Crime news: భార్యను కౌగిలించుకొని తుపాకీతో కాల్పులు.. అదే బుల్లెట్‌కు భర్త బలి!

ఫోన్‌ విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ చివరికి వారి మరణానికి దారితీసింది. ఆవేశంలో సహనం కోల్పోయి భార్యను తుపాకీతో కాల్చగా అదే బుల్లెట్‌కు భర్త కూడా బలయ్యాడు.

Published : 16 Jun 2023 01:37 IST

లఖ్‌నవూ: భార్యను చంపాలని తుపాకీతో కాల్చిన ఓ భర్త చివరకు అదే బుల్లెట్‌కు తానూ బలైపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని  మొరాదాబాద్‌(Moradabad)లోని బిలారీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఖాన్‌పూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనేక్‌ పాల్‌ అనే వ్యక్తి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుమన్‌, నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం సుమన్‌ ఫోన్‌ పోగొట్టుకుంది. ఈ విషయమై అనేక్‌ పాల్‌ తరచూ భార్యతో గొడవపడేవాడు. మంగళవారం ఇంట్లో పూజ ముగిసిన తర్వాత.. మరోసారి ఫోన్‌ గురించి అనేక్‌ పాల్‌ భార్యతో గొడవపడ్డాడు. 

ఈ క్రమంలో సహనం కోల్పోయిన అనేక్‌ పాల్‌.. తన భార్యను గట్టిగా కౌగలించుకుని.. తన వద్ద ఉన్న నాటు తుపాకీతో ఆమె వీపుపై కాల్చాడు. అయితే, ఆమె ఛాతీ నుంచి బయటకు దూసుకొచ్చిన బుల్లెట్‌ అనేక్‌ పాల్‌కు తగలడంతో ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. కాల్పుల శబ్దం విని అనేక్‌ పాల్‌ ఇంట్లోకి వచ్చిన స్థానికులు భారాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు పిల్లలను సంరక్షణాలయానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని