Murder: గుమ్మం ముందు చెప్పులు పెడుతున్నాడని చంపేసి...!

క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. గుమ్మం ఎదుట చెప్పులు పెడుతున్నాడని కోపగించిన భార్యాభర్తలు ఓ వ్యక్తిని హత్య చేశారు.

Updated : 05 Mar 2023 19:54 IST

ముంబయి: తమ గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెడుతున్నాడన్న కారణంతో భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. భార్యను పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె భర్త పరారీలో ఉన్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని థానే (Thane) జిల్లాలో చోటు చేసుకుంది. క్షణికావేశం ఎంత నష్టం చేకూరుస్తుందో చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖత్రీ అనే వ్యక్తి నయా నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆ పక్కనే మరో ఇంట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. ఇంటి బయట చెప్పులు పెట్టే విషయంలో ఈ రెండు కుటుంబాలకు గత కొన్నాళ్లుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి ఇంటి ముందు మరొకరు చెప్పులు పెట్టుకోవడం.. ఘర్షణ పడటం.. ఇదే తంతు తరచూ నడుస్తోంది.

శనివారం రాత్రి కూడా ఇదే కారణంతో ఇరుకుటుంబాలవారు మరోసారి గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్యభర్తలు కలిసి ఖత్రీని హత్య చేశారు. అనంతరం భర్త అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్టు చేశారు. ఆమె భర్త కోసం గాలిస్తున్నట్లు నయా నగర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్ జిలానీ సయ్యద్‌ వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. హత్యకు చెప్పుల గొడవలే కారణమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని