పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసి.. పారిపోయిందని నమ్మబలికాడు!

ప్రేమ పెళ్లి చేసుకున్న మూడు నెలలకే భార్యను అమ్మేశాడో భర్త. ఆర్థిక సమస్యలున్నాయని పని కోసం రాజస్థాన్‌కు తీసుకెళ్లి.....

Updated : 24 Oct 2021 11:57 IST

భువనేశ్వర్‌: ప్రేమ పెళ్లి చేసుకున్న రెండు నెలలకే భార్యను అమ్మేశాడో భర్త. ఆర్థిక సమస్యలున్నాయని పని కోసం రాజస్థాన్‌కు తీసుకెళ్లి.. అక్కడే మరో వ్యక్తి ఇంట్లో వదిలేసి వచ్చాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని బెల్​పాడా పోలీస్‌స్టేషన్​ పరిధి సులేకేలా గ్రామానికి చెందిన మైనర్‌ (17) బొలంగిర్​కు చెందిన యువతితో ఫేస్‌బుక్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి వారు పెళ్లి చేసుకున్నారు.

పెళ్లైన రెండు నెలల తర్వాత ఆర్థిక సమస్యలున్నాయని, ఇటుకల బట్టీలో పనిచేద్దామని చెప్పి భార్యను రాయ్​పూర్‌ తీసుకెళ్లాడు​. ఆ తర్వాత అక్కడి నుంచి రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ ఓ 55 ఏళ్ల వ్యక్తి రూ.1.8 లక్షలకు భార్యను అమ్మేసి అతడి ఇంట్లో వదిలేసి వచ్చాడు. ఆ డబ్బుతో విలాసవంతమైన హోటల్‌లో భోజనం చేసి, ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేశాడు. అనంతరం యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని నమ్మబలికాడు.

అయితే, అతడిపై అనుమానం వచ్చిన బాధితురాలి కుటుంబ సభ్యులు బెల్​పాడా పోలీస్‌స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు యువతి రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకోగా వారికి  గ్రామస్థుల నుంచి తిరుగుబాటు ఎదురైంది. రోడ్లను బ్లాక్‌ చేసి వారిని అడ్డుకున్నారు. అతికష్టమ్మీద రాజస్థాన్ పోలీసుల సాయంతో ఆ యువతిని కాపాడి ఒడిశా పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని