Suryapet: ఆటో-బస్సు ఢీ.. నలుగురి మృతి

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మోతె సమీపంలో ఆటో-బస్సు ఢీకొన్నాయి.

Updated : 28 Feb 2024 12:08 IST

మోతె: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం మోతె సమీపంలో ఆటో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు మోతె మండలం బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి అండర్‌ పాస్‌ వంతెన వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సౌభాగ్యమ్మ అనే మహిళ చనిపోయారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోకు చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని