Crime News: పుట్టిన వెంటనే పిల్లల్ని చంపి.. ఏళ్ల పాటు ఫ్రిజ్‌లోనే పెట్టి..!

చిన్నారులపై కన్న ప్రేమ చూపాల్పిన ఓ తల్లి తనకు పుట్టిన బిడ్డలను తానే చంపింది. అంతటితో ఆగకుండా వారి మృతదేహాలను ఏళ్ల పాటు ఫ్రిజ్‌లో భద్రపరిచిన విషయం ఇటీవల వెలుగు చూసింది.

Published : 23 Jun 2023 21:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. తనకు పుట్టిన బిడ్డలను తానే చంపడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా వారి మృతదేహాలను ఫ్రిజ్‌లో భద్రపరిచింది. రోజులు కాదు.. నెలలు కాదు.. కొన్నేళ్ల పాటు ఇలా ఫ్రీజర్‌లో ఉంచడం గమనార్హం. ఈ వ్యవహారం దక్షిణ కొరియాలో ఇటీవల వెలుగు చూసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. వారెంటు తీసుకొని ఆమెను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.

దక్షిణ కొరియాలోని సువాన్‌ నగరానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరి వయసు 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉంది. వీరు కాకుండా 2018లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. పుట్టిన మరుసటి రోజే ఆ బిడ్డను చంపి ఇంట్లోని ఫ్రిజ్‌లో పెట్టింది. తర్వాత 2019 నవంబర్‌లో మరో పాప పుట్టగా.. ఇదే దారుణానికి ఒడిగట్టింది. ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్నప్పటికీ పుట్టిన తర్వాత పిల్లల పేర్లు ఎక్కడ నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మేలో అధికారులు ఆరా తీయగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.  తొలుత పోలీసుల దర్యాప్తునకు ఆమె సహకరించలేదు. దీంతో సెర్చ్‌ వారెంట్‌ తీసుకొని వచ్చి ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. ఆ క్రమంలోనే ఫ్రిజ్‌లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ఆ హత్యలు తానే చేసినట్లు అంగీకరించింది. పిల్లల్ని పోషించే ఆర్థిక స్థితి లేకపోవడంతోనే అలా ప్రాణాలు తీసినట్లు తెలిపింది. తన భార్య అబార్షన్‌ చేయించుకున్నట్లు చెప్పిందని.. అందుకే ఈ దారుణం గురించి తనకు తెలియదని భర్త పోలీసులకు చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని