గూగుల్‌ పే ద్వారా చెల్లించారు. ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో 10 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు లిషిత, నీల్, సందీప్‌, శ్వేత ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరందరికీ నోటీసులు అందినా ఎలాంటి స్పందనలేదు. నీల్‌ విదేశాలకు పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దర్శకుడు క్రిష్‌ సోమవారం మరోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని